Suryaa.co.in

Telangana

అడ్డంగా దొరికిన అర్వింద్‌కుమార్

-ఎవరి అనుమతి లేకుండానే అడ్డగోలు అనుమతులు
-ఫార్ములా ఈ రేస్ లో సర్కారుకు ముసుగేసిన అర్వింద్
-కేటీఆర్‌కు చెప్పకుండానే చేశారా అన్నదే సందేహం
-కేటీఆర్ చెబితేనే ఖర్చు పెట్టానన్న అర్వింద్
-సీఎస్‌కు అసలు రహస్యం చెప్పిన అర్వింద్?
-రేవంత్ వచ్చిన తర్వాత చర్యలు షురూ

కేసీఆర్ జమానాలో ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ మాట శిలాశాసనం. సీఎస్‌లకు మించిన దర్పం. అందుకే ఆయనకు నాలుగైదు పోస్టులు అడ్డగోలుగా కట్టబెట్టింది. అప్పట్లో కేటీఆర్ చుట్టుపక్కల ఉండే.. నలుగురైదుగురు ఐఏఎస్‌లలో ఆయన కూడా కళ్లు-చెవులు. అంతలావు అర్వింద్.. ఇప్పుడు అడ్డంగా బుక్కయి, అష్టకష్టాల్లో పడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్ వేళ.. సర్కారు అనుమతి లేకుండా, ఫార్ములా ఈ రేస్ కోసం 55 కోట్లు అడ్డగోలుగా, సొంత సొమ్ము మాదిరిగా ఖర్చు పెట్టిన వైనం కొద్దిరోజుల క్రితమే వెలుగుచూసింది. అయితే నాటి మంత్రి కేటీఆర్ నోటిమాటగా చెప్పినందుకే, అంత డబ్బు ఖర్చు చేశానని అర్వింద్ సీఎస్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. అంటే ఈ వ్యవహారంలో కేటీఆర్ కూడా కష్టాలు పడక తప్పదేమో.

కేసీయార్ పాలనలో ఒక మంత్రి నోటిమాటతోనే అరవింద్ కుమార్ రు. 55 కోట్లు ఖర్చులు పెట్టిన విషయం బయటపడింది. 55 కోట్ల రూపాయలు ఖర్చలంటే మామూలు విషయంకాదు. అందుకనే అరవింద్ కుమార్ మీద సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే అడ్వకేట్ జనరల్ తో లీగల్ ఒపీనియన్ కోసం చర్చలు చేస్తోంది.

ఇంతకీ ఏమి జరిగిందంటే కేసీయార్ పాలనలో ఫార్ములా ఈ రేస్ నిర్వహించాలని అప్పటిమంత్రి కేటీయార్ కలలు కన్నారు. అందుకనే అప్పటి హెఎండీఏ ఇన్చార్జిగా ఉన్న అరవింద్ కుమార్ బాధ్యత అప్పగించారు. అరవింద్ కుమార్ కూడా కేటీయార్ ఆదేశాల ప్రకారమే నడుచుకున్నారు. ఫార్ములా ఈ రేస్ కు అవసరమైన ఏర్పాట్లను అర్వింద్ దగ్గరుండి మరీ చూసుకున్నారు.ఆ ఏర్పాట్లకు రు. 55 కోట్లు ఖర్చయ్యింది. రేస్ ప్రారంభానికి ముందే ఎన్నికలు జరగటం, ప్రభుత్వం మారటం అయిపోయింది.

కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ముల ఈ రేస్ ను రద్దుచేసింది. వాతావరణ సహకరించని కారణంగా రేస్ ను ప్రభుత్వం రద్దుచేసింది. ఈ నేపధ్యంలోనే జరిగిన ఏర్పాట్లపై చర్చ మొదలైంది. దాంతో తీగ లాగితే డొంకంతా కదిలింది. మొత్తం ఫైలును తెప్పించి చూస్తే అసలు రేస్ నిర్వహణకు పరిస్ధితులు అనుకూలించవని నిపుణులు చెప్పినా వినకుండా కేటీయార్ ఏర్పాట్లు చేయించినట్లు బయటపడింది. మరి ఖర్చులను ఎలా పెట్టారుని చూసింది ప్రభుత్వం. ఆ వివరాల కోసమే చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ కు నోటీసులు ఇచ్చారు.

నోటీసులకు సమాధానంగా కేటీయార్ నోటిమాటనే ఆదేశంగా తీసుకుని రు. 55 కోట్లు ఖర్చులు పెట్టినట్లు సమాధానం ఇచ్చారని సమాచారం. ఎందుకంటే 55 కోట్ల రూపాయల ఖర్చులకు సంబంధించి ప్రభుత్వం అనుమతులు లేవు. అందుకనే హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న నిధులనే అరవింద్ కుమార్ ఖర్చులు చేసేశారు. ఈ విషయాలు బయటపడటంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ్చర్యపోయింది. అందుకనే ఎవరెవరి మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే విషయాన్ని అడ్వకేట్ జనరల్ తో చర్చలు జరుపుతున్నారు.రేవంత్ లండన్ పర్యటన నుండి తిరిగి రాగానే యాక్షన్ మొదలవ్వచ్చని అనుకుంటున్నారు.

LEAVE A RESPONSE