కొత్త బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్‌

– నేటి నుంచే దరఖాస్తు

ఏపీ నూతన బార్ల విధానంలో భాగంగా రాష్ట్రంలో 840 బార్ల ఏర్పాటుకు ఎక్సైజ్‌శాఖ లైసెన్సులు మంజూరు చేయనుంది. వాటిని ఈ-వేలం ద్వారా కేటాయించే ప్రక్రియకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి 2025, ఆగస్టు 31 వరకు మూడేళ్లకు ఈ లైసెన్సులు మంజూరు చేయనున్నారు. దరఖాస్తుల నమోదు, ఫీజుల చెల్లింపు, జిల్లాల వారీగా ఈ-వేలం, ఇందులో పాల్గొనేవారి అర్హతలను పేర్కొంటూ ఎక్సైజ్‌ కమిషనర్‌ గురువారం నోటిఫికేషన్‌ జారీచేశారు. రాష్ట్రంలో కొత్త బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇవాళ్టి నుంచే దరఖాస్తు నమోదు ప్రారభం అవుతుంది. ఈ-వేలం ద్వారా కేటాయించే ప్రక్రియను అనుసరించనున్నట్లు అధికారులు తెలిపారు.

శుక్రవారం నుంచి ఈనెల 27 వరకు దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకొని, ప్రాసెసింగ్‌ ఫీజు, వెనక్కి ఇవ్వని (నాన్‌ రిఫండబుల్‌) దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు గడువు ఇచ్చారు. ఇందులో వెనక్కి ఇవ్వని దరఖాస్తు ఫీజును 28వ తేదీ సాయంత్రం వరకూ చెల్లించే అవకాశం కల్పించారు. దరఖాస్తుల సమర్పణ, ఈ-వేలం నిర్వహణకు జోన్ల వారీగా తేదీలు నిర్ణయించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా గ్రేటర్‌ విశాఖ కార్పొరేషన్‌ పరిధిలో 128, విజయవాడలో 110, గుంటూరులో 67, నెల్లూరులో 35 చొప్పున బార్లకు ఈ-వేలం వేస్తారు.

Leave a Reply