Suryaa.co.in

Andhra Pradesh

పేద, బడుగు, బలహీన వర్గాల ఆరాధ్య దైవం స్వర్గీయ ఎన్టీఆర్

– ఎన్టీఆర్ ఆశయాలను సాధించే దిశగా పనిచేస్తున్నా
– ఒక్క అవకాశం ఇస్తే 2024 ఎన్నికల్లో సత్తా చూపిస్తా
– తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేయటమే లక్ష్యం
– గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు

గుడివాడ, జనవరి 18: పేద, బడుగు, బలహీన వర్గాల ఆరాధ్య దైవం స్వర్గీయ ఎన్టీఆర్ అని కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు అన్నారు. బుధవారం గుడివాడ నియోజకవర్గంలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో ఆయన విస్తృతంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన సభల్లో మాజీ ఎమ్మెల్యే రావి మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం పార్టీని స్థాపించి తెలుగుదేశం పిలుస్తోంది.. రా! కదలిరా! అంటూ ప్రజలందరినీ ఎన్టీఆర్ చైతన్యవంతం చేశారన్నారు. ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడారని గుర్తు చేశారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే 97 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం ఎన్టీఆర్ అనేక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లో మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని అన్నారు.

ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నేటికీ బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటోందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఎన్టీఆర్ ఆశయాలను సాధించేదిగా పనిచేస్తున్నానని తెలిపారు. 2024 ఎన్నికల్లో తనకు ఒక అవకాశం ఇస్తే గుడివాడలో గెలిచి తన సత్తా చూపుతానన్నారు. గుడివాడ ప్రజలందరి కష్టాలను తీరుస్తానన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో గుడివాడలో రాక్షస పాలనకు చరమగీతం పాడతానని చెప్పారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన అందరి లెక్కలూ సరి చేస్తానని తెలిపారు. ఎన్టీఆర్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేయటమే తన లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే రావి చెప్పారు.

ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నేతలు దింట్యాల రాంబాబు, వాసే మురళి, డాక్టర్ గోర్జి సత్యనారాయణ, ముళ్ళపూడి రమేష్ చౌదరి, సన్యాసిరావు, జడ్పీ మాజీ వైస్ చైర్పర్సన్ శాయన పుష్పావతి, టీడీపీ మాజీ కౌన్సిలర్లు శొంఠి రామకృష్ణ, వసంతవాడ దుర్గారావు, అడుసుమిల్లి శ్రీనివాసరావు, పొట్లూరి వెంకట కృష్ణారావు, మైనార్టీ నాయకులు షేక్ జబీన్, ముజాహిద్దీన్, జానీ, టిడిపి మహిళాధ్యక్షురాలు యార్లగడ్డ సుధారాణి,బీ లక్ష్మి, కాపు నాయకులు పోలాసి ఉమామహేశ్వరరావు, పండ్రాజు సాంబశివరావు, దారపురెడ్డి శేష్ కుమార్, పట్టపు చిన్నా, వంగపండు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE