– మంత్రి లోకేష్ పర్యవేక్షణ
– వెల్లువెత్తుతున్న విరాళాలు
విజయవాడ: బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి. అలాగే వరద సహాయ చర్యలు జోరందుకున్నాయి. వీటిని మంత్రి లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. కట్టుబట్టలతో మిగిలిన బాధితులను ఆదుకునేందుకు దాతలు పెద్దఎత్తున స్పందిస్తున్నారు. మంత్రి లోకేష్ ను కలిసి ప్రముఖులు చెక్కులను అందజేస్తున్నారు.
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి రూ. 10 లక్షలు, మల్లెల రాజేష్ నాయుడు 10 లక్షలు, అమలాపురం ఎంపీ గంటి హరీష్, రాజమండ్రి ఎంఎల్ఏ ఆదిరెడ్డి వాసు, పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న రూ. 5లక్షల చొప్పున అందజేశారు. విజయవాడకు చెందిన బుద్దిరాజు శివాజీ రూ. 5లక్షల అందజేశారు. దాతలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
బుడమేరు గండ్ల పూడ్చవేత పనులను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి డ్రోన్ లైవ్ ద్వారా లోకేష్ పర్యవేక్షిస్తుండగా, రెండో గండి పూడ్చివేత పనులు తుది దశకు చేరుకున్నాయి. క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి రామానాయుడుతో లోకేష్ సమన్వయం చేసుకుంటున్నారు.