Suryaa.co.in

Andhra Pradesh

అమరావతిని అవహేళన చేసిన నానీకి కాలమే సమాధానం చెబుతుంది

– తెలుగుదేశంపార్టీని చూస్తారు తప్ప.. వ్యక్తుల్నికాదని నానీకి త్వరలోనే అర్థమవుతుంది
– మాజీ మంత్రి నెట్టెం రఘురామ్

తన అహంకారంతో చంద్రబాబు, లోకేశ్ లపై నిందలేసి, అమరావతిని అవహేళన చేసిన నానీకి కాలమే తగిన సమాధానం చెబుతుంది. కేశినేని నాని టీడీపీని వీడిన వ్యవహారంలో పార్టీ ఎక్కువా.. వ్యక్తి ఎక్కువా అన్నది చూడాలని, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఎవరైనా సరే ఎంత బాధ్యతతో, క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నారు అన్నదే ముఖ్యమని మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ అభిప్రాయపడ్డారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

” టీడీపీ అధికారంలో ఉండి నానీ ఎంపీగా ఉన్నప్పుడు ఆయనకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేవు. నానీ రెండోసారి ఎంపీగా గెలిచాక స్థానిక టీడీపీ నాయకులతో, కార్యకర్తలతో వ్యవహరించిన తీరు ఆక్షేపణీయం. తానే విజయవాడకు అధిష్టానం అన్న విధంగా పార్టీకి ఇబ్బందికరంగా నానీ వ్యవహరించారు. పార్టీ నిర్ణయాలు, కార్యక్రమాలలో ఎడముఖం పెడముఖంగా వ్యవహరిస్తూ, తనను తాను అందరికంటే అతీతుడిగా ఊహించుకుంటూ మందుకెళ్లాడు. మహానాడుకు హాజరు కాకపోవడం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం చేశారు.

చాలా సంవత్సరాలుగా పార్టీ తనకు ఇచ్చిన అవకాశాన్ని ఆయన దుర్వినియోగం చేసుకున్నారు. తనను తాను ఎక్కువగా ఊహించుకుంటూ పార్టీ పట్ల, నాయకుల పట్ల నిర్లక్షధోరణితో వ్యవహరించారు. తన బస్సుల వ్యాపారం (ట్రావెల్స్ బిజినెస్) నష్టపోయాయని, రూ.2వేల కోట్ల ఆస్తులు అమ్ముకున్నానని కూడా నానీ అన్నారు. కానీ దానివెనుకున్న వ్యక్తులు, కారణాల మాత్రం ఆయన వెల్లడించలేదు. పదేళ్లపాటు గౌరవమైన లోక్ సభ సభ్యుడిగా కొనసాగే అవకాశమిచ్చిన చంద్రబాబుని తప్పుపట్టారు.

అరాచకవాది..అవకాశవాది ఇద్దరూ ఒకరికి ఒకరు సరిపోతారు
తన స్వార్థంకోసం నేడు అరాచకవాది పక్కన చేరారు. అవకాశవాది నానీ, అరాచకవాది జగన్ రెడ్డి ఇద్దరూ ఒకరికి ఒకరు సరిపోతారు. ముందుగా మాట్లాడి ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చాకే నానీ, నిన్న ముఖ్యమంత్రిని కలిశాడని అర్థమైంది. నానీ తనకు తాను తెలుగుదేశాన్ని దూరం పెట్టారు తప్ప..ఏ సందర్భంలో, ఎప్పుడూ కూడా పార్టీ ఆయన్ని దూరం పెట్టలేదు. చంద్రబాబు సమక్షంలో ఒకలా ఉంటూ, బయటకు వెళ్లాక తనకు నచ్చినట్టు నియంత్రత్వ పోకడలతో నానీ వ్యవహరించడాన్ని ఇన్నాళ్లుగా టీడీపీ భరించింది. ఇన్నాళ్లు నానీతో కలిసున్నవారంతా తెలుగుదేశంలోనే ఉంటారు తప్ప, ఆయనతో కలిసి వెళ్లడానికి సుముఖంగా లేరు. టీడీపీని వీడాక తన పరిస్థితి ఏమిటనేది నానీకి భవిష్యత్ లో బోధపడుతుంది.

అంబటి రాయుడు వైసీపీని వీడటానికి గల కారణాలు కూడా సాక్షి పత్రికలో రాస్తే బాగుండేది
నానీ టీడీపీ నుంచి వెళ్లిపోవడాన్ని భూతద్దంలో చూపిస్తూ సాక్షి పత్రిక అసత్యాలు వండివార్చింది. నానీని వాడుకునే క్రమంలో సాక్షి మీడియా తెలుగుదేశం పార్టీని, నాయకత్వాన్ని కించపరిచేవిధంగా వ్యవహరిస్తోంది. నానీని టీడీపీ డబ్బులు అడిగిందని… ఎంపీ టిక్కెట్ కోసం రూ.150కోట్లు ఇవ్వాలని ఒత్తిడి చేసిందని, ఆ మొత్తం ఆయన ఇవ్వనన్నందుకే బయటకు వెళ్లిపోయేలా చేశారని సాక్షి పత్రికలో విషపురాతలు రాశారు. అదే సాక్షి మీడియా క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి ఎందుకు గుడ్ బై చెప్పాడో, దానివెనకున్న కథాకమామీషు ఏమిటో కూడా ప్రజలకు తెలియచేస్తే బాగుంటుంది.

టీడీపీలో ఉన్నప్పుడు ఒకలా…ఇప్పుడు ఒకలా మాట్లాడటంపై నానీ ఆలోచించుకోవాలి
నిజంగా నానీకి పార్టీపై ప్రేమ, బాధ్యత ఉంటే మనస్సాక్షి ప్రకారం నడుచుకుంటే చంద్రబాబుని అనేవాడు కాదు. తిరువూరు నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దని, ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సిన గౌరవం ఇస్తారని చంద్రబాబునాయుడు నానీకి తెలియచేశారు. అధినేత సూచనను ధిక్కరించి నానీ తిరువూరులో జరిగిన రా..కదిలిరా సభకు రావడం.. అక్కడ గొడవ జరగడం అందరూ చూశారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలుస్తుంది. నానీ వెంట వెళ్లడానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ సిద్ధంగా లేరు.

చంద్రబాబు ఆదేశాలతో నేను, ఆలపాటి రాజేంద్రప్రసాద్, కొనకళ్ల నారాయణ గతంలో నానీని కలిసి పార్టీ అభిప్రాయాలు, ఆలోచనలు చెప్పినప్పుడు, తాను సర్దుకుపోతానన్నాడు. మరలా వెంటనే మాటమార్చి తనకు అవమానం జరిగిందన్నాడు. పార్టీని వీడటం..వైసీపీలోచేరడం నానీ వ్యక్తిగతం. కానీ టీడీపీలో ఉన్నప్పుడు ఒకలా.. ఇప్పుడు మరోలా మాట్లాడటంపై నానీనే ఆలోచించుకోవాలి. తనను ఎంపీని చేసి, పదవిచ్చి గౌరవించిన చంద్రబాబుని, పార్టీకోసం శ్రమిస్తున్న లోకేశ్ ను నానీ నిందించడాన్ని ప్రజలు హర్షించరు. ప్రజలు తెలుగుదేశంపార్టీని చూస్తారు తప్ప.. వ్యక్తుల్నికాదని నానీకి త్వరలోనే అర్థమవుతుంది.” అని రఘురామ్ సూచించారు.

LEAVE A RESPONSE