Suryaa.co.in

Andhra Pradesh Entertainment Telangana

2024లో పవన్ కల్యాణ్ను సీఎం చేయడమే మా లక్ష్యం

– చిరు, పవన్, రాంచరణ్ అభిమానుల సదస్సులో అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామినాయుడు

విజయవాడ: అభిమానులు పవన్ కల్యాణ్తో నడుస్తారని అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామినాయుడు అన్నారు. విజయవాడలోని మురళి ఫార్చూన్ హోటల్లో పవన్, చిరు, రామ్చరణ్ అభిమానులు సమావేశం నిర్వహించారు. 2024లో పవన్ కల్యాణ్ను సీఎం చేయడమే తమ లక్ష్యమని స్వామినాయుడు తెలిపారు.

జనసేనను జనంలోకి తీసుకెళ్లేలా తమ వంతు కృషి చేస్తామని అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామినాయుడు స్పష్టంచేశారు. విజయవాడలోని మురళి ఫార్చున్ హోటల్లో నిర్వహించిన పవన్, చిరు, రామ్చరణ్ అభిమాన సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెగా అభిమానులు పవన్ కల్యాణ్తో నడుస్తారని చెప్పారు. 2024లో పవన్ కల్యాణ్ను సీఎం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.

మరికొన్ని సమావేశాల అనంతరం జనసేన అధికారంలోకి వచ్చేలా ప్రణాళిక బద్ధంగా పని చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. అభిమానులకు, నాయకులకు మధ్య అంతరాలు లేవని, పార్టీ ఆదేశాలను పాటిస్తూ ముందుకు వెళతామని, మెగా అభిమానులు అందరూ జనసేన కార్యకర్తలుగా పని చేస్తారని పేర్కొన్నారు. పొత్తుల అంశం తమ పరిధి కాదని, పెద్దలు నిర్ణయిస్తారని వివరించారు. గతంలో ప్రజారాజ్యం పార్టీపై అనేక కుట్రలు చేశారని, అయినా కుటుంబాలు వదిలి ఆనాడు చిరంజీవి కోసం పని చేశామని స్వామినాయుడు తెలిపారు.

ఇప్పుడు జనసేనపై అసత్యాలు, పవన్పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ సీఎం కావడం కోసం అందరూ సంకల్పంతో పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. మెగా అభిమానులు అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తున్నమన్నారు. నాగబాబు త్వరలో అభిమానులందరితో ప్రత్యేకంగా భేటీ అవుతారని, నాదెండ్ల మనోహర్, నాగబాబు ఆదేశాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా మెగా అభిమానులను సమాయత్తం చేస్తున్నట్లు స్పష్టంచేశారు. జనసేన పార్టీకి అభిమానులు అందరు అండగా ఉన్నారని ఆయన తెలిపారు.

 

LEAVE A RESPONSE