Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో అవినీతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణాల్లో జరిగిన అత్యంత భారీ అవినీతిపై దృష్టి సారించి, వెంటనే సీబీఐతో విచారణ చేయించాలని గౌరవ ప్రధానమంత్రి  నరేంద్ర మోదీని కోరుతూ  పవన్ కళ్యాణ్ శనివారం లేఖ రాశారు. లేఖలోని ప్రధాన అంశాలు…

1. పేదలకు సొంతిల్లు పేరుతో కేవలం స్థలాలను సేకరించడం కోసం వైసీపీ ప్రభుత్వం రూ.35,141 కోట్ల నిధులను వెచ్చించింది. ఇందుకు సంబంధించి ఖర్చు చేసిన నిధుల్లో గోల్ మాల్ జరిగింది. భారీగా నిధులు పక్కదారి పట్టాయి.
2. పేదలకు సంబంధించి ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం రూ.1,75,421 కోట్లు అయితే, ప్రభుత్వం మాత్రం రూ.91,503 కోట్లుగా చెబుతోంది. ఈ అంశంలో అనేక సందేహాలున్నాయి.
3. ఇళ్ల విషయంలో ప్రభుత్వం పేదలను మోసం చేయడమే కాకుండా, ప్రజాధనాన్ని పూర్తిగా దోపిడీ చేసినట్లుగా కనిపిస్తోంది.
4. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలందరికీ ఇళ్లు పథకం పేరుతో 30 లక్షల గృహాలు నిర్మిస్తామని చెప్పింది. 29,51,858 మంది మహిళల పేరుతో స్థలాలను ఇవ్వాలని నిర్ణయించారు. అయితే వాస్తవంలో 21.87,985 మందికే పట్టాలకు లబ్ధిదారులను గుర్తించారు.
5. మొదట చెప్పినట్లుగా 30 లక్షల గృహాలను నిర్మించకుండా కేవలం 17,005 జగనన్న లే అవుట్లలో కేవలం 12,09,022 ఇళ్ల స్థలాలు మాత్రమే ఇచ్చారు.
6. ఈ మొత్తం పథకంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాధనాన్ని భారీగా పక్కదారి పట్టించింది. పథకం పేరుతో వైసీపీ నాయకులు భారీగా లాభపడ్డారు.
7. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పేదలందరికీ ఇళ్లు పథకంలో కేంద్ర ప్రభుత్వ గృహ స్కీంలను కలిపేసింది. పీఎంఏవై (అర్బన్, రూరల్), జేజేఎం, ఎంజీఎన్ఆర్ఈజీపీ, ఎస్బీఎం తదితర కేంద్ర పథకాల నిధులను ఇష్టానుసారం కలిపేసి ఆ నిధులను వైసీపీ పథకానికి వాడుకున్నారు.
8. పేదలందరికీ ఇళ్లు పథకం నిర్వహణ ప్రక్రియలో వైసీపీ ప్రభుత్వం తేదీల వారీగా ఇలా చేసింది..
• మే 29, 2021 – 30 లక్షల ఇళ్ల స్థలాలను పేదలకు అందిస్తామన్నారు.
• జూన్ 10, 2021 – 30.76 లక్షల ఇళ్ల స్థలాలను అందించేందుకు 68,381 ఎకరాల భూమిని సేకరించారు. 28.30 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. (నీతి ఆయోగ్ కి ఇచ్చిన నివేదికలో సమాచారం ప్రకారం)
• అక్టోబరు 7, 2022 – 31 ఇళ్ల స్థలాలు, ఒక్కో స్థలం ఖరీదు రూ.5 నుంచి రూ.10 లక్షలు అని తెలిపారు.
• మార్చి 17, 2022 – 30.76 లక్షల ఇళ్ల స్థలాలు. దీనికోసం 71,811 ఎకరాల భూమి సేకరణ. మార్కెట్ విలువ ప్రకారం రూ.25 వేల కోట్లతో సేకరించారు.
• మే 29, 2022 – 30 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ అని ప్రకటన.
• నవంబరు 9, 2022 – 30.20 లక్షల ఇళ్ల స్థలాలను పంపిణీ అని గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రకటన
• డిసెంబరు 30, 2022 – 21.26 లక్షల లబ్ధిదారుల కోసం చేస్తామన్న ఖర్చు రూ. 53,296 కోట్లు. ఇళ్ల స్థలాల పట్టాలు మొత్తం 30.76 లక్షలు. దీని కోసం పెట్టిన మొత్తం ఖర్చు రూ.75,670.05 కోట్లు.
9. ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరు 12, 2023న 5 లక్షల ఇళ్లకు గృహప్రవేశం అంటూ ఇచ్చిన పత్రికా ప్రకటనలో దీనికోసం రూ.56,102 కోట్లు భూ సేకరణ కోసం ఖర్చు చేసినట్లు పేర్కొంది.
10. ఇది మొదట చెప్పిన లెక్కకు చాలా వ్యత్యాసం. మొదట్లో కేవలం భూ సేకరణ కోసం రూ.35,151 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పిన లెక్కకు, పత్రికా ప్రకటనలో చెప్పిన లెక్కకు చాలా తేడా ఉంది.
11. గృహ నిర్మాణం కోసం వైసీపీ ప్రభుత్వం గత అయిదు రాష్ట్ర బడ్జెట్ లలో రూ.23,106.85 కోట్లు మేర కేటాయించింది. అయితే దీనిలో వ్యయం చేసింది మాత్రం కేవలం రూ.11,358.87 కోట్లు.
12. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై (అర్బన్) పథకం ద్వారా రాష్ట్రానికి విడుదల చేసింది రూ.14,366.08 కోట్లు.
13. ఈ మొత్తం పథకంలో ఉన్న అన్ని విషయాలను గమనించి ఈ పథకం అమలు తీరుపై సీబీఐతోపాటు ఈడీ విచారణ చేపడితే పేదల గృహ నిర్మాణ పథకంలో చోటు చేసుకున్నా మరింత లోతైన అవినీతి బయటపడే అవకాశం ఉంది. వేల కోట్లు ప్రజా ధనం ఏ విధంగా పక్కదారి పట్టిందో బయటపడుతుంది.

LEAVE A RESPONSE