– ముఖ్యనేతలతో పవన్ కీలక భేటీ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో ప్రస్తుతం వరహి పర్యటనలకు కాస్త బ్రేక్ ఇచ్చి పార్టీ ముఖ్యనేతలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులకు టికెట్ కేటాయింపులపై చర్చలు జరుపుతున్నారు. ఈ భేటీలో భాగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు పవన్. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులకు టికెట్లు కేటాయించినట్లు ఈసారి కేటాయించమని తేల్చి చెప్పేశారు.
గతంలో ఉదాసీనంగా వ్యవహరించామని ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. టికెట్లు ఆశించే అభ్యర్థి వ్యక్తిగతంగా 10 నుంచి 15 వేల ఓట్లు తెచ్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలని చెప్పారు. అలా ప్రజల్లో ఆదరణ ఉన్న వారికి మాత్రమే టికెట్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. గతంలో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే టీడీపీ నేతలతో సఖ్యతతో మెలగాలని దిశానిర్థేశం చేశారు. టీడీపీ పార్టీతో సయోధ్యతో ప్రయాణం చేసిన వారికి తొలి ప్రాధాన్యత ఇస్తానన్నారు.