Suryaa.co.in

Andhra Pradesh

ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు ప్రజలు సిద్ధం

-రాష్ట్ర అభివృద్ధిపై చర్చించేదుకు వైసీపీ నాయకులకు దమ్ముందా?
-ఒక్క చాన్సే జగన్ కు రాజకీయంగా చివరి చాన్స్
-రూ.10 ఇచ్చి రూ.100 దోచిన జగన్ సంక్షేమ గురించి చెప్పడమా?
-రైతుల సబ్సిడీల నిలిపివేసిన జగన్ కు సీమలో సభ పెట్టే అర్హతే లేదు
– మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ

వచ్చే ఎన్నికల్లో ఫ్యాను రెక్కలు విరిచెయ్యడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారు. ఎవరిది అభివృద్ది పాలనో.. ఎవరిది విధ్వంస పాలనో ప్రజలకు తెలుసు. బూటకపు ప్రసంగాలు కాదు…దమ్ముంటే వైసీపీ నాయకులు బహిరంగ చర్చకు రావాలి? ఎవరి పాలన స్వర్ణయుగమో…ఎవరి పాలన రాతి యుగమో తేల్చేద్దాం. రాష్ట్ర అభివృద్ధిపై చర్చించేదుకు వైసీపీ నాయకులకు దమ్ముందా?

జగన్ సిద్దం అని సభలు పెట్టి…అశుద్దం మాటలు చెబుతున్నారు. 2019లో ప్రజలు ఇచ్చిన ఒక్క చాన్సే జగన్ కు రాజకీయంగా చివరి చాన్స్. ఓటమి భయంతో బదిలీలు అంటూ 77 మందిని జగన్ మడతపెట్టాడు. మిగిలిన వాళ్లను 50 రోజుల్లో ఇక జనం మడత పెడతారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచిన జగన్ సంక్షేమ గురించి చెప్పడమా? రాష్ట్రంలో ఏ మూల చూసినా అభివృద్ది లేదు.

ఏ ఊరుకెళ్లినా వైసీపీ పాలనలోని 5 ఏళ్ల విధ్వంసం కనిపిస్తోంది. వందల కోట్లు ఖర్చు చేస్తూ….అధికార దుర్వినియోగంతో సిద్ధం అని సభలు పెడుతున్నారు. జగన్ నోటి నుంచి వచ్చేవి అన్నీ అసత్యాలు, బూటకపు ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలు. రూ.10 ఇచ్చి రూ.100 దోచేయడం జగన్ సంక్షేమం. సహజ వనరుల దోపిడీతో, స్కాం కోసమే స్కీం పెట్టాడు. దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి గా మారిన జగన్ కు పేదల జీవితాల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది?

అన్ని వర్గాలను మోసం చేసి జగన్ సామాజిక ద్రోహం చేస్తున్నారు. సామాజిక న్యాయం అనే పదం పలికే అర్హతే జగన్ రెడ్డికి లేదు. రాయలసీమలోని 52 నియోజకవర్గాల్లో ప్రయాణికులను ఇబ్బంది పెట్టి ఆర్.టి.సి, స్కూల్ బస్సుల్ని లాక్కొని జనాన్ని బలవంతంగా రాప్తాడు సభకు తరలించారు. సభ నిజంగా సక్సెస్ అయ్యి ఉంటే జగన్ రెడ్డి రౌడీ గ్యాంగ్ వార్తలు కవర్ చేసే మీడియా సిబ్బందిపై ఫ్రస్టేషన్ తో దాడులు ఎందుకు చేశారు అని ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికలు నిజమైన పెత్తందారు జగన్ కు 5 కోట్ల ప్రజలకు మధ్య యుద్ధం. టీడీపీ తెచ్చిన 120 సంక్షేమ పథకాలను జగన్ రెడ్డి రద్దు చేశారు. ఎస్.సి., ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు లక్ష కోట్ల రూపాయలు దారి మళ్లించారు. చంద్రబాబు పేరు పేరు చెబితే దళితులకు ఇచ్చిన సబ్ ప్లాన్ నిధులు, ఇన్నోవా కార్లు, నిరుద్యోగ భృతి, 1.50 లక్షల టీచర్ పోస్టులు, రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ, చంద్రన్న బీమా, అమరావతి, 16 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలు, పోలవరం గుర్తుకు వస్తాయి.

జగన్ రెడ్డి పేరు చెబితే బాబాయిపై గొడ్డలి వేటు, కోడికత్తి శీను, ప్రభుత్వ టెర్రరిజం, క్విడ్ ప్రోకో, ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియా గుర్తుకొస్తాయి. జగన్ పేరు చెపితే అధిక ధరలు, పన్నులు, ఛార్జీల పెంపు, అప్పులు, బాదుడు, మోసాలు, దొంగ ఓట్లు, హింసా రాజకీయాలు గుర్తుకువస్తాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులను రివర్స్ చేసి, రైతుల సబ్సిడీల నిలిపివేసిన జగన్ కు అసలు రాయలసీమలో సభ పెట్టే అర్హతే లేదు.

LEAVE A RESPONSE