Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డికి మే 13న ప్రజలు జగన్ రెడ్డికి షాక్‌ ఇస్తారు

– ఐదేళ్లలో 10 సార్లు విద్యుత్ ఛార్జీల పెంపుతో జనం నుంచి కొట్టేసినంత విలువ కూడా జగన్ రెడ్డి అమ్మఒడి పథకానికి ఖర్చు చేయలేదు
– రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న అప్పులు, వడ్డీలు కట్టలేని దుస్థితిలో జగన్ రెడ్డి ఉన్నారు.
ఆర్.ఈ.సి నుంచి రూ.38,666 కోట్ల అప్పులకు నెలవారీ వడ్డీలు రూ.1516 కోట్లు బకాయిపడ్డారు
– ఆర్.ఈ.సీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ కుమార్ దేవంగన్ సి.ఎస్‌కు లేఖ రాసి తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టని యెడలా ఆర్.బి.ఐకి పిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
-తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

మంగళగిరి: విద్యుత్ ఛార్జీల పేరుతో వినియోగదారులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్న జగన్ రెడ్డికి మే 13 న జగన్ రెడ్డికి ప్రజలు షాక్ ఇస్తారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. జగన్‌రెడ్డి బాధుడు కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోందని..2019 జూన్ నుంచి నేటి వరకు జగన్ రెడ్డి బాదుడు లేని నెల గానీ, వేయని భారం గానీ లేదన్నారు.

జగన్ రెడ్డి పదవ దఫా పెంచిన విద్యుత్ ఛార్జీల బాదుడుపై పట్టాభిరామ్ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. ‘ జగన్ రెడ్డి ఐదేళ్లలో పదిసార్లు విద్యుత్ ఛార్జీల పెంచి అక్షరాలా రూ.27,442 కోట్ల భారాలు ప్రజలపై మోపారు. 2014-19 మధ్య రాష్ట్రాన్ని విభజన కష్టాలు ఉన్నా చంద్రబాబు నాయుడు రూపాయి విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. 2019 లోని విద్యుత్ బిల్లు కంటే 2024లోని విద్యుత్ బిల్లులు రెండు, మూడు రెట్లు పెరిగాయి. గతంలో విద్యుత్ బిల్లు వందల్లో వస్తే.. నేడు వేలల్లో వస్తున్నాయి. జగన్ రెడ్డి తన అస్మదీయ కంపెనీలకు దోచిపెట్టినందు వల్లే నేడు రాష్ట్ర ప్రజలు విపరీతమైన విద్యుత్ భారాలు మోయాల్సి వస్తోందన్నారు.

రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ) నుంచి తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేని దుస్థితిలో జగన్ రెడ్డి ఉన్నారు. ఆర్.ఈ.సీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ వివేక్ కుమార్ దేవంగన్ మార్చి 7, 2024 న రాష్ట్ర సి.ఎస్‌కు లేఖ రాసి తీసుకున్న రూ.38,666 కోట్ల అప్పులకు వడ్డీలు చెల్లించకపోతే ఆర్.బి.ఐకి పిర్యాదు చేస్తామన్నారు. ఆర్.ఈ.సి నుంచి తీసుకున్న అప్పులకు నెలవారీ వడ్డీలే రూ.1516 కోట్లు బకాయిపడ్డారని లేఖలో ప్రస్తావించారని గతంలో ఎన్నడూ రాష్ట్రానికి ఈ దుస్థితి రాలేదు. ఆర్.ఈ.సీ నుంచి వార్నింగ్ లెటర్లు అందుకోవడానికి సిగ్గు లేదా? అని పట్టాభిరామ్ ఎద్దేవా చేశారు.

సంక్షేమానికి గొప్పగా ఖర్చు చేశామని చెప్పుకునే జగన్ రెడ్డి ఐదేళ్లలో అమ్మఒడికి ఎంత ఖర్చు చేశావ్? ఐదేళ్లలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలతో జనం నుంచి కొట్టేసిన విలువ కూడా జగన్ రెడ్డి అమ్మఒడి పథకానికి ఖర్చు చేసింది తక్కువే. ఐదేళ్లలో అమ్మఒడికి జగన్ రెడ్డి ఖర్చు చేసింది రూ.26,009 కోట్లు అయితే విద్యుత్ ఛార్జీల బాదుడు ద్వారా జనం నుంచి కొట్టేసింది రూ.27,442 కోట్లు. ఐదేళ్లలో జగన్ రెడ్డి కొత్తగా ప్రవేశపెట్టిన ఒకే ఒక పథకం అమ్మఒడి. ఇందులోను ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని మాట ఇచ్చి మోసం చేశాడు.

జగన్ రెడ్డి తాను అమలు చేశానని చెప్పుకుంటున్న మిగిలిన పథకాలన్ని గతంలో ఉన్నవే. వాటికి పేరు మార్చి జగన్ రెడ్డి తాను అమలు చేశానని చెప్పుకుంటున్నారని పట్టాభిరామ్ విమర్శించారు. ప్రజల జేబులు ఖాళీ చేసి పథకాలకు ఖర్చు చేయడమా.. పరిపాలన అంటే హేళన చేశారు. చెత్తపన్ను, డ్రైనేజీపన్ను, టాయ్‌లెట్ పన్ను..ఇలా ఏ పన్ను వదలకుండా జగన్ రెడ్డి ప్రజలపై బాదుడు కార్యక్రమం కొనసాగించాడు. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి బాదనన్ని పన్నులు జగన్ రెడ్డి ప్రజలపై మోపారు.

జగన్ రెడ్డి బాదుడుపై తెలుగుదేశం పార్టీ ‘బాదుడే…బాదుడు’ అనే పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టాల్సి వచ్చింది. జగన్ రెడ్డి విద్యుత్ ఛార్జీల బాదుడుతో రాష్ట్రం నుంచి పరిశ్రమలు, పెట్టుబడులు ప్రక్క రాష్ట్రాలకు పారిపోయాయి. జగన్ రెడ్డి సంపద సృష్టించలేదు. ఆదాయం పెంచలేదు. కానీ, ఐదేళ్లలో జగన్ రెడ్డి చేసిన ఒకే ఒక్క పని ప్రజలను బాదడం…తద్వారా లూటీ చేసిన సొమ్ములను దింగమింగడం మాత్రమే.

అందులో ప్రజలకు పది పైసలు చిల్లర వేసి సంక్షేమం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఇది చాలదన్నట్లు రకరకాల కార్పొరేషన్ల నుంచి అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచాడు. అప్పులు, బాదుడు రూపంలో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినా రాష్ట్రంలో కనీస మౌళికసదుపాయాల రూపకల్పన చేయలేదు. రైతుల మోటార్లకు మీటర్లు బిగించి వారి మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారు. అప్పులు అదనంగా తెచ్చుకోవడానికి రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తావా జగన్ రెడ్డి? అని హెచ్చరించారు.

విద్యుత్ ఛార్జీలు పెరుగుదలతో పరిశ్రమలు, వ్యాపారులు దెబ్బతిన్నాయి. గృహ వినియోగదారులు, మద్యతరగతి ప్రజలు దెబ్బతిన్నారు. చంద్రబాబు నాయుడు పైసా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందించారు. 10 వేల మెగావాట్ల అధనపు విద్యుత్ ఉత్పత్తి సాధించారు. కర్నూలులో దేశంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసారు. కానీ, జగన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు భారాలు ప్రజలపై మోపినా రాష్ట్రంలో అప్రకటిత కరెంటు కోతల ఆగడం లేదు.

సోలార్ పవర్ ప్లాంట్ల పేరుతో జగన్ రెడ్డి తన బినామీ కంపెనీలకు వేలాది ఎకరాల భూములు దోచిపెడుతున్నారు. జగన్ రెడ్డి చిత్తశుద్ధితో పునరుత్పాధక విద్యుత్ అభివృద్ధి చేసి ఉంటే..నేడు ప్రజలపై ఇంత భారం మోపే అవసరం ఉండేది కాదు. తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను ఏ విధంగా తగ్గించవచ్చోనని ఆలోచిస్తే జగన్ రెడ్డి ప్రజలపై ఏ విధంగా విద్యుత్ భారం మోపవచ్చోనని ఆలోచిస్తున్నారని అన్నారు.

జగన్ రెడ్డి బాదుడు కార్యక్రమంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. 2019లో చంద్రబాబు నాయుడిని గెలిపించుకుని ఉంటే విద్యుత్ ఛార్జీల బాదుడు ఉండేది కాదని వారు అనుకుంటున్నారు. రెండు రెట్లు పెరిగిన విద్యుత్ బిల్లులు చూస్తున్న ప్రజలకు ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అందుకే జగన్ రెడ్డిపై ప్రజలు చెప్పులు విసురుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ఛార్జీల భారం నుంచి ప్రజలకు ఉపశమనం కల్పిస్తాం. అవసరమైతే ఛార్జీలను తగ్గించేందుకు కృషిచేస్తాం.

తక్కువ ధరకే వచ్చే పునరుత్పాధక విద్యుత్ ఉత్పత్తి అభివృద్ధి చేస్తే ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉండదని చంద్రబాబునాయుడు ఎప్పుడూ చెబుతుంటారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రోత్సహించని విధంగా చంద్రబాబు నాయుడు పునరుత్పాధక విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించారు. కానీ, నేడు జగన్ రెడ్డి మాత్రం సోలార్, విండ్ ముసుగులో వేలాది ఎకరాల దోపిడీకి పాల్పడుతున్నారు. జగన్ రెడ్డి చేసే ప్రతీ స్కీంలో ఒక స్కాం ఉంటుంది. షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ వారికి వేలాది కోట్లు దోచిపెట్టాడు.

విద్యుత్ సంస్థల నుంచి అప్పులు చేసి ఆ సంస్థల నుంచి వార్నింగ్ లెటర్లు అందుకోవడం సిగ్గుచేటు. విద్యుత్ రంగాన్ని అన్ని విధాలా నాశనం చేసి భ్రష్టుపట్టించిన వ్యక్తి జగన్ రెడ్డి. విద్యుత్ ఛార్జీల పేరుతో రూ.24,442 కోట్ల భారాలు ప్రజలపై మోపిన జగన్ రెడ్డికి త్వరలోనే తగిన గుణపాఠం జరగబోతోందన్నారు. పదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్న జగన్ రెడ్డికి మే-13న ప్రజలు జగన్ రెడ్డికి షాక్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు

LEAVE A RESPONSE