Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌తోనే కాపులకు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం

-కాపు సామాజిక వర్గానికి ప్రభుత్వంలో పెద్దపీట
-అన్ని పధకాలు, రంగాలలో అత్యధిక ప్రాధాన్యం
-చంద్రబాబు కంటే లక్ష రెట్లు మేలు చేసిన ప్రభుత్వం
-మూడేళ్లలో కాపులకు దాదాపు రూ.27 వేల కోట్లు
-గతంలో వైయస్సార్‌ ప్రభుత్వం ఒక్కటే కాపులకు మేలు
-మళ్లీ జగన్‌ ప్రభుత్వంలో గౌరవంగా బతుకుతున్నాం
-కాపు ఎమ్మెల్యేలపై పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
-రంగా హత్య ఘటనపైనా పవన్‌ కళ్యాణ్‌ అనైతిక మాటలు
-రంగాను కాపులు ఎందుకు కాపాడుకోలేదని పవన్‌ ప్రశ్నించారు
-అదే రంగాను చంపించిన చంద్రబాబుతో వెంటనే భేటీ అయ్యారు
-ఈ విషయాన్ని కాపు సోదరులు, సామాజికవర్గం గమనించాలి
-జనసేన రాజకీయ పార్టీ కాదు. ఒక విధానం లేదు
-అది కేవలం సెలబ్రిటీ పార్టీ మాత్రమే
-తమకు 10 సీట్లు ఇవ్వాలని పవన్‌ ఎవరినో కోరాడు
-అంటే ఎవరికో పార్టీని తాకట్టు పెడుతున్నాడనే కదా?
-పవన్‌ను తిట్టేందుకు మేము సమావేశం కాలేదు
-ఆయన్ను తిట్టలేదు. నా కొడుకా అనలేదు. చెప్పు చూపలేదు
-మాకు సభ్యత, సంస్కారం ఉంది. స్వశక్తితో ఎదిగాం
-పవన్‌కళ్యాణ్‌ 175 సీట్లలో సింగిల్‌గా పోటీ చేస్తారా?
-ధైర్యం ఉంటే చెప్పండి. మేము అలా పోటీ చేస్తాం
-వైయస్సార్‌సీపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, -ఎంపీలు రాజమహేంద్రవరంలో సమావేశం
-మీడియాతో మాట్లాడిన మంత్రులు బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజా. మాజీ మంత్రి కురసాల కన్నబాబు

బొత్స సత్యనారాయణ. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి:
ఎంతో సంతోషిస్తున్నాం:
రాజమహేంద్రవరం: గత ప్రభుత్వాలన్నీ కాపులను కేవలం ఓటు బ్యాంక్‌గానే చూశాయి. వారిని ఉపయోగించుకుని, ఎన్నికల తర్వాత అస్సలు పట్టించుకోలేదు. కానీ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో మా సామాజికవర్గానికి గౌరవం దక్కింది. అందుకే మేమంతా తృప్తిగా ఉన్నాం. అంతే కాకుండా ఈ ప్రభుత్వంలో రాజకీయపరంగా చూసినా కూడా గత ప్రభుత్వాల కంటే పెద్ద పీట వేశారు. అందుకు అంకెలు కూడా చూపగలం. టికెట్లు ఇవ్వడంలో కానీ, ప్రజలు గెలిపించడంలో కానీ, ఆ తర్వాత నామినేటెడ్‌ పదవుల్లో కూడా మాకు ప్రాధాన్యం ఇచ్చాం. అందుకు ఎంతో సంతోషిస్తున్నాం. అన్ని సామాజికవర్గాలతో పాటు, కాపు సామాజికవర్గం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందే విషయంలో, మాకు అన్ని పథకాల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా, మా కోసం ప్రత్యేకంగా కాపు నేస్తం పథకం అమలు చేస్తున్నారు. ఈ పధకం వల్ల కాపు మహిళలకు దాదాపు రూ.2 వేల కోట్ల మేర ప్రయోజనం కలిగింది.

ఆ వ్యాఖ్యలు ఖండిస్తున్నాం:
ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక వారం క్రితం.. ఒక సెలబ్రిటీ పార్టీ నేత ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడాడో.. మా సామాజికవర్గం గురించి, మా పార్టీలో మా సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులపైనా సభ్య సమాజం తల దించుకునేలా ఎలా మాట్లాడారో చూశాం. వాటన్నింటినీ ఖండిస్తున్నాం.

ఇవాళ ఇందుకు సమావేశం:
వీటితో పాటు, ఇంకా మా సామాజికవర్గం అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమేం చేసింది? ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అన్నది చర్చించాం. ఒక కార్యాచరణ రూపొందించుకున్నాం. వాటిని సీఎంగారి దృష్టికి తీసుకువెళ్తాం. ఆర్థికంగా, సామాజికంగా, విద్య, వైద్య పరంగా మా సామాజివర్గం బాగుండేలా ఏం చేయాలన్న వాటిని చర్చించాం. త్వరలోనే వాటన్నింటినీ సీఎంగారి దృష్టికి తీసుకుపోతాం.
త్వరలోనే విజయవాడలో మళ్లీ సమావేశం అవుతాం. ఇవాళ ఇక్కడ మా పార్టీలో మా సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలం మాత్రమే సమావేశం అయ్యాం. విజయవాడలో జరిగే సమావేశంలో మా పార్టీలో మా సామాజికవర్గానికి చెంది నామినేటెడ్‌ పోస్టుల్లో ఉన్న వారు, జడ్పీ ఛైర్మన్లు, మేయర్లు కూడా పాల్గొంటారు. అలా విజయవాడలో త్వరలోనే విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తాం. తేదీ కూడా త్వరలోనే ప్రకటిస్తాం.

కొట్టు సత్యనారాయణ. డిప్యూటీ సీఎం (దేవాదాయ శాఖ):
అప్పటి కంటే ఎంతో ఘనంగా:
జగన్‌గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూరై్తన సందర్భంగా మా కాపు సామాజికవర్గానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం, అలాగే ఈ ప్రభుత్వం ద్వారా వారికి ఎంత మేలు జరిగిందన్నది అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపు సామాజికవర్గానికి ఏటా రూ.1000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో రూ.5 వేల కోట్లు ఇస్తామని చెప్పినా, వాస్తవంగా ఆ 5 ఏళ్లలో ఇచ్చిన మొత్తం కేవలం రూ.1824.67 కోట్లు మాత్రమే. అదే విధంగా 2,54,335 మంది లబ్ధిదారులే.
అదే జగన్‌ కాపులకు ఏటా రూ.2 వేల కోట్ల చొప్పున 5 ఏళ్లలో రూ.10 వేల కోట్లు ఇస్తామని చెప్పి, ఇప్పటి వరకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా రూ.16,485.02 కోట్లు, నాన్‌ డీబీటీ ద్వారా రూ.10,004.92 కోట్లు.. మొత్తం రూ26,490.12 కోట్లు వివిధ పథకాల ద్వారా కాపు సామాజికవర్గానికి ఇచ్చారు. ఇక లబ్ధిదారుల సంఖ్య ఏకంగా 70,83,373. టీడీపీ ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందిన 2.54 లక్షలు ఎక్కడ? ఇవాళ 70.83 లక్షలు ఎక్కడ? ఇంత పెద్ద ఎత్తున జగన్‌ కాపు సామాజికవర్గాన్ని గుర్తించారు. టికెట్లు ఇవ్వడంలో కానీ, ఆ తర్వాత మంత్రివర్గంలో స్థానం కల్పించడంలో కానీ చాలా గౌరవం ఇచ్చారు. జగన్‌గారి మాదిరిగా గతంలో ఎవ్వరూ ఆ స్థాయిలో కాపులకు మేలు చేయలేదు. మా ప్రభుత్వం ఇన్నిన్ని చేసింది కాబట్టే, గడప గడపకూ కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్తున్నాం. ఈ ప్రభుత్వంలో ఆ ఇంటికి ఎంత లబ్ధి కలిగిందని గణాంకాలతో సహా వివరిస్తున్నాం. దాంతో మాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.

బాబు కోసమే పవన్‌ పని:
వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే, ఇటీవల జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఏవేవో విమర్శలు చేశారు. కానీ ఆయన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో చెప్పిన మాటలు ఏమిటంటే.. ఆనాడు ప్రజారాజ్యం పార్టీకి ద్రోహం చేసిన వారందరినీ గుర్తు పెట్టుకుంటాను. అలాగే ఏ మీడియా అయితే మమ్మల్ని దుమ్మెత్తి పోసి, ప్రజారాజ్యం పార్టీని క్లోజ్‌ చేసే మాదిరిగా పని చేసిందో.. వారందరికీ బుద్ధి చెబుతానని అన్నారు. కానీ అదే పవన్‌కళ్యాణ్, ఆనాడు ఎవరైతే వారికి వెన్నుపోటు పొడిచి, అప్రతిష్టపాల్జేశారో, బురద చల్లారో.. వారితోనే స్నేహం చేస్తూ, వాళ్ల నాయకుడు చంద్రబాబునాయుడుతో అంట కాగుతూ, 2014 నుంచి 2019 వరకు అలా అంటకాగి, ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని చెప్పి, ఆ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు. 2019లో మళ్లీ రాజకీయ పార్టీగా పవన్‌ రావడానికి కారణం.. చంద్రబాబు వ్యతిరేక ఓట్లు చీలకపోతే, జగన్‌గారు లబ్ధి పొందుతారని చెప్పి, చంద్రబాబు వ్యతిరేక ఓట్లు చీల్చడం కోసం పని చేసి, చంద్రబాబు కొమ్ము కాశారు.

పవన్‌ స్వరూపం గుర్తిస్తున్నారు:
ఇవాళ అదే వ్యక్తి మళ్లీ చంద్రబాబుతో మళ్లీ కుమ్మక్కై, విజయవాడలో వారి పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో కాపు సామాజికవర్గాన్ని కించపర్చే విధంగా, ఆ సామాజికవర్గంలో ఉన్న పెద్దలంతా కూడా బాధ పడే విధంగా, ఆ నాయకుడి నోటి వెంట మాటలు వచ్చాయి. దాంతో వారంతా బాధ పడుతున్నారు.
కాపు సామాజికవర్గానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ నుంచి ఎన్నికైన వారికి ఉద్దేశించి.. పవన్‌ అన్న మాటలు.. చెప్పు చూపించిన తీరు చూసిన తర్వాత కాపు సామాజికవర్గంలో అంతా మరోసారి రియలైజ్‌ అవుతున్నారు. ఎందుకంటే 2019లో కూడా కాపు సామాజికవర్గం జగన్‌కి మద్దతు ఇచ్చింది. కాపు సామాజికవర్గంలో ఉన్న ఆడపిల్లల తండ్రులు కూడా పవన్‌ వ్యాఖ్యలతో బాధ పడుతున్నారు. తాను మూడు పెళ్ళిళ్లు చేసుకున్నాను కాబట్టి, మీరూ చేసుకోండంటూ అన్న పవన్‌ వ్యాఖ్యలను కూడా అందరం ఖండిస్తున్నాం.

అంబటి రాంబాబు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి:
బాబు కాపులను అణిచివేశారు:
గత ప్రభుత్వాలు.. తెలుగుదేశం పార్టీ పరిపాలించిన కాలంలో కాపులను అణిచే వేసే కార్యక్రమాలు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే, చంద్రబాబు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, కాపు వ్యతిరేక కార్యకలాపాలు అనేకం చేసి, కాపు వ్యతిరేక పార్టీగా ముద్ర పడింది. ఒకటి దివంగత మోహన్‌రంగా హత్య. రెండు. రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేసిన తీరు. రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభంగారు ఉద్యమం చేస్తే, దాన్ని అణిచి వేయడం కోసం చంద్రబాబు అనుసరించిన విధానం. ముద్రగడ ని కొట్టడం. వారి భార్యను తిట్టడం, వారి కుమారులను వేధించడం, వారందరినీ ఇంట్లో బంధించి, ఒక సెల్‌లో ఉంచినట్లు వేధించడం. కాగా, ఆనాడు వైయస్సార్‌నేతృత్వంలో ఉన్న అప్పటి ప్రభుత్వం కానీ, ఇవాళ జగన్‌గారి నేతృత్వంలో ఉన్న వైయస్సార్‌సీపీ ప్రభుత్వం కానీ, కాపులకు పెద్ద పీట వేసింది. వారిని గౌరవప్రదంగా చూసుకుంటోంది. ఈ మూడున్నర ఏళ్లలో ఇది స్పష్టమైంది.
కాపులకు గుర్తింపు:
ఈ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాల వారు ఎవరైనా సరే.. ఇది వాస్తవం. జగన్‌గారు పరిపాలన చేపట్టినప్పుడు పార్టీ నుంచి 26 మంది కాపులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ముగ్గురు ఎంపీలు, 5గురు శాసన మండలి సభ్యులు కూడా ఉన్నారు. ఇంకా కార్పొరేషన్ల ఛైర్మన్లు, మేయర్లు కూడా ఉన్నారు. ఇంత మందికి గుర్తింపు ఇవ్వడమే కాకుండా, అణగారిపోతున్న కుటుంబాలను ఆదుకోవాలని ఎన్నో చేశారు. ఈ ప్రభుత్వం రూ.26 వేల కోట్లకు పైగా మొత్తం డీబీటీ, నాన్‌ డీబీటీ విధానంలో కాపులకు ఇచ్చింది. కేవలం కాపులకే కాదు, అన్ని వర్గాలకు కూడా ఈ ప్రభుత్వం తగిన నిధులు ఇచ్చింది.

పవన్‌ రాజకీయాలకు అనర్హుడు:
మా ఈ సమావేశం పవన్‌కళ్యాణ్‌ కోసం పెట్టింది కాదు. కాకపోతే ఒక విషయం మాత్రం చర్చించాం. పవన్‌కళ్యాణ్‌గారు మొన్న మాట్లాడిన తీరు. దానిలో అందరినీ దూషించడంతో పాటు, కాపు శాసనసభ్యులను దూషించిన విధానాన్ని ముక్తకంఠంతో ఈ సమావేశం ఖండించింది. సీఎం కావాలనుకుంటున్న పవన్‌కళ్యాణ్‌ ఇంత దిగజారి మాట్లాడడం అనైతికం. అందుకే ఆయన రాజకీయాలను అనర్హుడు తనంతట తానే చెప్పుకున్నారు.

కాపు వర్గం గుర్తించాలి:
వంగవీటి మోహన్‌రంగా హత్య గురించి పవన్‌కళ్యాణ్‌ కొత్త భాష్యం చెప్పారు. వంగవీటి మోహన్‌రంగా హత్య జరుగుతుందని తెలిసి కూడా, కాపులు ప్రతి గ్రామం నుంచి వెళ్లి ఎందుకు కాపు కాయలేదు? దీనికి కాపులు బాధ్యత వహించాలన్న పవన్‌కళ్యాణ్‌.. ఆ తర్వాత గంటకే వంగవీటి రంగా హత్యకు ప్రధాన కారకుడైన చంద్రబాబును కలిశారు. ఈ దుర్మార్గాన్ని కాపు వర్గం వారంతా గుర్తించాలి.

జగన్‌ ఆదుకున్నారు:
మరో విషయం. ముద్రగడ పద్మనాభం ఆందోళన సమయంలో మాలో చాలా మందిపై అక్రమంగా కేసులు పెట్టారు. జగన్‌గారు సీఎం కాగానే వాటన్నింటినీ ఎత్తేశారు. కాపులను వేధించింది తెలుగుదేశం ప్రభుత్వం అయితే.. వారికి న్యాయం చేసి, ఆదుకున్నది ఆనాడు వైయస్సార్‌ ప్రభుత్వం. మళ్లీ ఇప్పుడు జగన్‌గారి ప్రభుత్వం. మరో విషయం కూడా చెబుతున్నాం. మొన్న ముసుగు తొలగిపోయింది. కాపు సోదరులారా నమ్మండి. పవన్‌కళ్యాణ్‌ ముఖ్యమంత్రి కావడం కాదు. కేవలం చంద్రబాబును మాత్రమే ముఖ్యమంత్రిని చేయడం కోసం ప్రయత్నిస్తున్న పార్టీ జనసేన పార్టీ. దీనికి కాపులు ఎవ్వరూ సపోర్టు చేయాల్సిన అవసరం లేదు.

దాడిశెట్టి రాజా. రోడ్లు, భవనాల శాఖ మంత్రి:
పవన్‌ ఆ పుస్తకం చదవండి:
కొన్నాళ్ల క్రితం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ చాలా అసహ్యంగా మాట్లాడారు. వంగవీటి రంగాను చంద్రబాబునాయుడు హత్య చేయించారు. అలాంటి చంద్రబాబుకు, ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వొద్దని కోరుతున్నాం. అదే విధంగా ఆనాడు మంత్రిగా ఉన్న హరిరామజోగయ్య ఒక పుస్తకం రాశారు. తాను 2 లక్షల పుస్తకాలు చదివానని పవన్‌కళ్యాణ్‌ చెప్పారు. కావాలంటే హరిరామజోగయ్య రాసిన పుస్తకం పంపిస్తాం. అది కూడా చదవమని కోరుతున్నాం.

కురసాల కన్నబాబు, మాజీ మంత్రి:
జగన్‌ కాపుల శ్రేయోభిలాషి:
2014–19 మ«ధ్య.. ఆ తర్వాత 2019 నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు రాజకీయాలను కులాల మధ్య తిప్పుతున్నారు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని సంఘ వ్యతిరేక శక్తిగా ముద్ర వేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తే, కాపు సామాజికవర్గం ఆయన మీద తిరగబడింది. అందుకే 2019లో కాపు సామాజికవర్గం జగన్‌గారి వెంట నిల్చింది. ఆ ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌కు 5.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు కాపులను వేధించాడు. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా కేసులు పెట్టి, వేధించారు. జగన్‌గారు సీఎం కాగానే ఆ కేసులన్నింటినీ ఎత్తేశారు. అందుకే ఆయన కాపుల శ్రేయోభిలాషి కాదా?

కుట్రలు. కుతంత్రాలు:
ఇవాళ మళ్లీ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ పెద్ద ఎత్తున దుష్ప్రచారానికి కుట్ర చేస్తున్నారు. 2016 నుంచి జగన్‌గారు సీఎం అయ్యే వరకు.. అంటే 2019 వరకు సెక్షన్‌–30 అమలు చేసిన ఘనత చంద్రబాబుగారిది. కాపు సామాజికవర్గాన్ని ఒక బోనులో నిలబెట్టాలని, మా పార్టీలో ఉన్న కాపులను తప్పు పట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. మేము ఊడిగం చేస్తున్నామన్నట్లుగా పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతున్నారు. మరి మీరు ఏ పార్టీలకు మద్దతు ఇస్తున్నారు?

లక్ష రెట్లు మేలు:
2014లో జనసేన ఆవిర్భావం నుంచి ఒకసారి తెలుగుదేశం పార్టీకి, ఒకసారి బహిరంగంగా, మరోసారి లోపాయకారిగా.. ఆ తర్వాత కమ్యూనిస్టులతో, బీజేపీతో, బీఎస్పీతో జత కట్టారు. మీ లక్ష్యం ఒక్కటే జగన్‌గారిని ఓడించడం. రంగా హత్య జరిగినప్పుడు ఆనాడు హోం మంత్రిగా ఉన్న హరిరామజోగయ్య రాజీనామా చేస్తే, మర్నాడు చంద్రబాబు ఆయన్ను కలిసి బ్రతిమిలాడి, ఉపసంహరించుకునేలా చేశారు. లేకపోతే పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పారు. చంద్రబాబుతో పోలిస్తే, జగన్‌గారు కాపులకు లక్ష రెట్లు మేలు చేస్తున్నారు. కాపులపై ప్రేమ చూపుతున్నారు.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా మంత్రి బొత్స సత్యనారాయణ
చట్టబద్ధంగా చేయగలిగింది చేస్తాం:
కాపు రిజర్వేషన్లకు సంబంధించి మా ప్రభుత్వం ఒకే విషయం చెప్పింది. వాస్తవాలను వక్రీకరించి లేనిపోని ఆశలు, అపోహలు కల్పించడం కాదు. రాజ్యాంగపరంగా, చట్టబద్ధంగా ఎంత వరకు చేయగలమో చేస్తాం. కేంద్రం ఈబీసీలకు ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో.. రాష్ట్రానికి సౌలభ్యం ఇస్తే.. రాష్ట్రంలో అధికంగా 20 శాతానికి పైబడి ఉన్న కాపులకు అమలు జరపొచ్చు. మొత్తం 55 శాతం రిజర్వేషన్లలో కాపులకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వొచ్చు.
అయితే ఆ సదుపాయం కల్పించాలి.
ఇంకా ఎక్కువ మంది కాపులకు మేలు చేసేలా, వారి వార్షికాదాయ పరిమితి కూడా ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఇక్కడ రూ.8 లక్షల వరకు పెంచాం. అదే విధంగా భూ పరిమితి, ఇంటి నివాస స్థలం పరిమితి కూడా పెంచాం. దాని వల్ల ఆర్థికంగా వెనకబడి ఉన్న కాపుల్లో వీలైనంత ఎక్కువ మందికి లబ్ధి కలిగించాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశం.
అది సెలబ్రిటీ పార్టీ:
పవన్‌కళ్యాణ్‌ జనసేన రాజకీయ పార్టీ కాదు. ఎందుకంటే దానికి ఒక విధానం లేదు. అది కేవలం సెలబ్రిటీ పార్టీ మాత్రమే. ఆ పార్టీ నిలబడేది కాదు. తమకు 10 సీట్లు ఇవ్వాలని ఎవరినో కోరాడు. అంటే దానర్థం ఏమిటి? ఎవరికో పార్టీని తాకట్టు పెడుతున్నాడు. అందుకే సెలబ్రిటీ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రశ్నించేందుకే పార్టీని పెట్టానన్నాడు. ఆనాడు చంద్రబాబును ఎప్పుడైనా ప్రశ్నించారా?
మేము పవన్‌ను తిట్టడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోలేదు. ఇప్పుడు మేము ఎవరమైనా ఆయనను తిట్టామా? చెప్పులు చూపామా? వాడు, వీడు, నా కొడకా అన్నామా? మాకు సభ్యత, సంస్కారం ఉంది. మేమంతా స్వశక్తితో ఎదిగాం.
ధైర్యముంటే చెప్పమనండి:
పవన్‌కళ్యాణ్‌గారు వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో సింగిల్‌గా పోటీ చేస్తారా? చెప్పండి. ఆ పని మేము చేస్తాం. వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 సీట్లలో ఎన్ని సీట్లకు పవన్‌కళ్యాణ్‌ పార్టీ సింగిల్‌గా పోటీ చేస్తుంది? ధైర్యముంటే చెప్పమనండి.
అసెంబ్లీ సమావేశాల సమయంలో మరోసారి సమావేశమై, అన్నీ చర్చించి సీఎంగారిని కలవాలన్న ఆలోచన కూడా వచ్చింది. ఇక రిజర్వేషన్ల గురించి మా పరిధిలో ఉన్న అంశాన్ని మేము చెప్పాం. చంద్రబాబు మాదిరిగా మోసం చేయడం లేదు.
మళ్లీ గెలుస్తాం:
ఏ రాజకీయ పార్టీ అయినా కేవలం కుల ప్రాతిపదికన మనుగడ కొనసాగించలేదు. అన్ని వర్గాల వారు ఓటేస్తేనే గెలుస్తుంది. ప్రజా సంక్షేమాన్ని, సమగ్ర అభివృద్ధిని కోరుకునే పార్టీని ప్రజలు ఎన్నుకుంటారు. మేము వాటినే కోరుకుంటున్నాం, ఆ దిశలో చిత్తశుద్ధితో పని చేస్తున్నాం కాబట్టే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా మేమే గెలుస్తాం.

LEAVE A RESPONSE