Suryaa.co.in

Andhra Pradesh

ఆరోగ్యశ్రీని ప్రైవేటుపరం చేయడం దుర్మార్గం

– ప్రజల ప్రాణాలతోనూ ప్రభుత్వం వ్యాపారం చేస్తుందా?
– రూ.2.5 లక్షల వరకే బీమా సంస్థ నుంచి చెల్లింపు
– లోకేష్‌ సన్నిహితుల బీమా కంపెనీకి కాంట్రాక్ట్‌ కట్టబెట్టే యత్నం
– వైయస్సార్‌సీపీ ద్వారా ప్రజా ఉద్యమం చేస్తాం
– మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ధ్వజం

తాడేపల్లి: దేశంలోనే అత్యంత అద్భుతమైన పథకంగా ఉన్న ఆరోగ్యశ్రీని తమ స్వార్థం కోసం ప్రైవేటు బీమా కంపెనీకి అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైయస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆక్షేపించారు.

ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచితంగా అందిస్తున్న వైద్యం బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని కాపాడుకునేందుకు వైయస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం చేపడుతుందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.

కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటు బీమా కంపెనీకి కేటాయించి నిర్వీర్యం చేయాలనే దురుద్దేశంతో అడుగులు వేస్తోంది. ఆరోగ్యశ్రీ పథకం దేశంలోనే ఒక అద్భుతమైన పధకంగా గుర్తింపు పొందింది. స్వర్గీయ వైయస్‌ రాజశేఖరరెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు ఇది దేశంలోనే ఆదర్శవంతమైన పథకంగా అందరి మన్ననలను అందుకుంది. వివిధ రాష్ట్రాల నుంచి అధికారులు వచ్చి ఈ పథకాన్ని పరిశీలించి తమ రాష్ట్రాల్లో అమలు చేశారు.

ప్రాణాంతకమైన గుండె జబ్బులకు ఖరీదైన వైద్యం చేయించుకోలేక ప్రాణాలను కోల్పోతున్న ఎందరో పేదలకు ఈ ఆరోగ్యశ్రీ అపర సంజీవనిలా వారి ప్రాణాలను కాపాడింది. ఈ పథకం వల్ల ఎందరో పేదలు కార్పొరేట్‌ వైద్యాన్ని పొందారు. ముఖ్యమంగా గుండె ఆపరేషన్లు, వివిధ రకాల ఆపరేషన్లను చేయించుకున్నారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా పేర్లు మారాయే తప్ప ఈ పథకాన్ని తీసేసే సాహసం ఎవరూ చేయలేదు. అంత గొప్పగా ఈ ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లింది.

ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ఎత్తివేసి, బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించడం ద్వారా ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తోంది. దీన్ని వైయస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యసేవలు పొందే అవకాశం ఉంది. అదే బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించినా, చికిత్స వ్యయంలో కేవలం రూ.2.5 లక్షల వరకు ఆ సంస్థ నుంచి చెల్లింపులు జరుగుతాయి. అంతకంటే ఎక్కువ అయితే దాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ద్వారా పొందాల్సి వస్తుంది.

గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని బాగా విస్తరించి, మొత్తం 3257 ప్రొసీజర్లను అనుమతించాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించి చేతులు దులుపుకుంటే, మరి ఆ మొత్తం ప్రొసీజర్లను ఆ బీమా కంపెనీ కవర్‌ చేస్తుందా? అది ఖరీదైన వైద్యానికి చెల్లింపులు చేస్తుందా?.

ఉదా: కాంక్లియార్‌ ఇంప్లాంటేషన్‌కు దాదాపు రూ.6.5 లక్షల చొప్పున రూ.13 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇంకా బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు దాదాపు రూ.15 లక్షల వరకు ఖర్చవుతుంది. ఆ మొత్తాలను బీమా కంపెనీలు చెల్లిస్తాయా? అందుకు బీమా కంపెనీ ఒప్పుకోకపోతే, రోగుల పరిస్థితి ఏమిటి?.

ఎందుకంటే, బీమా కంపెనీలు 60 ఏళ్లు దాటిన వారికి, ఏదైనా దీర్ఘకాల వ్యాథులతో బాధ పడుతున్న వారికి, బీమా చెల్లింపుల్లో పలు ఆంక్షలు విధిస్తాయి. బీమా ప్రీమియం చెల్లించిన తరువాత ఏడాది, కొన్ని వ్యాధులకు కనీసం మూడేళ్ల వరకు వెయిటింగ్‌ పీరియడ్‌ అమలు చేస్తాయి.

ఉదా: హిప్‌ రీప్లేస్‌మెంట్‌ ఆరోగ్యశ్రీలో ఉంది. ఏ ఇబ్బంది లేకుండా ఆ సర్జరీ చేసేవాళ్లు. మరి ఇదే చికిత్సకు ప్రైవేటు బీమా కంపెనీలు కనీసం ఏడాది పాటు వెయిటింగ్‌ పీరియడ్‌ తరువాతే అంగీకరిస్తాయి. బీమా కంపెనీలు ఎప్పుడైనా, ఏదో ఒక విధంగా క్లెయిమ్స్‌ తగ్గించుకోవాలనే చూస్తాయి. అందుకే చిన్న చిన్న అంశాలను కూడా సీరియస్‌గా తీసుకుని క్లెయిమ్స్‌ నిరాకరిస్తుంటాయి. వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఉన్న అన్ని ప్రొసీజర్లను బీమా కంపెనీ ఆమోదిస్తుందా? దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?.

ప్రజాస్వామ్యంలో ప్రజలకు విద్య, వైద్యాన్ని ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. వీటిని కూడా ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నించడం దారుణం. ఆరోగ్యశ్రీని ప్రైవేటు బీమా సంస్థకు అప్పగిస్తే, ఆస్పత్రులన్నీ ఆ కంపెనీ చుట్టూ తిరిగి, క్లెయిమ్స్‌ పొందాల్సి వస్తుంది. నిబంధనలకు కట్టుబడి ఎన్ని ఆస్పత్రులు, ఎన్ని క్లెయిమ్స్‌ తెచ్చుకోగలవు?

కోవిడ్‌ సంక్షోభ సమయంలో ఆరోగ్యశ్రీ నిబంధనలను వెంటనే మార్చుకుని ప్రజలకు అవసరమైన సేవలను అందించారు. అదే బీమా సంస్థ నిర్దేశించే నిబంధనలు మార్చాలంటే చాలా జాప్యం జరుగుతుంది. అప్పటి వరకు ప్రజల ఆరోగ్యానికి ఎవరు జవాబుదారీ? ప్రభుత్వానికి ఏదైనా జబ్బును ఆరోగ్యశ్రీ కింద చేర్చడానికి ఒక అవకాశం ఉంటుంది. అదే బీమా కంపెనీ పరిధిలోకి తీసుకురావడం అంత సులభం కాదు.

ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే మందు, ప్రభుత్వం ఏ కసరత్తు చేసింది? కనీసం ఆస్పత్రులు, వైద్య రంగం ప్రతినిధులతో అయినా మాట్లాడారా? కూటమి ప్రభుత్వం చెబుతున్నట్లు నాలుగైదు గంటల్లో ప్రైవేటు బీమా కంపెనీ నుంచి క్లెయిమ్‌ అనుమతి రావడం చాలా కష్టం. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ కింద దాదాపు 300 మంది కేవలం క్లెయిమ్‌లపైనే పని చేసేవారు. మరి బీమా కంపెనీ ఆ స్థాయిలో పని చేస్తుందా?

లోకేష్‌ సొంత మనుషులు. బీమా కంపెనీ:
మంత్రి నారా లోకేష్‌ తన సొంత మనుషులతో బీమా కంపెనీని పెట్టించి, వారికే ఈ కాంట్రాక్ట్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇది తమకు కావాల్సిన వారికి దోచిపెట్టే ప్రయత్నం. ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన ఉన్న పథకం ఇది. ఈ రాష్ట్రంలో ప్రజల మన్ననలను పొందిన పథకం ఇది. దీనిని కూడా నిర్వీర్యం చేయాలని అనుకోవడం దుర్మార్గం. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం.

ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకునేలా ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని, పోరాడతామని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.

LEAVE A RESPONSE