Suryaa.co.in

Andhra Pradesh

జగన్ జమానాలో మద్యపాన నిషేధం మిథ్యే

• రాబోయే 15ఏళ్లకు ముందుగానే మందుబాబులను అప్పుకోసం తనఖాపెట్టేశాడు
• మద్యం అమ్మకాలకోసం ప్రతి 50ఇళ్లకు ఒక సేల్స్ మెన్ ను నియమించాడు
• సంవత్సరానికి రూ.5వేలకోట్లచొప్పున 5ఏళ్లకు రూ.25వేలకోట్లు మద్యం అమ్మకాలపై రాబడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని తన ఆదాయంగా మార్చుకున్నాడు
• వైసీపీనేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు నాటుసారా అమ్మకాలను, పొరుగురాష్ట్రాల మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు
• జగన్మోహన్ రెడ్డి జమానాలో మద్యపాననిషేధం అనేది మిథ్యేనని తేలిపోయింది
* మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు
మాటతప్పను, మడమతిప్పను అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి, మద్యనిషేధమనే వాగ్థానం విషయంలో నాలుక మడతేసి, మహిళలను దారుణంగా మోసగిస్తున్నాడని, తాను తీసుకొచ్చిన మద్యం పాలసీ పచ్చనికాపురాల్లో చిచ్చుపెడుతున్నాకూడా ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకోవడంలేదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు స్పష్టంచేశారు. మంగళవారం ఆయన జూమ్ ద్వారా తన నివాసంనుంచి విలేకరులతో మాట్లాడారు.
దశలవారీగా మద్యపాననిషేధం అనిచెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి, నేడు తనవ్యక్తిగత ఆదాయం పెంచుకోవడంతోపాటు, రాష్ట్రాన్ని అప్పులఊబిలోకి నెట్టేసే క్రమంలో ప్రతి 50ఇళ్లకు, మద్యం అమ్మకాల కోసం ఒక సేల్స్ మెన్ ను నియమించాడన్నారు. చంద్రబాబునాయుడి హయాంలో రూ.60లు అమ్మిన చీప్ లిక్కర్ నేడు జగన్ జమానాలో రూ.200వరకు అమ్ముతున్నారన్నారు. రోజుకూలీనాలీ చేసుకొనే కడు పేదలే చీప్ లిక్కర్ తాగుతారని,అలాంటి వారినుంచి కూడా జగన్ సంవత్సరానికి రూ.4,500వరకు దోచుకుంటున్నాడన్నారు. ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాలను సాయంత్రానికి మూసేసి, రాత్రి సమ యాల్లో వాలంటీర్లు, వైసీపీకార్యకర్తలతో యథేచ్ఛగా నాసిరకం మద్యం అమ్మకాలను ప్రభుత్వమే స్వయంగా కొనసాగిస్తోందన్నారు. బ్లాక్ లో చీప్ లిక్కర్ సహా, నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ, వేలకోట్లను ముక్కు పిండీ మరీ మందుబాబులనుంచి జగన్ రెడ్డి వసూలు చేస్తున్నాడన్నా రు.
దశలవారీ మద్యపాన నిషేధం పేరుచెబుతూ, దశలవారీగా మద్యం అమ్మకాలను జగన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడన్నారు. ఇప్పుడు మద్యం అమ్మకాలతో పేదలనుంచి దోచుకుంటున్నది చాలక, రాబోయే రోజుల్లో వాక్ ఇన్ స్టోర్స్ పేరుతో అమ్మకాలు మరింత ప్రోత్సహించడానికి పట్టణాల్లో 300వరకు కొత్తదుకాణాలను ఏర్పాటుచేయడానికి జగన్ సర్కారు సిద్ధమైందని మాజీ మంత్రి తెలిపారు. పర్యాటకం ముసుగులో మరో 175 కొత్త దుకాణాలకు ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు. ఈ విధంగా ప్రభుత్వానికి అఫీషియల్ గానే ఏటా రూ.10వేలకోట్లవరకు మద్యం అమ్మకాలతో ఆదాయం వస్తోందన్నారు. దానికితోడు మద్యం తయారీ కంపెనీలన్నీ ప్రభుత్వపెద్దలకు చెందినవేనన్నారు. ప్రభుత్వం అమ్మే నకిలీమద్యం తాగేవారు ఆరోగ్యాన్ని పూర్తిగా పాడుచేసుకుంటూ, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని ఆనంద్ బాబు వాపోయారు. ప్రభుత్వం చీప్ లిక్కర్ ధరలు పెంచడంతో విధిలేక కొన్నిప్రాంతాల్లో నాటుసారా అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, అదితాగి చాలామందిప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నారు. వైసీపీనేతలు, కార్యకర్తలే దగ్గరుండీమరీ నాటుసారా అమ్మకాలను కొనసాగిస్తూ, వంద లకోట్లవరకు దండుకుంటున్నారన్నారు.
నాటుసారా కూడా కొనలేని వారు చాలాచోట్ల స్పిరిట్, శానిటైజర్లు తాగి ప్రాణాలమీదకు తెచ్చుకుంటు న్నారని ఆనంద్ బాబు తెలిపారు. ఈ విధంగా ఎన్నికలకు ముందు ఒకటిచెప్పిన జగన్మోహన్ రెడ్డి, తీరా అధికారంలోకివచ్చాక బ్యాంకులకు మద్యంపై వచ్చేఆదాయాన్నే గ్యారంటీగా చూపి రూ.25వేలకోట్లవరకు రుణం తీసుకొచ్చాడన్నారు. రాబోయే 15 ఏళ్లకు కూడా మద్యం డిస్టిలరీలనుజగన్ రెడ్డి తన అప్పుకోసం తాకట్టుపెట్టేశాడన్నారు. మద్యపాననిషేధం పేరుతో మహిళల ఓట్లుకొల్లగొట్టిన జగన్ రెడ్డి, నేడు వారి పుస్తెలు తెంచే కార్యక్రమాన్ని యథేచ్చగా సాగిస్తున్నాడన్నారు. టీడీపీప్రభుత్వంలో మంచి మద్యాన్నే సాధారణ ధరకు అమ్మడం జరిగిందని, కానీ జగన్ జమానాలో దోపీడీయే ధ్యేయంగా, మద్యం అమ్మకాలే పూర్తి ఆదాయవనరుగా మారాయన్నారు. సంవత్సరానికి రూ.5వేలకోట్ల చొప్పున, 5ఏళ్లలో రూ.25వేలకోట్ల ఆదాయాన్ని మద్యం అమ్మకాలతోనే జగన్మోహన్ రెడ్డి సర్కారు రాబడుతోందన్నారు.
ఇప్పటికే రెండున్నరేళ్లలో రూ.12,500కోట్లను ప్రభుత్వం దోచేసిందన్నా రు. ప్రభుత్వ సాగించే దోపిడీతోపాటు, వైసీపీనేతలు, కార్యకర్తలు,ఆఖరికి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మద్యం దోపిడీలో మునిగితేలుతున్నా రని ఆనంద్ బాబు తెలిపారు. ఆఖరికి కరోనాసమయంలో ఉపాధ్యాయు లను మద్యం దుకాణాలవద్ద పెట్టిమరీ అమ్మకాలు సాగించారన్నారు. జగన్మోహన్ రెడ్డి తన ఆదాయమే లక్ష్యంగా ప్రజలప్రాణాలతో చెలగాట మాడుతూ, మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నాడనే వాస్తవాన్ని ప్రజలంతా గమనించాలని మాజీమంత్రి సూచించారు.

LEAVE A RESPONSE