Suryaa.co.in

Andhra Pradesh

భీమేశ్వర స్వామి భూములు కాపాడండి

– వాటిపై మంత్రి కన్ను
– దేవదాయశాఖ కమిషనర్‌కు టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ
కృష్ణా జిల్లా గుడివాడలోని భీమేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి ఆలయాలకు చెందిన భూములు కబ్జా కాకుండా కాపాడాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఆ మేరకు ఆయన దేవదాయశాఖ కమిషనర్‌కు లేఖ రాశారు.
లేఖ పూర్తి సారాంశం ఇదీ..
తేది. 29.09.2021
గౌరవనీయులైన దేవాదాయశాఖ కమిషనర్ గారికి
ఆంధ్రప్రదేశ్, అమరావతి.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య నమస్కరించి వ్రాయునది.
ఆర్యా!
విషయం: కృష్ణా జిల్లా గుడివాడలో ఆలయ భూముల అన్యాక్రాంతంపై – కొందరి అధికారుల అత్యుత్సాహం – ఆ స్థలంపై ఓ మంత్రి కన్ను – పత్రికల్లో ప్రచారం – తగిన చర్యలు తీసుకొనుట – గురించి
***
కృష్ణా జిల్లా గుడివాడలోని భీమేశ్వరస్వామీ ఆలయం, వేణుగోపాల స్వామి ఆలయాలకు పట్టణ శివారులోని వెలివర్తిపాడులో సర్వే నంబర్ 272 లో 15.07 ఎకరాలు, సర్వే నంబర్ 294 లో 5.64 ఎకరాలు, యల్లయపాడులో సర్వే నంబరు 4 లో 4.83 ఎకరాలు భూములు ఉన్నాయి. 1942 నుంచి ఈ భూములు పై రెండు దేవాలయాల పరిధిలో ఉన్నాయి. గతంలో ఈ భూములను ఆక్రమించుకున్న వారి వద్ద నుంచి వాటిని విడిపించి దేవాదాయశాఖ ట్రైబునల్ ద్వారా వీటిని 2017 లో నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. కానీ ప్రస్థుతం ఈ భూములపై అధికారపార్టీకి చెందిన ఒక మంత్రి కన్ను పడిందని పత్రికల్లో వార్తలు వచ్చినవి. భూములను మంత్రికి ధారదత్తం చేసేందుకు జిల్లాకు చెందిన ఒకరిద్దరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శస్తున్నట్లుగా ప్రకటించబడింది. మరీ ముఖ్యంగా జిల్లా జాయింట్ కలెక్టర్లలో ఒకరు ఆ మంత్రికి ఈ భూములు ధారదత్తం చేయడం కోసం ఎంతకైనా బరితెగించినట్లుగా తెలుస్తున్నది. మీరు, దేవాదాయ భూముల కస్టోడియన్ గా ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడవలసిన బాధ్యత మీమీదున్నది. మంత్రి సేవలో తరిస్తున్న అధికారులను కూడా కట్టడి చేసే భాధ్యత మీదే. ఈ గుడివాడ దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడవలసన భాధ్యత కూడా మీదే. జిల్లా కలెక్టర్ ఈ భూముల విషయంలో జోక్యం కలిగించుకోకుండా ఆ మంత్రి, ఆయనకు వత్తాసు పలుకుతున్న జాయింట్ కలెక్టర్ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా జిల్లాలో ప్రచారం ఉంది. అజాగ్రత్తగా ఉంటే, అధికారులను జైలుకు తీసుకెళ్లే అలవాటు కూడా ఈ ప్రభుత్వ పెద్దలకు ఉన్నది.
కావున తమరు దయచేసి, ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా, మంత్రి చేతిలో పడకుండా చూడవలసినదిగా విజ్జప్తి చేస్తున్నాను.
ధన్యవాదములు
ఇట్లు తమ విధేయులు
(వర్ల రామయ్య)
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి
దీని నఖలు జిల్లా కలెక్టర్ గారికి పంపడమైనది.
ఈ రోజు పేపర్ క్లిప్పింగ్ కూడా జత చేయడమైనది.

LEAVE A RESPONSE