– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పిలుపు
– ఈనెల 10 వ తేదీన కలెక్టరేట్ లవద్ద ఆందోళన కు వక్తల నియామకం
అమరావతి….గ్రామ పంచాయితీల నిధులను స్వాహా చేస్తున్న రాష్ట్రప్రభుత్వాన్ని నిలదీయడానికి బిజెపి సన్నద్దం అవుతోంది. సర్పంచ్ లు చేస్తున్న ఆందోళనకు గతంలోనే బిజెపి మద్దతు పలికింది.
అదేవిధంగా పంచాయితీల నిధులను స్వాహాచేస్తే గ్రామాలు ఎలా అభివృద్ది చెందుతాయని బిజెపి ఇప్పటికే గళం విప్పింది.
ఇదే విషయం పై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్ర స్ధాయిలో నాలుగు జోన్ లలో నిర్వహించిన బిజెపి జోనల్ సమావేశాల్లో రాష్ట్రప్రభుత్వ వైఖరి పై పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు. గాంధీమహాత్ముడు కలలుకన్న గ్రామస్వరాజ్యం రావాలని కేంద్రం నేరుగా గ్రామ పంచాయితీలకు నిధులు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులకు మోకాలొడ్డుతోంది.రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల గ్రామ పంచాయితీల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని పరిస్ధితిలు ఏర్పడుతున్నాయని రాష్ట్రవ్యాప్త పర్యటనలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎండగట్టారు.
సర్పంచ్ ల హక్కుల సాధన కై పోరుబాట పడుతున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గబాటి పురందేశ్వరి స్పష్టంగా ప్రకటించారు.ఈనెల 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ ల వద్ద ఆందోళన కార్యక్రమాలకు పురందేశ్వరి పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు తగు కసరత్తుకూడా పూర్తి చేసారు. ఇప్పటికే రాష్ట్ర నేతలు, కోర్ కమిటీ సభ్యలుతో ఆడియో,వీడియో కాన్ఫెరెన్సులు నిర్వహించారు .
అనంతరం జోనల్ వారీగా అంటే రాష్ట్రం నాలుగు జోన్ లు గా విభజించి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి ఆడియో కాన్పెరెన్సులు నిర్వహించారు. ఈ నేపద్యంలో జిల్లా పార్టీ నేతలు మండల స్ధాయిలో పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించి ఈ నెల 10 వ తేదీన నిర్వహించే ఆందోళన కార్యక్రమం విజయ వంతం చేసేందుకు కార్యక్రమాన్ని రూపొందించారు.
వక్తల నియామకం….
ఈనెల 10 వ తేదీన జిల్లా కేంద్రాల్లో నిర్వహించే ఆందోళనలకు వక్తల ను బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి ప్రకటించారు. రాష్ట్ర నేతలు అందరూ జిల్లా కేంద్రాలలో నిర్వహించే ఉద్యమాల్లో పాల్గొనే విధంగా ఒక ప్రణాళిక కూడా రూపొందించారు.
ఇందులో భాగంగా ఈనెల 10 వతేదీన జరిగే కలెక్టరేట్ ఆందోళనల్లో ఒంగోలు జిల్లాలో జరిగే కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి హాజరౌతున్నారు అంటే ఈ కార్యక్రమం పార్టీ ఎంత సీరియస్ గా తీసుకుందీ అనేది స్పష్టం అవుతోంది.
విజయవాడలో మాజీ కేంద్రమంత్రి వై సుజనా చౌదరి, అరకు లో మాజీ ఎంపి కొత్తపల్లి గీత, విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, విశాఖపట్నంలో బిజెపి జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, అనకాపల్లి లో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు, కాకినాడలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోమువీర్రాజు, రాజమహేంద్రవరంలో మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, మచిలీపట్నం లో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుసాంబశివరావు, గుంటూరు లో మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, నెల్లూరులో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ, తిరుపతిలొ బిజెపి రాష్ట్రప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, కడపలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, హిందుపూర్ లో ఎపి సహ ఇంఛార్జి సునీల్ దేవదర్, కర్నూలు లో మాజీ ఎంపి టిజి వెంకటేష్, నంద్యాల లో మాజీ ఎమ్మెల్యే ఎం ఎస్ పార్ధసారధి లాంటి హేమాహమీలు హాజరు కానున్నారు.
ఇదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రానికి ఒక ప్రముఖ సీనియర్ బిజెపి నేతలు హాజరయ్యే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు. జిల్లా కేంద్రాల్లో ఈ ఆందోళనలతో రాష్ట్రప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు గ్రామ పంచాయితీల్లో నిధులు స్వాహా చేస్తు ఒక రకమైన ఆర్ధిక నేరానికి రాష్ట్రప్రభుత్వం సర్పంచ్ ల విషయంలో వ్యవహరిస్తున్న విషయాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి బిజెపి రాష్ట్ర వ్యాప్త ఉధ్యమానికి శ్రీకారం చుట్టింది.