– బట్టలూడదీసి ఊడగొడతారు
– నీ అసలు రంగు బయట పడ్డది
– ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు గానీ, రెండు నెలల ముందే మద్యం నోటిఫికేషన్లు ఇచ్చిండు
– రాజీవ్ యువ వికాసం వికసించకముందే వాడిపోయింది
– రేవంత్ రెడ్డి గన్ ఇచ్చి పంపించాడు అని మంత్రి కుమార్తె చెప్పింది
– ఐఏఎస్ ఆఫీసర్ వీఆర్ఎస్ తో మధ్యలోనే వెళ్లిపోతున్నాడు
– కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: ఇచ్చిన మాట నిలుపుకో అని బాకీ కార్డులు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల ముందు వేడుకున్నడు, వాడుకున్నడు. అధికారంలోకి వచ్చాక వదిలేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లతో అశోక్ నగర్, సరూర్ నగర్ స్టేడియంలో మీటింగులు పెట్టించారు.
ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అని మాయ మాటలు చెప్పారు. మోసం చేసారు.
నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి.. పోలీసులు లేకుండా ఒక్క సారి అశోక్ నగర్, చిక్కడ పల్లి లైబ్రరీకి రా. బట్టలూడదీసి ఊడగొడుతారు. నీ అసలు రంగు బయట పడ్డది.ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు గానీ, రెండు నెలల ముందే మద్యం నోటిఫికేషన్లు ఇచ్చిండు.
జాబ్ క్యాలెండర్ అని జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేశారు. జాబ్ క్యాలెండర్ లో చెప్పినట్లు ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చారా రేవంత్ రెడ్డి? 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ బోగస్. రాజీవ్ యువ వికాసం వికసించకముందే వాడిపోయింది. జూన్ 2 నాడు 5లక్షల మంది నిరుద్యోగులకు యువ వికాసం కింద సాయం చేస్తం అన్నడు.
మాటలు బోగస్ హామీలు బోగస్. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిండు. రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించేందుకు మీ చేతిలో అవకాశం ఉంది. కొంతమంది నిరుద్యోగులు కూడా నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ ను జూబ్లిహిల్స్ లో ఓడించాలె. ఆనాడు కాంగ్రెస్ ను గెలిపించేందుకు బస్సు యాత్ర చేసారు. కాంగ్రెస్ కు సురుకు పుట్టాలంటే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను ఓడించేందుకు నిరుద్యోగులు దండు కట్టాలె.
నిరుద్యోగ యువకులే కాంగ్రెస్ ను ఓడించారనే విషయం రాహుల్ కు అర్థం కావాలె.
తనతప్పు తాను తెలుసుకునేందుకు మనం కాంగ్రెస్ ను ఓడించాలె. జీవో 29, జీవో 55 పై నేను ఆనాడు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడాను. భట్టి గారు దళిత మంత్రిగా ఉన్నారు మీరైనా పట్టించుకోండి అంటే పట్టించుకోలేదు. జాబులు నింపండి అంటే జేబులు నింపుకుంటున్నరు. గల్లా పెట్టెలు నింపుకుంటున్నరు.
విద్యాశాఖ మంత్రి, మున్సిపల్ మంత్రిగా, హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఫెయిల్. కలెక్షన్ల మంత్రిగా వసూళ్ల మంత్రిగా మాత్రం పాస్ అయిపోయిండు.
విద్య రాని వ్యక్తి విద్య శాఖ మంత్రి. అతి ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి హోం మంత్రి. మా ప్రభుత్వం టీఎస్ ఐపాస్ ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించింది. నేడు ఈ ప్రభుత్వం మంత్రులు, ముఖ్యమంత్రి గన్నులు పెట్టి బెదిరిస్తున్నరు.
రేవంత్ రెడ్డి గన్ ఇచ్చి పంపించాడు అని మంత్రి కుమార్తె చెప్పింది. ఐఏఎస్ఆఫీసర్ వీఆర్ఎస్ తో మధ్యలోనే వెళ్లిపోతున్నడు. లక్షా 64వేల ప్రభుత్వ ఉద్యోగాలను బిఆర్ఎస్ ఇచ్చింది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఆలస్యం అయ్యింది. 95 శాతం లోకల్ రిజర్వేషన్ సాధించాం. నోటిఫికేషన్లు ఇచ్చింది బిఆర్ఎస్, పరీక్ష పెట్టింది బిఆర్ఎస్, ఫిజికల్ టెస్టు పెట్టింది బిఆర్ఎస్, ఎంపిక చేసింది బిఆర్ఎస్ నియామకపత్రాలు ఇచ్చింది రేవంత్.
రేవంత్ రెడ్డి 60వేల ఉద్యోగాలు ఇచ్చినా అని ప్రచారం చేసుకుంటున్నడు. అందులో 15400 ఎస్సై కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చింది బిఆర్ఎస్. 9వేల గురుకులాల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చింది బిఆర్ఎస్. 8వేల గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇచ్చింది బిఆర్ఎస్. హెల్త్ డిపార్టుమెంట్ లో 7వేల ఉద్యోగాలు ఇచ్చింది బిఆర్ఎస్. జేఎల్ 1300, ఆరు వేల డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది బిఆర్ఎస్. అచ్చంగా కాంగ్రెస్ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసింది కేవలం 10వేల ఉద్యోగాలు మాత్రమే.
నీ నిజ స్వరూపం బయటపడింది రేవంత్ రెడ్డి. వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మేం హామీ ఇస్తున్నాం. అసెంబ్లీ వేదికగా మీకోసం పోరాటం చేస్తాం. మొన్న అడిగితే ఒక్కటే నాడు అసెంబ్లీ పెట్టి పారిపోయిండు.
అసెంబ్లీ పెట్టడానికి కూడా భయమే. జెన్కో, జీపీవో, పోలీసు, డిప్యూటీ సర్వేయర్, ఇతర గ్రూప్స్ నోటిఫికేషన్ల కోసం బిఆర్ఎస్ పోరాటం చేస్తుంది. అన్ని జిల్లా కేంద్రంలో బాకీ కార్డులు పెట్టి యువతను ఏకం చేస్తం. ప్రత్యక్ష పోరాటం బిఆర్ఎస్ చేస్తుంది. మీకు అండగా ఉంటది.
ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. జెన్కో, జీపీవో, పోలీసు, డిప్యూటీ సర్వేయర్, ఇతర గ్రూప్స్ నోటిఫికేషన్ల విషయం లో రాష్ట్ర ప్రభుత్వం నిద్రమొద్దు వైఖరి అవలంభిస్తోందని, అన్ని జిల్లా కేంద్రాల్లో బాకీ కార్డులు పెట్టి యువతను ఏకం చేయాలని, ఈ నిరుద్యోగ జేఏసీ ఇక్కడితో ఆగిపోవద్దని సూచించారు. మీ ప్రత్యక్ష పోరాటం నేను మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజా ఉద్యమాలతోనే, పోరాటాలతోనే ప్రభుత్వం మెడలు వంచడం సాధ్యం అవుతుందన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ… ఎక్కడ పోరాటాలు జరిగినా ఎర్రజెండా అండగా ఉంటుందని, ఈ నిరుద్యోగ జేఏసీ అధ్వర్యంలో విడుదలైన తెలంగామ నిరుద్యోగ బాకీ కార్డ్ ఆవిష్కరణ కేవలం ఆరంభం మాత్రమే, రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి యువత తమ హక్కులు సాధించుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం అయిందని, అందుకే గ్యారంటీ కార్డులు కాస్తా బాకీ కార్డులు అవుతున్నాయని ఎద్దేవా చేశారు.
బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ… మన తెలంగాణ లో ఎవరైనా బాకీ ఎగ్గొట్టితే నలుగుట్లకు గుంజుతాం, ఊరిలో బొడ్రాయి దగ్గరికి పిలిచి మాట్లాడతామని, అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు కాబట్టి 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ పై నిగ్గు తేల్చడానికి ఈ నిరుద్యోగ బాకీ కార్డ్ ఆవిష్కరించడం జరిగింది.
ఈ కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డును గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలని, ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ల దగ్గరికి కూడా ఈ బాకీ కార్డు చేర్చడం కోసం కృషి చేస్తామని అన్నారు.
బీఆర్ఎస్ నిరుద్యోగులకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కాకితో కబురు పంపినా వాలిపోతుందని, యువతే తెలంగాణ భవిష్యత్ ఆస్తి కాబట్టి వాళ్ళను కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎల్లప్పుడూ ముందుతుందని భరోసా ఇచ్చారు. జీవో 46, గ్రూప్ -1, డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో, జీవో 29 ఇలా అంశంలో అయినా నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా అండగా నిలిచిందని అన్నారు.