Suryaa.co.in

Telangana

రైతు బంధు మాదే..కేసీఆర్ కాపీ కొట్టారు

2014 మ్యానిఫెస్టెలో ఆ అంశం ఉంది
రాజకీయంగా నష్టపోయిన తెలంగాణ ఇచ్చాం
ఒక వ్యక్తి పాదాల కింద తెలంగాణ సమాజం నలిగిపోతోంది
నేను కందిపప్పు…కేటీఆర్ గన్నేరు పప్పు
మీట్ ది ప్రెస్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

రైతులకు ఎకరానికి ఏటా 10వేలు ఇస్తామని 2014లోనే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది దాన్నే కాపీ కొట్టి కేసీఆర్ రైతు బంధు పేరుతో ఇస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఓడిపోవడంతో ఆ విషయాన్ని చెప్పుకోలేక పోయామని, అధికారంలోకి వస్తే అమలు చేసే ఉండేవారిమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీట్ ద ప్రెస్‌లో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సర్కార్ పాలనా వైఫల్యాలు, కాంగ్రెస్ అభివృద్ధి ప్రణాళికలు సహా వివిధ అంశాలపై సమగ్రంగా అభిప్రాయాలు పంచుకున్నారు.

తెలంగాణ రాష్ట్రం మామూలుగా ఏర్పడలేదన్నారు. చరిత్ర గురించి మాట్లాడాలంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటాం అని.. అలాగే తెలంగాణ గురించి మాట్లాడాలంటే జూన్ 2, 2014 ముందు, వెనుక అంటామని చెప్పుకొచ్చారు. అసలు ఎందుకు తెలంగాణ ఉద్యమం వచ్చిందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేశామని.. సీమాంధ్రుల చేతుల్లో తెలంగాణ ప్రాంతం నలిగిపోతుందని పోరాటం చేశామని తెలిపారు.

రాష్ట్రం కోసం వందలాది మంది ప్రాణాలు బలితీసుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారని అన్నారు. తెలంగాణ కోసం అణుబాంబు లాంటి నిర్ణయం తీసుకున్నారన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ..సామాజిక న్యాయం.. సమాన అభివృద్ధి కోరుకున్నారని తెలిపారు. ఒక వ్యక్తి పాదాల కింద తెలంగాణ సమాజం నలిగిపోవడం సహించలేమన్నారు. మట్టికి పోయినా ఇంటి వాడు పోవాలని కేసీఆర్ చెప్తారన్నారు. ఆయన చెప్పిన నీళ్లు వచ్చాయా..? పల్లెలకు నిధులు వచ్చాయా..? అని ప్రశ్నించారు.

ఆంధ్రాలో పార్టీ సర్వం కోల్పోయినా న్యాయం, ధర్మం వైపు నిలబడాలని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. లెక్కలు వేసుకుని, స్వార్ధం చూసుకుంటే వంద మంది కేసీఆర్ లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదని, శ్రీకాంతాచారి లాంటి అమరుల త్యాగాలను గుర్తించి సోనియా తెలంగాణ ఇచ్చారన్నారు.

దశాబ్దం గడిచినా నీళ్లు, నిధులు నియామకాలు సాధించుకున్నమా? ఒకసారి ఆలోచన చేయాలి అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎప్పుడూ చెప్పే మాట.. మట్టికి పోయిన ఇంటోడు పోవాలని అంటాడు. ఆయన చెప్పినవి ఏవి వచ్చాయి. రాచరిక పోకడలు కనిపించేలా సర్కార్ ముద్ర ఉంది. త్యాగాలు గుర్తిచేసేలా ఉండాలి కానీ అలా లేదు. ఉద్యమంలో టీజీ అని రాసుకుంటే కేసీఆర్ వచ్చాక టీఆర్‌ఎస్ కనిపించేలా టీఎస్ రాసిండు. తెలంగాణ తల్లి కూడా భుజకీర్తులతో కనిపిస్తుందన్నారు.

కేసీఆర్ వచ్చాక రాష్ట్రంలో పాలన తీరు మారిందని.. ప్రజా సంఘాలకు, అఖిల పక్ష నేతలకు ప్రాధాన్యత లేదని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అసెంబ్లీ హాల్‌లో కూడా ప్రతిపక్ష నేతల సీట్లు మార్చిన్రు. మీడియాపై ఆంక్షలు పెట్టారు. సచివాలయంలో కూడా ప్రవేశానికి నో ఎంట్రీ అంటున్నారు. అపోజిషన్ లీడర్లకు అనుమతి ఉండదా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి కనిపించలేదన్నారు.

గతంలో సీఎంను ఎవరైనా నేరుగా కలిసే అవకాశం ఉండేదన్నారు. నియంత కంటే ఎక్కువగా ఉంది కేసీఆర్ పాలన. కేసీఆర్ నియంత కాదు క్రిమినల్ పొలిటిషన్. కోట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు.

కేసీఆర్ ఇచ్చిన చాలా మాటలు అమలు కాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ దేశానికే ఆదర్శం అని ఇప్పుడేమో కర్ణాకటలో ఇది చేస్తలేదు అది చేస్తలేదని అంటున్నారని మండిపడ్డారు. కర్ణాకటలో కాంగ్రెస్ గెలవడం ద్రోహం, నేరం అంటున్నారని.. మరి బీజేపీ గెలవాలా అని ప్రశ్నించారు. అంటే బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అని.. మోడీ కేడీ ఒక్కటే అంటూ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి మూలం కాంగ్రెస్ విధానాలేనన్న రేవంత్.

మూసీ ప్రక్షాళన, అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్లు, రాచకొండ గుట్ట పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రణాళికలు ఉ్ననాయని తెలిపారు. 2050నాటి కల్లా తెలంగాణ సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్‌కు మాస్టర్ ప్లాన్ ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఐటీ కి పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ను పెట్టుబడి నగరంగా తీర్చిదిద్దుతామనన్నారు.

హైటెక్ సిటీని కాంగ్రెస్ హయాంలో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ప్రారంభించరన్నారు. గంగా నదిలా మూసీని ప్రక్షాళన చేస్తాం. మూసీ రివర్ ఫ్రంట్ ను అద్భుతంగా అభివృద్ధి చేసే ప్రణాళిక మా దగ్గర ఉంది. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ హైదరాబాద్ కు కనెక్టివిటీ ఇవ్వనున్నామన్నారు. హైదరాబాద్ ను ప్రపంచానికే తలమానికంగా మారుస్తామన్నారు రేవంత్ రెడ్డి.

కేసీఆర్ గురించి తాము ఏమి చెప్పనవసరం లేదని.. కేసీఆర్ తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. చివరికి జర్నలిస్టులను కూడా ఆగం చేశారంటూ విరుచుకుపడ్డారు. కేసీఆర్ పెట్టిన తెలంగాణ తల్లి శ్రీమంతుల తల్లిని చూపించారూ అంటూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి ముఖంలో దర్పం.. ప్రేమ.. త్యాగం ఉండాలన్నారు. కేసీఆర్ ఉద్యమంలో టీజీ అని అనుకున్నామన్నారు. కానీ తెలంగాణ వచ్చాకా టీఆర్ఎస్ స్పురించేలా టీఎస్ పెట్టుకున్నాడని మండిపడ్డారు.

తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంత నిర్బంధం లేదన్నారు. సెక్రటేరియట్ కి.. ప్రతిపక్ష సభ్యులకు.. మీడియాకు అనుమతి లేదన్నారు. కేసీఆర్.. నియంత ముసుగులో ఉన్న క్రిమినల్ పొలిటీషియన్ అన్నారు. క్రిమినల్ ని ఎదుర్కోవచ్చు.. నియంతను ఎదుర్కోవచ్చు.. కానీ.. నియంత ముసుగులో ఉన్న క్రిమినల్ ని ఎదుర్కోవడం కోసం కొత్త దారులు వేతకాల్సి వస్తోందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

మేడిగడ్డ స్తంభం మూడు అడుగుల మేర కుంగిపోయిందన్నారు రేవంత్ రెడ్డి. పిల్లర్ దిగువన ఇసుక ఉందన్న విషయం నీటిపారుదల శాఖ ఇంజినీర్లకు తెలియదా అని ప్రశ్నించారు. పిల్లర్లు కుంగాయి కాబట్టే మేడిగడ్డ బ్యారేజీ జాయింట్ లో గ్యాప్ పెరిగింది. ఒక మీటరు కుంగింది అని అధికారులే చెబుతున్నారు తప్పించుకోవడానికే కేటీఆర్ ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు.

మేం తప్పు చెబుతున్నామంటే.. అఖిలపక్షాన్ని తీసుకెళదాం…ప్రాజెక్టు కుంగిందో లేదో వాళ్లే చెబుతారు అని అన్నారు. బీఆరెస్ నేతలవి లాజిక్ లేని వాదనలని కేసీఆర్ పాపాల వల్లే మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయిందని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ఓటుకు నోటు పెంచింది కేసీఆర్ అని రేవంత్ రెడ్డి విమర్శించారు.

సంక్షేమాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పెన్షన్లు, పక్కా ఇళ్లు, ఆరోగ్య శ్రీ లాంటి పథకాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ అనే గుర్తు చేశారు. కేసీఆర్ తాను చేసింది చెప్పుకోలేక కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ వాదనల్లో డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడలేదన్నారు. మైనారిటీలను అన్ని రకాలుగా సంక్షేమంలో భాగస్వాములను చేస్తాం..జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు.

పేదలకు విద్యను చేరువ చేసింది కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన స్కూళ్లలో 6,540 సింగిల్ టీచర్ స్కూళ్లను కేసీఆర్ హయాంలో మూసేశారని విమర్శించారు. తన లోపాలను కప్పిపుచ్చుకునేందుకే పక్క రాష్ట్రాల అంశాన్ని తెరపైకి తెస్తున్నారు అని ఆరోపించారు. కాంగ్రెస్ దశాబ్ద పాలన-బీఆరెస్ దశాబ్ద పాలనపై చర్చకు సిద్ధం..మా పార్టీ నుంచి నేను, సీఎల్పీ భట్టి వస్తాం… మిగతా. పార్టీల నుంచి ఇద్దరు చొప్పున రండి..చర్చ పెడితే పాలకు పాలు,నీళ్లకు నీళ్లు బయట పడతాయని వ్యాఖ్యానించారు.

తెలంగాణ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చుక్క మందు, డబ్బు లేకుండా వెళదామని బీఆర్ఎస్ పార్టీతో సహా ఇతర పార్టీలను రేవంత్ రెడ్డి కోరారు. విధివిధానాలపై ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళదామని తెలిపారు. ధరణి పోర్టల్ పేరుతో ప్రభుత్వమే పెద్ద దళారీగా మారిందన్నారు. ధరణిలో అత్యంత పెద్ద దళారులు కేసీఆర్ కిటుంబ సభ్యులే అని ఆరోపించారు. ధరణి పేరుతో రికార్డులను జిల్లాలకు తరలించారన్నారు.

ఈ రికార్డుల్లో ఏవైనా మార్పులు చేయాలంటే ఆధార్ వంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సి వస్తోందని, ధరణి నిర్వహణ మల్టీనేషనల్ కంపెనీ చేతుల్లో ఉండటంతో మన సమాచారం విదేశీ చేతుల్లోకి వెళ్తుందన్నారు. ధరణి ఎట్టిపరిస్థితుల్లో రద్దు చేస్తామని దానికంటే మెరుగైన విధానం తీసుకొస్తామన్నారు. ధరణిని రద్దు చేస్తామంటే కేసీఆర్ కు ఎందుకంత దుఃఖం? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

2018లో తెలంగాణ సెంటిమెంటును నిద్రలేపి కేసీఆర్ రాజకీయంగా లాభం పొందారు. 2018లో చంద్రబాబు రూపంలో కేసీఆర్ కు అవకాశం దొరికిందన్నారు. కానీ పదేళ్లలో కేసీఆర్ గుడ్ విల్ సున్నాకు చేరిందన్నారు. కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. బీఆరెస్ కూటమి, కాంగ్రెస్ కూటమి మధ్యే ఈ ఎన్నికల అని వ్యాఖ్యానించారు. బీజేపీ, ఎంఐఎం బీఆరెస్ కూటమి ఒక వైపు, కాంగ్రెస్, కోదండరాం, కలిసివస్తే కమ్యూనిస్టులు, ప్రజా సంఘాల మా వైపు ఉన్నాయన్నారు.

వందశాతం ప్రజలు ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడించి తీరతారని కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాము పాజిటివ్ అప్రోచ్ తోనే ప్రజల ముందుకు వెళుతున్నామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పి, పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతోనే తాము విజయం సాధిస్తామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

కేటీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్
నేను కందిపప్పు లాంటివాన్ని.. కందిప్పు ఆరోగ్యానికి మంచిదని కేటీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు. మా కొడంగల్, తాండూరు ప్రాంతాల్లో కంది పప్పుకు మంచి పేరుంది. అందుకే నేను కందిపప్పు. కానీ కేటీఆర్ గన్నేరు పప్పు లాంటివారు.. తింటే చస్తారు ఆరోగ్యం బాగుండాలంటే కందిపప్పు, ముద్దపప్పును తీసుకోండి.. గన్నేరు పప్పును కాదు అని రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు.

రేవంత్ రెడ్డి తరపున నామినేషన్ దాఖలు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తరపున కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి శుక్రవారం కొడంగల్ లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గుర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ కొడంగల్ లో రేవంత్ రెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE