మనుషుల ఆరోగ్యానికే కాదు పశువుల ఆరోగ్యానికి సైతం భద్రత, భరోసా

• తొలిసారి రాష్ట్రంలో ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషం
• నోరులేని మూగజీవాలకు సేవ చేయడం దేవుడిచ్చిన అదృష్టం
• పశుసంవర్థక శాఖ ద్వారా అమలు చేస్తున్న వినూత్న పథకాల ద్వారా పెరిగిన జీఎస్ డీపీ
• గుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్, పాల ఉత్పత్తిలో 5వ స్థానం
• పశుపోషణ ద్వారా నిరంతరం రైతులకు అదనపు ఆదాయం
• దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పశు ఆరోగ్య సంరక్షణ కార్డుల జారీ
• 1962 కాల్ సెంటర్ సిబ్బంది పనితీరుపై ప్రశంసలు
• పశు సంవర్థక శాఖలో ఖాళీ భర్తీకి యుద్ధప్రాతిపదికన చర్యలు
• పాడి రైతుకు అభయం డా.వైఎస్సార్ పశు నష్ట పరిహార పథకం
• రైతన్నకు అడుగడుగునా అండగా నిలుస్తోన్న ప్రభుత్వం
• అంతిమంగా రైతన్నలు ఆనందంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
– ప్రపంచ పశువైద్య దినోత్సవం-2023 సందర్భంగా రాష్ట్ర పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పలరాజు

మనుషుల ఆరోగ్యానికే కాదు పశువుల ఆరోగ్యానికి సైతం భద్రత, భరోసా కల్పిస్తూ తద్వారా పాడిరైతులకు, పశువుల పెంపకందార్లకు మేలుచేస్తూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విప్లవాత్మక కార్యక్రమాలు ప్రవేశపెట్టారని రాష్ట్ర పశు సంవర్థక, డెయిరీ, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పలరాజు వెల్లడించారు.
ప్రపంచ పశువైద్య దినోత్సవం-2023 సందర్భంగా రాష్ట్రంలోని గొర్రెలు, మేకల పెంపకందారులు మరియు క్షేత్రస్థాయి సిబ్బందికి లైవ్ స్టాక్ మిషన్ ద్వారా శాస్త్రీయ పద్ధతిలో గొర్రెలు, మేకల యాజమాన్యంపై శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో పశు సంవర్థక శాఖ నిర్వహించిన రాష్ట్ర స్థాయి అవగాహన కార్యక్రమంలో మంత్రి అప్పలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ప్రపంచ పశు వైద్య దినోత్సవం-2023 సందర్భంగా “పశువైద్య వృత్తిలో వైవిధ్యం, సమానత్వం, సమగ్రతను ప్రోత్సహించడం” అనే థీమ్ పై ఆయన సుదీర్ఘంగా చర్చించి విలువైన సలహాలు, సూచనలు అందించారు. నాలుగేళ్ల పశు సంవర్థక శాఖ సాధించిన పురోగతిని, సాధించాల్సిన ప్రగతిని, లక్ష్యాలను మంత్రి క్లుప్తంగా వివరించారు.

ఈ సందర్భంగా పశు సంవర్థక శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని ఉద్దేశించి మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ నోరులేని మూగజీవాలకు సేవ చేయడం దేవుడిచ్చిన అదృష్టంగా భావించాలని సూచించారు. జీవాల సేవలో తరిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి పేరుపేరున మంత్రి ధన్యవాదాలు తెలిపారు. తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేశంలోని ప్రగతి ఆ దేశంలో ఉన్న పశువుల ఆరోగ్యస్థితిని బట్టి చెప్పవచ్చన్న మహాత్మాగాంధీజీ స్పూర్తితో పనిచేస్తున్నామన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా డా.వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవ ద్వారా పశువులకు కూడా అంబులెన్స్ సేవలు తీసుకొచ్చామని మంత్రి అన్నారు. మూగ జీవాలు తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు 1962 నంబర్ కు కాల్ చేస్తే సత్వరమే పశువుల అంబులెన్స్ లు పశువు ఉన్న ప్రాంతానికి వెళ్లి వైద్య సేవలందించడం గొప్ప సంస్కరణ అన్నారు. పాడి పశువులతో పాటు గొర్రెలు, మేకలు వంటి జంతువులకు అత్యవసరమైన, నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.

మందులతో పాటు పశువులను అంబులెన్స్ వాహనంలోకి ఎక్కించేందుకు వీలుగా హైడ్రాలిక్ సౌకర్యం ఏర్పాటుచేశామన్నారు. అవసరమైన పరిస్థితుల్లో దగ్గర్లోని ఏరియా పశువైద్యశాలకు పశువులను తరలించి సరైన వైద్యం అందించడం ద్వారా వాటిని ప్రాణాపాయం నుంచి రక్షించడం జరుగుతుందన్నారు. పశు పోషకులకు ఫోన్ కాల్ ద్వారా అందించే గౌరవాన్ని ప్రత్యక్షంగా పరీక్షించానని తన అనుభవాన్ని చెబుతూ మంత్రి సీదిరి అప్పలరాజు 1962 టోల్ ఫ్రీ కాల్ సెంటర్ సిబ్బంది పనితీరును వివరిస్తూ అభినందించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ.పి అమూల్ పాలవెల్లువ ద్వారా రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా ఆటోమేటెడ్ పాలసేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, వైఎస్సార్ చేయూత పథకం ద్వారా అక్కచెల్లెమ్మలకు పాడి ఆవులు, గేదెల యూనిట్ల ఏర్పాటు, అక్కచెల్లెమ్మలకు మెరుగైన జీవనోపాధి కల్పనలో భాగంగా సుస్థిర ఆదాయం చేకూర్చడమే లక్ష్యంగా జగనన్న జీవక్రాంతి పథకం ద్వారా గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ చేయూత ద్వారా ప్రత్యక్షంగా లబ్ధి పొందిన లబ్ధిదారులను, వారు ఏర్పాటు చేసుకున్న యూనిట్లను చూసి సంతోషమేసిందన్నారు.

పాడి రైతులకు మేలు చేసే విధంగా రాష్ట్రంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు పునరుద్ధరించడమే గాకుండా వాటిని బలోపేతం చేసే లక్ష్యంతో అమూల్ తో ఒప్పందం చేసుకున్న విషయాన్ని మంత్రి వివరించారు. పాల ఉత్పత్తి దారులకు గిట్టుబాటు ధరను కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి లీటర్ పాలపై ప్రైవేట్ డెయిరీలతో పోల్చితే అదనంగా ఆదాయం కల్పిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పశు ఆరోగ్య సంరక్షణ కార్డులను జారీ చేసిన రాష్ట్రం తమదేనని, ఇదొక గొప్ప చర్య అని మంత్రి అభివర్ణించారు.

పశుసంవర్థక శాఖ ద్వారా అమలు చేస్తున్న వినూత్న పథకాల ద్వారా జీఎస్ డీపీ పెరిగిందని, అందుకు కారకులైన పశుపోషకులకు, పశు వైద్యులకు ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు దేశ చరిత్రలోనే గొప్ప అధ్యాయం అన్నారు. పశు సంవర్థక సహాయకులు, పారా స్టాప్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ల ద్వారా పశువులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. నేటివ్ బ్రీడ్ కన్జర్వేషన్ పై ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రశంసించారన్నారు. 154 వెటర్నరీ ల్యాబ్ లను త్వరితగతిన వినియోగంలోకి తేనున్నామన్నారు. ప్రతి ల్యాబ్ ను వినియోగంలోకి తీసుకువస్తే విజయం సాధించినట్టే అన్నారు.

పాడి రైతులకు అభయమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డా.వైఎస్సార్ పశు నష్ట పరిహార పథకాన్ని తెచ్చిందని మంత్రి తెలిపారు. తద్వారా ప్రమాదవశాత్తు, ఆకస్మాత్తుగా పశువులు, గొర్రెలు వంటి జీవాలు చనిపోతే నష్టపరిహారం అందించి ఆదుకుంటున్న విషయం గుర్తుచేశారు. రూ.40 కోట్లతో ప్రారంభించిన మిషన్ పుంగనూర్ ప్రాజెక్టు, ముర్రా బ్రీడింగ్ సెంటర్ ను మంత్రి వివరించారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఆయా బ్రీడ్ లను ఇంప్రూవ్ మెంట్ చేస్తున్నామన్నారు. లైవ్ స్టాక్ గ్రోత్ వృద్ధిలో భాగంగా కాపోస్కోపీ పరీక్షల ద్వారా ఉత్పత్తి శాతాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో కోటికి పైగా పశు సంపద ఉందన్నారు. ప్రతి 5000 పశువులకు ఒక వెటర్నరీ డాక్టర్ ఉండాల్సిన అవసరాన్ని గుర్తించి ఆ దిశగా రాష్ట్రవ్యాప్తంగా పశు సంవర్థక శాఖలో ఖాళీల భర్తీకి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో 10వేలకు పైగా ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో ప్రతి చోటా వెటర్నరీ అసిస్టెంటులున్నారన్న విషయం గుర్తుచేశారు.

వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఆముదాలవలస, పుంగనూరు, బనావసి, సంతనూతలపాడులో 4 వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ అసంపూర్తిగా గరివిడిలో ఉన్న వెటర్నరీ కాలేజీలో పూర్తి సౌకర్యాలు కల్పించి అడ్మిషన్లు కూడా జరిపామన్నారు. త్వరలో పులివెందులలో వెటర్నరీ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అసంపూర్తిగా ఉన్న పశు సంవర్థక శాఖ కార్యాలయాల భవనాల్ని ఈ ఏడాదిలో ఆధునికీకరిస్తామన్నారు.

కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన పశు సంవర్థక శాఖ ప్రధాన కార్యదర్శి డా. గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ పశు సంవర్థక శాఖ ద్వారా పశుపోషకుల సంక్షేమం, పశువుల సంరక్షణకు మరిన్ని సేవలు అందించాలన్నారు. గుడ్ల ఉత్పత్తిలో మొదటిస్థానంలోనూ, పాలు, మాంసం ఉత్పత్తిలో అగ్ర రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ పోటీపడుతూ 5వ స్థానంలో నిలిచిందన్నారు. సర్వీస్ డెలివరి సెంటర్ పాయింట్ లుగా ఆర్బీకేలు నిలిచాయన్నారు. పశుపోషణ ద్వారా రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుందన్నారు. రైతుల ఆర్థికాభివృద్ధికి పశుపోషణ మరింత దోహదం చేస్తుందన్నారు.

పశు సంవర్థ శాఖ సంచాలకులు డా. ఆర్. అమరేంద్రకుమార్ అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో మొదట ప్రపంచ పశు వైద్య సేవ దినోత్సవం నేపథ్యం, ఈ ఏడాది థీమ్, పశు వైద్యుని ప్రాముఖ్యత,పశు పోషకులకు అందించాల్సిన సేవలను వివరించారు. ముఖ్యంగా ప్రతి ఏడాది ఏప్రిల్ చివరి శనివారం రోజు ప్రపంచ పశు వైద్య దినోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

జ్యోతి ప్రజ్వలన, ప్రసంగాలు పూర్తి అయిన అనంతరం డా.సి.కే.రావు ఎండోమెంట్ ట్రస్ట్ 22వ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నిష్ణాతులైన 16 మంది పశు వైద్యులను, ఔత్సాహిక వేత్తలు, విద్యార్థులను మంత్రి సీదిరి అప్పలరాజు శాలువాతో సత్కరించి జ్ఞాపికతో పాటు మెడల్ ను బహుకరించారు. తొలిసారిగా డా.ఎస్.ఎస్.కృష్ణమూర్తి ఫౌండేషన్ ద్వారా 8 మంది పశువైద్యులను, ఔత్సాహికులను, విద్యార్థులను, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ అసోసియేషన్ తరపున ఇద్దరు పశు వైద్యులను, పశు సంవర్థక శాఖలో నాలుగు నిష్ణాతులైన పశు వైద్యులను సత్కరించి మంత్రి అభినందించారు. అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ పశువైద్య దినోత్సవం-2023 సందర్భంగా ఉద్యోగులంతా ప్రతిజ్ఞ చేశారు.సీకే.రావు ఎండోమెంట్ ట్రస్ట్ కు సంబంధించిన పుస్తకాన్ని మంత్రి చేతుల మీదుగా విడుదల చేశారు.

కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ అడిషనల్ డైరెక్టర్ కె.వెంకట్రావు, స్మైల్ డైరెక్టర్ డా. వై.సింహాచలం, ఎస్.ఎస్. కే ఫౌండేషన్ వ్యవస్థాపకులు, రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ ఎస్.ఎస్. కృష్ణమూర్తి, సీ.కే.రావు ఎండోమెంట్ ట్రస్ట్ సభ్యులు, రిటైర్డ్ సీఈవో డా. రామలింగరాజు, పశు సంవర్థక శాఖ రిటైర్డ్ డైరెక్టర్ సోమశేఖర్, శాఖ ఉన్నతాధికారులు, అధికారులు, ఉద్యోగులు, 26 జిల్లాల నుంచి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ పాల్గొన్నారు.

Leave a Reply