Suryaa.co.in

Andhra Pradesh

న్యాయ వృత్తికి అభివందనం

– న్యాయవాదుల ఆత్మీయ సమావేశంలో డా. పెమ్మసాని

గుంటూరు: న్యాయానికి అన్యాయం జరక్కుండా న్యాయ దేవతను కంటికి రెప్పలా కాపాడుతున్న న్యాయవాదులకు అభివందనం చేస్తున్నా అన్నారు గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డా. పెమ్మసాని చంద్రశేఖర్.శనివారం గుంటూరు జిల్లా టిడిపి కార్యాలయంలో జిల్లా టిడిపి లీగల్ సెల్ అధ్యక్షుడు చుక్కపల్లి రమేష్ నేతృత్వoలో న్యాయవాదుల ఆత్మీయ సమావేశo జరిగింది. ఈ సమావేశానికి డా.పెమ్మసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పెమ్మసాని పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో, దేశంలో లేని విధంగా జగన్ తన ఆరాచక పాలనను సాగిస్తున్నారన్నారు. న్యాయ మూర్తులు, న్యాయవాదులపై దాడులు చేయించిన వ్యక్తి జగన్ అని, ఎన్ని కేసులు పెట్టినా, అరెస్టులు చేయించినా వెనకడుగు వేయక, ఎదురుతిరిగిన ఘనత న్యాయవాదులదేనని ఆయన ప్రశాంశించారు. జగన్ ప్రభుత్వం ఈ భూ హక్కు చట్టం ఎవరికోసం తీసుకొచ్చారు అన్నది నేటికీ ప్రశ్నార్థకమే నన్నారు. ఇప్పటికే ఎన్నో దౌర్జన్యాలు అరాచకాలు చేసి అదే కోవలో దుర్మార్గoగా సృష్టించిన ప్రభుత్వం చేతికి భూసేకరణ హక్కు చట్టం కూడా వెళితే సామాన్యుడు బతకలేని పరిస్థితి వస్తుందని తెలిపారు. ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఆనాడు ఎన్టీఆర్ ముందు జాగ్రత్త కొద్దీ పటేల్, పట్వారి వ్యవస్థను రద్దు చేశారని గుర్తు చేశారు.

కాగా 40 ఏళ్ల తర్వాత ఈ జగన్ తిరిగి అదే వ్యవస్థను అమలు చేస్తున్నారని, న్యాయవాదులు పోరాడుతున్న ఈ అంశానికి తాను కూడా పోరాటం చేస్తానని, పార్లమెంట్ లో సైతం తన వంతు ధర్మపోరాటం చేస్తానని పెమ్మసాని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికలు కురుక్షేత్రంగా జరిగినా సరే తాను అడ్డుకోగలనని, అయితే లాయర్లు కూడా తమ వంతు సాయం రాబోయే ప్రజా ప్రభుత్వ పాలన కోసం అందించాలని కోరారు.

బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కేవీకే సురేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన భూహక్కు చట్టంపై 60 రోజులుగా తాము పోరాటం చేస్తున్నామన్నారు. ప్రతిపక్ష నాయకులు ఎందరో తమ పోరాటానికి మద్దతిస్తున్నారన్నారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా తమ పోరాట శిబిరాన్ని సందర్శించారని, టిడిపి ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా సహకరిస్తామని తెలిపారన్నారు. డాక్టర్ పెమ్మసాని కూడా తమ పోరాట శిబిరాన్ని ఒకసారి సందర్శించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

సీనియర్ న్యాయవాది దొడ్డాల కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలందరికీ సేవ చేయాలనే తలంపుతో పెమ్మసాని వచ్చారని తెలిపారు. ఈ జగన్ కు పోలీసుల అండ ఉంటే టిడిపికి లాయర్ల అండ ఉందని, ఆ పోలీసుల్ని కూడా తరిమికొట్టిన ఘనత గుంటూరు జిల్లా లాయర్లదేనని ఆయన చెప్పారు. ప్రతీ పోలింగ్ బూత్ లోను ప్రశ్నించే గొంతు గల లాయర్లు బూత్ ఏజెంట్లుగా ఉంటే టిడిపి ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుందని ఆయన తన అభిలాషను వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీడీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ శాఖమూరి రేవతి, జి బి ఏ ప్రెసిడెంట్ కెవికె సురేష్, రాష్ట్ర టిడిపి లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE