పేరు మార్చుకోబోతున్న శశికళ!

జయలలిత మరణం తర్వాత రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన ఆమె నెచ్చెలి శశికళ అనూహ్య రీతితో జైలు పాలయ్యారు. ఆ తర్వాత బయటకు వచ్చిన ఆమె రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండాలని, అన్నాడీఎంకేను తన గుప్పిట్లో పెట్టుకోవాలని భావించినా ఆ విషయంలో విఫలమయ్యారు. ఆ పార్టీ నేతలు ఆమె ముఖం చూడడానికి కూడా ఇష్టం చూపించలేదు. దీంతో ఒంటరిగా మారిన శశికళ.. రాజకీయాల నుంచి తప్పుకుని ఆధ్యాత్మిక మార్గంలో నడవనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆధ్యాత్మిక యాత్రలు ప్రారంభించారు. పలు గుళ్లుగోపురాలను సందర్శించారు.

అయితే, మళ్లీ మనసు మారింది. మద్దతుదారులు తనను తిరిగి రాజకీయాల్లోకి రమ్మంటున్నారని, కాబట్టి మనసు మార్చుకున్నానని చెప్పారు. ఆ తర్వాత మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఇన్ని చేస్తున్నా ఆమెకు ఏమాత్రం కలిసి రావడం లేదు. ఆమె జైలుకు వెళ్లినప్పుడు అండగా ఉన్న దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే పార్టీ నేతలు కూడా పట్టించుకోవడం మానేశారు. ప్రస్తుతం ఆమె.. సోదరుడు దినకరన్, భర్త నటరాజన్ సోదరులు, వదిన ఇళవరసి వారసుల సూచన మేరకు శశికళ నడుచుకుంటున్నట్టు తెలుస్తోంది.

జయలలిత మాజీ సహాయకుడు పూంగుండ్రన్‌ను పిలిచి తనకు సహాయకుడిగా పనిచేయాలని శశికళ అడిగారని, అందుకు ఆయన నిరాకరించారని కూడా సమాచారం. అనుకున్నదేదీ సవ్యంగా సాగకపోవడం, ప్రతీ దాంట్లోనూ ఆటంకాలు ఎదురవుతుండడంతో ఇక లాభం లేదని ఇటీవల శశికళ ఓ జ్యోతిష్యుడిని కలిసినట్టు తెలుస్తోంది. ఆమె జాతకాన్ని చూసిన ఆయన.. పేరుతోపాటు ప్రస్తుతం ఉంటున్న ఇంటిని కూడా మార్చాలని సలహా ఇచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ మార్చాలని శశికళ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply