Suryaa.co.in

Telangana

సెక్రటేరియట్ లో షాడో సీఎం.. కమాండ్ కంట్రోల్ లో డమ్మీ సీఎం

– రేవంత్ తోక కత్తిరించిన రాహుల్ గాంధీ
– సర్కారుపై పెత్తనం మీనాక్షి నటరాజన్ చేతికి
– ఇప్పటి వరకు రేవంత్ చేతుల మీదుగా ఢిల్లీకి డబ్బు మూటలు
– ఇక నుంచి డబ్బుల కలెక్షన్ బాధ్యత మీనాక్షి నటరాజన్ కే
– ఏఐసీసీ పెద్దల దృష్టిలో సీఎం రేవంత్ బీజేపీ కోవర్ట్
– బీజేపీతో రేవంత్ ది ఫెవికల్ బంధం
– మోడీ, అమిత్ షా తో మ్యాచ్ ఫిక్సింగ్
– రేవంత్ నల్లమల పులి కాదు, నల్లమల నక్క
– మోడీతో రేవంత్ డీల్, తెలంగాణ యూనివర్సిటీ భూముల సేల్
– రేవంత్ కు రక్షణ కవచంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ త్రయం
బీఆర్ఎస్ ను ఓడించి పొరబాటు చేసామన్నది ప్రజాభిప్రాయం
– కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజం
_ బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు

నిజామాబాద్: సర్కార్ పెత్తనం చెలాయిస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ సెక్రటేరియట్ లో షాడో సీఎం గా సమీక్షలు చేస్తుంటే డమ్మీ సీఎంగా మారిన రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో గోళ్ళు గిల్లుకుంటున్నారని బీ ఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

నిజామాబాద్ లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ ల సమక్షంలో వారు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. జీవన్ రెడ్డి, బిగాల గణేష్ లు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగేతర శక్తుల ప్రమేయం పెరిగిందన్నారు.

ఏఐసీసీ పెద్దల దృష్టిలో సీఎం రేవంత్ బీజేపీ కోవర్ట్ అని, రాహుల్ గాంధీ నమ్మడం లేదని, అందుకే రేవంత్ తోక కత్తిరించి పక్కనబెట్టారని ఆయన అన్నారు. రేవంత్ ను అడుపుచేయడానికి రాహుల్ దూతగా వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఏ హోదాలో సచివాలయంలోకి అడుగుపెట్టారని జీవన్ రెడ్డి నిలదీశారు.

గాంధీ భవన్ లో సమీక్షలు పెట్టాల్సిన మీనాక్షి నటరాజన్ సచివాలయంలో , సచివాలయంలో సమీక్షలు పెట్టాల్సిన సీఎం రేవంత్ రెడ్డి. కమాండ్ కంట్రోల్ లో సమీక్షలు చేస్తుండడం వింతగా ఉందన్నారు.

ఇప్పటి వరకు రేవంత్ చేతుల మీదుగా ఢిల్లీకి డబ్బు మూటలు అందాయని, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలలో జరిగిన ఎన్నికల కోసం కాంగ్రెస్ కు సీఎం రేవంత్ రెడ్డి డబ్బులు సమకూర్చారన్నారు.

ఇక నుంచి డబ్బుల కలెక్షన్ బాధ్యత మీనాక్షి నటరాజన్ కే రాహుల్ గాంధీ అప్పగించారని, త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికల కోసం డబ్బు పోగేయడానికి మీనాక్షి నటరాజన్ నేరుగా రంగంలోకి దిగి సచివాలయం లోనే సమీక్షలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు.

“బీజేపీతో రేవంత్ ది ఫెవికల్ బంధం. మోడీ, అమిత్ షా తో ఆయన మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి వచ్చినాక హైదరాబాద్ లో కూల్చివేతలు, పేల్చివేతలు తప్ప ఎలాంటి అభివృద్ధి లేదు. హైదరాబాద్ లో విశ్వ విద్యా లయాలకు చెందిన భూములు అమ్ముకునే పనిలో సీఎం బిజీగా ఉన్నారు. రేవంత్ రెడ్డి కూలగొట్టుడు తప్ప కట్టుడు తెలియని హైదరాబాద్ తుగ్లక్. రేవంత్ నల్లమల పులి కాదు, నల్లమల నక్క. అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు.

తెలంగాణ ఆత్మ గౌరవాన్ని డిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. సీఎం పోస్ట్ కాపాడు కునేందుకే బడే బాయ్ తో చోటే బాయ్ దోస్తీ కట్టారని, మోడీతో రేవంత్ డీల్ చేసుకొని తెలంగాణ యూనివర్సిటీల భూములను సేల్ కు పెట్టారని జీవన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ అరవింద్ త్రయం రేవంత్ కు రక్షణ కవచంగా నిలుస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

“తెలంగాణకాంగ్రెస్ కు ఓటేసినందుకు జనం బాధ పడుతున్నరు. ఇంటి పార్టీ బీఆర్ఎస్ ను ఓడించి తప్పు చేసామన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ప్రతీ పల్లే మళ్లీ కారు రావాలి, సార్ కావాలి, కేసీఆర్ సర్కారు రావాలని కోరుకుంటున్నది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ లోకి వరదల వలస కొనసాగుతోంది.

రేవంత్ రెడ్డి అంటేనే అబద్దాల డంపు, అవినీతి కంపు. కాంగ్రెస్ పాలనంటేనే ఆగమాగం. ఎన్నికల హామీలలో దాదాపు అన్నిటికి ఎగనామం పెట్టారు. అరకొర పథకాలు సగం సగం అమలవుతున్నాయి. రైతు రుణమాఫీ, రైతు భరోసా సగంసగం అమలు చేసి మహాలక్ష్మి పథకానికి, కళ్యాణ లక్ష్మీ, తులం బంగారానికి ఎగనామం పెట్టారు. మహిళల ఉచిత ప్రయాణ బస్ మధ్యలోనే మిస్ అవుతోంది.

సంక్షేమ పథకాలు కిల్ ..సంక్షోభం ఫుల్
ఇందిరమ్మ రాజ్యమంటేనే హామీల అమలుకు సమాధి. అవినీతి, అక్రమాల కు పునాది” అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలోతన పాలనకు రెఫరెండం నాకు ఓటు వేయండి అని అడిగిన రేవంత్ రెడ్డిని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడగోట్టారన్నారు.
గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బడే భాయ్ కోసం చోటే భాయ్ తోఫా ఇచ్చాడ న్నారు. అమ్ముడు పోవడం రేవంత్ రెడ్డికి అలవాట న్నారు.కేసీఆర్ అంటే ఒక నమ్మకం, మోడీ, రేవంత్ రెడ్డి అంటే అమ్మకం. బడే బాయ్, చోటే బాయ్ అమ్మకాలలో పోటీ పడుతున్నారు.
బడేబాయ్ మోడీ పోర్టులు, ఎయిర్ పోర్టులు అమ్ముతుండు. ఇక్కడ చోటే బాయ్ రేవంత్ రెడ్డి యూనివర్సిటీల భూములు అమ్ముతుండు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముకోనిస్తే రేవంత్ కు పట్టపగ్గాలుండవు.
అన్ని యూని వర్సిటీల భూముల అమ్మకాలు అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కళాశాలల భూములు అమ్మాలని కుట్ర చేస్తుండు.

నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇప్పటికే నిజామాబాద్, ఆర్మూర్ తదితర ప్రాంతాల్లో గల కాలేజీల పరిధిలో ఎన్ని భూములు న్నాయన్న అంశంపై కూడా అధ్యయనం చేయించినట్టు తెలిసింది. అన్ని వర్గాల ప్రజలను ముంచినట్టే విద్యార్థుల నోటిలో కూడా మట్టి కొట్టడానికి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తుండు.

సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఎవరైనా కొంటె బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తిరిగి స్వాధీనం చేసుకుంటామని కేటీఆర్ చేసిన ప్రకటన కాంగ్రెస్ నాయకులకు వణుకు పుట్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకం రేవంత్ రెడ్డి భూముల అమ్మకాలపై తిరగబడాలి’ అని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE