Suryaa.co.in

Telangana

మ‌హిళ సాధిక‌ర‌త‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టాలి

– వ్య‌వ‌సాయ‌, ప‌ర్యాట‌క‌, సాఫ్ట్ వేర్ రంగాల‌తో స్వ‌యం స‌హాయ‌క బృందాల‌ను అనుసంధానం చేయాలి
– రోగుల‌కు స‌హాయ‌కులుగా వ‌చ్చే మ‌హిళ‌ల‌కు భోజ‌న‌, వ‌స‌తి క‌ల్పించాలి
– పిల్ల‌ల‌తో యాచించే వారిని గుర్తించి నిరోదించండి
– పంచాయ‌తీరాజ్‌, మ‌హిళ శిశు సంక్షేమ శాఖ బ‌డ్జెట్ స‌మీక్ష‌లో డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌

వ్య‌వసాయ ఆధారిత కుటీర పరిశ్రమల ఏర్పాటు, పర్యాటక, సాఫ్ట్-వెర్ రంగాలతో స్వయం సహాయక బృందాలను అనుసంధానం చేయడం ద్వారా మహిళా సాధికారతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ రోజు డా. బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖలకు సంబంధించి బడ్జెట్ అంచనాల రూప‌క‌ల్ప‌న‌పై సమావేశం ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగింది.

ఈ స‌మావేశానికి మ‌హిళ‌, శిశు సంక్షేమ, పంచాయ‌తీ రాజ్‌ శాఖ మంత్రి ధ‌న‌స‌రి అన‌సూయ (సీత‌క్క‌) హాజ‌ర‌య్యారు. ఈ సందర్బంగా భ‌ట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 4,37, 899 స్వయం సహాయక బృందాలలో ఉన్న 46 ,68 ,284 మహిళా సభ్యుల ఆర్ధికాభివృద్దికి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలని సూచించారు. మహిళా సంఘాలకు అందించే రుణాలతో గ్రామీణ, వ్యవసాయ రంగ ఆధారిత వాణిజ్యం చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేయించాలని అన్నారు. ప్రస్తుత మార్కెట్ లో ఆర్గానిక్ పంట ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్నందున, ఎస్.హెచ్.జి లను ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్లించాలన్నారు. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో గతంలోనే పటిష్టమైన మంచినీటి సరఫరా కల్పనకు పైప్ లైన్లు, నీటి వనరులున్నప్పటికీ వాటిని మూసి వేసి దూరము నుండి భగీరథ పేరుతొ పైప్ లైన్లు వేశారని, ఏగ్రామంలో నైనా నీటి సరఫరా ఆగిపోతే, వాటిని నియమిత కాలంలో పునరుద్ధరించడానికి టైం లైన్లను పెట్టుకోవాలని పేర్కొన్నారు.

చిన్న పిల్లలు రాష్ట్ర సంపదలా భావించాలని, నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద చిన్న పిల్లలను చూపిస్తూ యాచించే వారిని గుర్తించి పిల్లలను కాపాడటానికి తగు చర్యలు చేపట్టాలని మహిళా, శిశు సంక్షేమ శాఖపై సమీక్ష సందర్బంగా ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. జిహెచ్ఎంసి, పోలీస్‌, మ‌హిళ శిశు సంక్షేమ శాఖ‌లు సంయుక్తంగా స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హించాల‌ని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప‌ద‌వ‌త‌ర‌గ‌తి త‌రువాత విద్య‌కు దూరం అవుతున్న బాలిక‌ల‌ను గుర్తించి వారి భ‌విష్య‌త్తులో స్థిర‌ప‌డే విధంగా వివిధ రంగాల్లో శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా జంట న‌గ‌రాల‌కు వివిధ ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌కు వ‌చ్చేటువంటి రోగుల ఆటేండ‌ర్లు ముఖ్యంగా మ‌హిళ‌లు, వారి పిల్ల‌లు ఆసుప‌త్రుల వ‌ద్ద ఉండ‌టానికి కావాల్సిన షెల్ట‌ర్లు, వారికి ఆహారం అందించేందుకు త‌గిన ప్ర‌ణాళిక‌లను సిద్ధం చేయాల‌ని ఆదేశించారు.

రాష్ట్రంలోని ట్రైబ‌ల్ ఏరియాలోని పిల్లలలో పోషకార లోపం అధికంగా ఉన్నాయన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆదిలాబాద్ జిల్లాలతో సహా, ఏజెన్సీ ప్రాంతాలు, అచ్చంపేట లలో గిరిజన బాల బాలికల్లో ఎక్కువగా ఉందని తెలిపారు. దీని నివారణకు వైద్య ఆరోగ్య శాఖతో కలసి మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రణాలికను రూపొందించాలని అన్నారు. శిశు కేంద్రాలలో ఉన్న విద్యార్థులను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాంటి పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ మాట్లాడుతూ, రానున్న వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖలకు గతంలోకన్నా అధిక నిధులను కేటాయించాలని కోరారు.

ఈ సమావేశానికి రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, రాష్ట్ర ఆర్థిక శాఖ కమీషన్ కార్యదర్శి స్మితా సబర్వాల్, పంచాయితీ రాజ్ శాఖ కమీషనర్ హనుమంత రావు, ఫైనాన్స్ జాయింట్ సెక్ర‌ట‌రి హ‌రిత‌, డిప్యూటి సీఎం సెక్ర‌ట‌రి కృష్ణ భాస్క‌ర్‌ తదితర అధికారులు హాజరయ్యారు.

LEAVE A RESPONSE