– మంత్రులు, రక్షణశాఖ అధికారులతో మోదీ కీలక భేటీ
– పీవోకేలోని ఉగ్రవాదుల స్థావరాలపై మరో సర్జికల్ స్ట్రైక్
– కేంద్రం సంచలన నిర్ణయం
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయంశమవుతోంది. ఈ ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం కీలక భేటీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఉగ్రస్థావరాలపై సర్జికల్ స్ట్రైక్కు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
మినీ స్విట్జర్లాండ్గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.
విశ్వసనీయ వర్గాల ప్రకారం.. లోక్ కల్యాణ్ మార్గ్లోని మోదీ నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధాని మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, నేషనల్ సెక్యూరిటీ సలహాదారుడు అజిత్ దోవల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
ఈ సమావేశంలో కాశ్మీర్లో ఉగ్రవాదులను ఏరివేసే చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్లోని బాలకోట్లో తలదాచుకున్న ఉగ్రవాదులపై 2019లో సర్జికల్ స్ట్రైక్ జరిపిన సంగతి తెలిసిందే. అప్పట్లాగే ఈసారి కూడా పీవోకేలోని ఉగ్రవాదుల స్థావరాలపై మరో సర్జికల్ స్ట్రైక్ చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది.