Suryaa.co.in

Andhra Pradesh

ముస్లింలకు మేలు చేసింది..చేసేది టీడీపీనే

– జగన్ కు అన్ని అస్త్రాలు అయిపోయి…కుల, మత రాజకీయాలపై పడ్డాడు
– పేద ముస్లింలకు ఇచ్చే రంజాన్ తోఫా రద్దు చేసిన జగన్…నేడు మొసలి కన్నీరు
– టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
– పొత్తు పై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని ముస్లిం సంఘాలకు పిలుపు

అమరావతి : సీఎం జగన్మోహన్ రెడ్డి మొహంలో ఓటమి భయం కొట్టొచ్చినట్లు కనబడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కోడికత్తి డ్రామా నుండి బాబాయ్ హత్య వరకూ అన్ని అస్త్రాలు ఉపయోగించిన జగన్ ఇప్పుడు మతాలు, కులాలపై పడ్డారని చంద్రబాబు విమర్శించారు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫారూక్ షిబ్లీతో పాటు పలువురు ముస్లిం సంఘాల నేతలు సోమవారం చంద్రబాబును ఉండవల్లి నివాసంలో కలిశారు.

ఎన్డీయే కూటమిలో టీడీపీ చేరడంపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత మాట్లాడుతూ….జనసేనతో పొత్తు సమయంలో కుల రాజకీయం చేసి బోల్తాపడ్డ జగన్ అండ్ టీం… ఇప్పుడు బీజేపీతో పొత్తు అనంతరం మత రాజకీయానికి తెరతీసిందని చంద్రబాబు అన్నారు. టీడీపీ బీజేపీ పొత్తుతో ముస్లీం మైనారిటీలకు నష్టం అంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలను నమ్మరని, ముస్లిం సంఘాల నేతలు కూడా వైసీపీ మత రాజకీయాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

ముస్లింలపై జగన్ కు నిజంగా ప్రేమ ఉంటే రంజాన్ మాసంలో ఇచ్చే రంజాన్ తోఫా కూడా ఎందుకు ఇవ్వడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. ముస్లింలకు ఇచ్చే దల్హన్ పథకం, దుకాన్ మాకాన్ సహా పది సంక్షేమ పథకాలను రద్దు చేసిన జగన్…ఎన్నికలు రాగానే మత రాజకీయంతో లబ్ధి పొందాలని చూస్తున్నాడని దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వంలో ముస్లింలకు ఒక్క పథకం అయినా ఉంటే చెప్పాలని డిమాండ్ చేశారు.

మనం కడపలో 90 శాతం పూర్తి చేసిన హజ్ హౌస్ ను కూడా పూర్తి చెయ్యలేకపోయిన జగన్ కు మైనారిటీ గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. ముస్లింల ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల్లో రాజీ ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు

LEAVE A RESPONSE