Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీకి రాజీనామా చేశానన్న అక్కసుతోనే మండలి నాపై అమానవీయంగా అన్యాయంగా ప్రవర్తిస్తోంది

• శాసన మండలి నుంచి అందిన నోటీసులపై నాలుగు వారాల వ్యవధి కావాలన్నాను
• నాకు సమయం ఇవ్వకుండా, నా వివరణ కోరకుండా నాపైచర్యలకు ఉపక్రమించడం అన్యాయం.. రాజ్యాంగ విరుద్దం
ఎమ్మెల్సీ సీ.రామచంద్రయ్య 

ఏపీ శాసనమండలి నుంచి నాకు ఈ నెల 8న నోటీసులు అందాయని, వాటిలో మీరు పార్టీ మారినట్టు మీ ప్రవర్తన వల్ల తెలిసిందని, వారంరోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారని, నా వ్యక్తిగత సిబ్బంది సంక్రాంతి పండుగదృష్ట్యా ఊళ్లకు వెళ్లారని, వారు అందుబాటులో లేరని, వారు వచ్చాక మీరు కోరిన అంశాలపై స్పందిస్తానని, అందుకు నాలుగువారాల వ్యవధి కావాలని తాను కోరితే, వారం వ్యవధి మాత్రమే ఇచ్చారని ఎమ్మెల్సీ రామచంద్రయ్య తెలిపారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడిన వివరాలు ఆయన మాటల్లోనే …

“ మండలి నుంచి నాకు నోటీసులు అందినప్పుడు నా సతీమణి ఆరోగ్యం కూడా బాగోలేదు. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కచ్చితంగా నాలుగువారాల వ్యవధి కావాలని కోరాను. ఈ నెల 24న నేను నా విజ్ఞప్తి తెలియచేయగానే 25 ఉదయా నికి నాకు సమాధానం వచ్చింది. నా విషయంలో శాసనమండలి యంత్రాంగం ఎంత త్వరగా స్పందించారో చూడండి.

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాపై అమానవీయంగా, అన్యాయంగా, ఆవేశంతో చర్యలకు ఉపక్రమించడం సరైన విధానం కాదు.

శాసనమండలి ఛైర్మన్ నాపై చర్యలు తీసుకునే ముందు రాజ్యాంగం ప్రకారం నాకు తగినంత వ్యవధి తగిన అవకాశం ఇవ్వాలి. అలా కాకుండా నిర్దాక్షణ్యంగా ఏకపక్షంగా చర్యలు తీసుకోవడం సరైంది కాదు. నేను వైసీపీకి రాజీనామా చేయడం నిజమే. పార్టీలోని అప్రజాస్వామిక విధానాలను, నియంత్రత్వ పోకడల ను నిరసిస్తూ రాజీనామా చేస్తున్నట్టు చెప్పాను. మండలి సభ్యుడిగా ఆ సభలో పలు కీలక ఘట్టాల్లో ప్రధాన భూమిక పోషించాను.

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాపై అమానవీయంగా, అన్యాయంగా, ఆవేశంతో చర్యలకు ఉపక్రమించడం సరైన విధానం కాదని తెలియచేస్తున్నాను. నా వివరణ అడగకుండా దారుణంగా చర్యలు తీసుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఏమొచ్చింది? నన్ను భయపెట్టే ప్రయత్నం చేయడం ఎవరివల్లా కాదు. నియంత్రత్వంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలే తగిన సమాధానం చెబుతారు.

వైసీపీకి విధేయుడిగా ఉండాలా..రాజ్యాంగానికి బద్ధుడినై ప్రవర్తించాలా?
మండలి ఛైర్మన్ నా పనితీరుని ప్రశంసించిన సందర్భాలున్నాయి. పెద్దలసభలో ఉన్నంత కాలం నిష్పక్షపాతంగా, నిజాయితీగా పనిచేశాను. తాను వైసీపీకి విధేయుడినై ఉండాలా… రాజ్యాంగానికి బద్ధుడినై వ్యవహరించాలా అనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి. అరాచక పరిపాలన చేస్తున్న పార్టీలో కొనసాగడం ఎవరికైనా ఇష్టం ఉంటుందా?

భజన బృందానికి తప్ప, ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వని చోట మనుగడ సాగించలేం. రాజ్యాంగానికి విరుద్ధంగా గత ప్రభుత్వం రాజధాని అంశంలో తీసుకున్న నిర్ణయాన్ని తిరస్కరించినందుకు, న్యాయస్థానాల ఆదేశాలు ఖాతరు చేసినందుకు ముందు ముఖ్యమంత్రి పదవికి జగన్ రెడ్డి రాజీనామా చేయాలి.” అని రామచంద్రయ్య తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE