Suryaa.co.in

Andhra Pradesh

చవితికి అనుమతి ఇవ్వలేదు..మద్యం యదేచ్ఛగా అమ్ముకునేందుకు అనుమతి

– మద్యం విక్రయాలతో పచ్చటి కాపురాల్లో చిచ్చు రేగుతోంది
– టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
ప్రభుత్వం వినాయకచవితికి అనుమతి ఇవ్వలేదుగానీ మద్యం యదేచ్ఛగా అమ్ముకునేందుకు అనుమతినిచ్చిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. సోమవారం జూమ్ యాప్ ద్వారా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జగన్ మద్య నిషేదమంటూ అధికారంలోకి వచ్చారు. ఈ రెండున్నరేళ్లలో మద్యపాన నిషేదం గురించి ఆలోచించనేలేదు. గతంలో ఉన్న రేట్లకి మూడు రెట్లు పెంచారు. మద్యాన్ని రెట్టింపు, మూడొంతుల రేట్లకు అమ్మి ఖజానాని నింపుకుంటున్నారు. ఐదారు రూపాయలకు తయారయ్యే మద్యాన్ని పేదలకు రెండు వందలకు అమ్మి పేదల రక్తాన్ని పీలుస్తున్నారు.
జే ట్యాక్స్ పేరుతో కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని నాణ్యత లేని మద్యాన్ని అమ్ముతూ ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేశారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఈ ప్రభుత్వం అవినీతితో రూ.25 వేల కోట్లు దోపిడీ చేస్తోంది. వైసీపీ నేతల అక్రమ సంపాదన రోజు రోజుకు పెరుగుతోంది. పేదవాడు సంపాదించిన డబ్బంతా మద్యానికే తగలేయాల్సి వస్తోంది. మద్యం ధరలు అధికంగా ఉండటంతో తక్కువ ధరకు దొరికే శానిటేజర్లు, నాటుసారా తాగి అనేక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
మద్యపాన నిషేదాన్ని ఎందుకు అమలుచేయలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలి. టీచర్లను దుకాణాల వద్ద ఉంచి మద్యాన్ని అమ్మించే దుస్థితికి ప్రభుత్వం దిగజారింది. కరోనాతో ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదుగానీ మద్యం అమ్మకాలు, మద్యం ఆదాయం ఆగకూడదన్నట్లుగా ప్రభుత్వముంది. నాటుసారాతో వందల ప్రాణాలు పోయినా ప్రభుత్వం వారిని ఆదుకోలేదు. పేదవాడి బలహీనతలను అడ్డం పెట్టుకొని లబ్ది పొందుతోంది. మద్యంపై లోన్లు తీసుకోవడం సిగ్గుచేటు. మద్యం బాబులను కూడా తాకట్టు పెట్టే స్థితికి ప్రభుత్వం దిగజారింది. మద్యం అమ్మకాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన అవసరముంది.మద్యపాన నిషేదాన్ని వెంటనే అమలు చేయాలి. లిక్కర్, నాటుసారాని అదుపులో ఉంచాలి. గతంలోలా యాభై, అరవై రూపాయలకు మద్యం రేట్లు తగ్గించి జలగల్లా పేదల రక్తాన్ని పీల్చడం మానాలి. లేకుంటే ప్రజలచే ప్రభుత్వానికి పరాభవం తప్పదు. ప్రజల నుండి తిరుగుబాటు రాక మానదు. ప్రభుత్వానికి ఘోరీ కట్టే రోజులు దగ్గరపడ్డాయని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

LEAVE A RESPONSE