– జనవరి మాసాంతానికి నీటిపారుదల శాఖాలో పదోన్నతులు
– ఎక్కువ ఖర్చుతో తక్కువ ప్రయోజనం జరిగింది
– నీటిపారుదల శాఖ బడ్జెట్ లో 11000 వేల కోట్లు అప్పులకు, వడ్డీలకే సరిపోతుంది
– సంవత్సరం వ్యవధిలో 700 ఏ.ఇ.ఇ లు,1800 లష్కర్ ఉద్యోగాల భర్తీ
– మరో 1300 ఉద్యోగాల నియామకాలకుగాను పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అనుమతులు
– యావత్ భారతదేశంలోనే తెలంగాణా నీటిపారుదల శాఖకు ప్రత్యేక గుర్తింపు
-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: నీటిపారుదల శాఖలో జనవరి మాసాంతానికి పదోన్నతులతో పాటు బదిలీల ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
నీటిపారుదల శాఖా సలహాదారు ఆదిత్య దాస్ నాధ్,ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా,ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,ఇ. ఎన్.సి జెనరల్ అనిల్ కుమార్,ఇ. ఎన్.సి ఓ&యం విజయభాస్కర్ రెడ్డి లతో వేసిన ఫైవ్ మెన్ కమిటీ సిఫార్సుల మేరకే ఈ ప్రక్రియ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇంతకాలంగా న్యాపరమైన అడ్డంకులు ఉన్నందునే జాప్యం జరిగిందని వాటిని అధిగమించేందుకు ఫైవ్ మెన్ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
బుధవారం ఎర్రమంజిల్ కాలనీలోని జలసౌధ లో తెలంగాణా ఏ.ఇ.ఇ ల అసోసియేషన్ రూపొందించిన 2025 డైరీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఇ. ఎన్.సి అనిల్ కుమార్,హరేరాం, డిప్యూటీ ఇ. ఎన్.సి కే. శ్రీనివాస్ లతో పాటు అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు, సత్యనారాయణ ,సంఘం నేతలు బండి శ్రీనివాస్, నాగరాజు,సమర సేన్,సంతోష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణా రాష్ట్రంలో దశాబ్దా కాలంగా నీటిపారుదల రంగం గాడి తప్పిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి గాను నీటిపారుదల శాఖా సంవత్సరానికి అప్పులకు,వడ్డీలకే 11,000 వేల కోట్లు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. గడిచిన ప్రభుత్వం ఎక్కువ ఖర్చుచేసి తక్కువ ప్రయోజనం పొందిందని, ఆ ఫలితం ఇప్పుడు రాష్ట్ర పర్సభుత్వానికి భారంగా పరిణమించిందన్నారు.
అటువంటి నీటిపారుదల శాఖాను సంవత్సరకాలంగా గాడిలో పెడుతున్నామన్నారు.తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందేలా ప్రణాళికలు రూపొందించామని ఆయన తెలిపారు. మానవ వనరులు,మౌలిక సదుపాయాల మీద ప్రత్యేక దృష్టి సారించామన్నారు. సంవత్సరం వ్యవధిలో 700 ఏ.ఇ. ఇ లను నియమించడంతో పాటు 1800 మంది లష్కర్ లను నియమించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మరో 1300 ఉద్యగాల నియమాకాలకై పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అనుమతిచ్చామన్నారు.
యావత్ భారత దేశంలోనే ఇక్కడి నీటిపారుదల శాఖకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణా ప్రాంతంలోను ఇక్కడి ఇంజినీర్లు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లు నిర్మించారన్నారు. ఆధునిక దేవాలయాలుగా నాగార్జునసాగర్,శ్రీరాంసాగర్,శ్రీశైలం వంటి ప్రాజెక్ట్ లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉదహరించారు. అటువంటి ఇంజినీర్లకు యువ ఇంజినీర్లు వారసత్వంగా ఎదగాలని ఆయన ఉద్బోధించారు.