– దేశాన్ని అస్థిరపరిచేందుకే విదేశీ నిధులు
– విదేశీనిధుల దుర్వినియోగంపై లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ ఫిర్యాదు ఫలితం
దేశవ్యాప్తంగా దాదాపు 6 వేల ఎన్జీవోలు విదేశీ విరాళాల (ఎఫ్సీఆర్ఏ) లైసెన్సులు కోల్పోయాయి. తాజాగా ఎఫ్సీఆర్ఏ లైసెన్సులు కోల్పోయిన వాటిలో కొన్ని సంస్థలు పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోలేదని, కొన్నింటి దరఖాస్తులను కేంద్ర హోంశాఖ తిరస్కరించిందని అధికారులు వెల్లడించారు. ఏ ఎన్జీవో అయినా ఇతర దేశాలకు చెందిన వ్యక్తులు/సంస్థల నుంచి విరాళాలు స్వీకరించాలంటే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) కింద లైసెన్సు తీసుకోవాలి. ప్రస్తుత లైసెన్సు గడువు డిసెంబరు 31తో ముగిసింది. లైసెన్సు పునరుద్ధరణ కోసం ఆయా సంస్థలు కేంద్ర హోంశాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఎన్జీవోలు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పలు కారణాలతో వాటిని తిరస్కరించారు. మరికొన్ని సంస్థలు గడువు ముగిసినా లైసెన్సు పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోలేదు. ఇలా మొత్తంగా 5933 సంస్థలు విదేశీ విరాళాల లైసెన్సులను కోల్పోయినట్లు హోంశాఖ అధికారులు తెలిపారు. దేశంలో మొత్తం 22,762 ఎఫ్సీఆర్ఏ నమోదిత సంస్థలు ఉండగా.. శనివారానికి ఈ సంఖ్య 16,829కి తగ్గినట్లు వివరించారు.
ఇందులో ఆక్స్ఫామ్, జామియా మిలియా, ఇండియన్ యూత్ సెంటర్స్ ట్రస్ట్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహా దాదాపు 6000 సంస్థల ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ కోల్పోయాయి. అయితే ఆక్స్ఫామ్ వంటి సంస్థలు భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు విదేశీ నిధులను ఎలా దుర్వినియోగం చేస్తున్నాయో అనే విషయాన్ని లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ(LRO) అనే సంస్థ అనేక సార్లు బయటపెట్టింది.
2020 సెప్టెంబర్లో ఢిల్లీ హిందూ వ్యతిరేక అల్లర్లకు ఆజ్యం పోసేందుకు హర్ష్ మాండర్ కు చెందిన సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్, ఆక్స్ఫామ్ ఇండియా నిధులను ఎలా దుర్వినియోగం చేస్తున్నాయో కూడా LRO బట్టబయలు చేసింది. ఇలా అనేక సంస్థలు భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఇప్పటికే పునరుద్ధరణ దరఖాస్తులను తిరస్కరించిన “మిషనరీస్ ఆఫ్ చారిటీస్” సంస్థలకు పొడిగింపు వర్తించదని స్పష్టం చేశారు. మిషనరీస్ ఆఫ్ చారిటీకి దాదాపు 250కి పైగా దేశాల నుంచి విరాళాలు అందుతాయి. గుజరాత్లో ఆ సంస్థ నిర్వహించే ఓ బాలికల వసతి గృహంలో మతమార్పిళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఇటీవల పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. ఇదిలా ఉంటే మదర్ థెరిసాకు చెందిన ఈ సంస్థ బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింపజేసినట్లు వార్తలు వచ్చాయి.
దీనిపై విపక్షాలు, ముఖ్యంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి అసత్య ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసింది. చివరికి ఆ సంస్థ ప్రతినిధి స్పందించే అటువంటిది ఏమీ జరగలేదని స్పష్టం చేశారు. ఎఫ్సీఆర్ఏ లైసెన్సు పునరుద్ధరణ కోసం చేసుకున్న దరఖాస్తును మాత్రమే తిరస్కరించామని కేంద్రం స్పష్టం చేసింది.
– విఎస్కె తెలంగాణ సౌజన్యంతో