75 ఏళ్ల క్రితం తేదీ 31-1-1950 న నాటి మద్రాసు ముఖ్యమంత్రి పి.యస్.కుమార స్వామి రాజా, ఆర్థిక మంత్రి బెజవాడ గోపాలరెడ్డి కొందరు ఇంజనీర్లతో శ్రీశైలం వచ్చి శ్రీ శైల రాజమార్గం ఘాట్ రోడ్డు గురించి ఒక నివేదికను తయారుచేసుకొని వెళ్లారు. దీనికి నేపథ్యం శ్రీశైల జగద్గురు వాగీశ పండితారాధ్య శివాచార్య మహా స్వాములవారు వారి సహచర మిత్రులు, స్వాతంత్ర్య సమరయోధులైన శ్రీ ప్రకాశ్ గారు మద్రాసు గవర్నర్ గా వచ్చిన విషయం తెలుసుకుని ఆయనకు శ్రీశైల క్షేత్రం యొక్క పరిస్థితిని శ్రీశైలానికి రాజమార్గం అవసరాన్ని గురించి లేఖను రాయడం.
శ్రీశైల రాజమార్గ నిర్మాణానికి ఆరోజు మూలబీజం పడింది.అది ఎంతటి సుదినమో కదా! ఈవిధంగా ప్రారంభమైన శ్రీశైలం రోడ్డు పనులు 1955 నుండి 1957వరకు ముమ్మరంగా సాగి దోర్నాల నుండి శ్రీశైలం వరకు కొండల మీదుగా కీకారణ్యంలో 49 కిలోమీటర్ల మేరకు కేవలం 69 లక్షల 70వేల రూపాయల వ్యయంతో పూర్తికావడం కూడా విశేషమే.అప్పటి ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి , మైసూరు రాష్ట్ర ముఖ్యమంత్రి యస్.నిజలింగప్ప 24-11-1957 తేదీన ఈ నూతన రాజమార్గానికి ప్రారంభోత్సవం చేశారు.
