Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర భవిష్యత్తు కోసమే మూడు పార్టీల పొత్తు

-ముస్లింలకు తీరని ద్రోహం చేసింది జగనే
-ముస్లింల పథకాల రద్దు చేశాడు…దాడులు చేయించాడు
-బీజేపీతో పొత్తుపై వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలి
-చరిత్రలో నిలిచేలా చిలకలూరిపేట సభ
-నేతల టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

అమరావతి : బీజేపీతో పొత్తు ప్రకటన అనంతరం వైసీపీ తప్పుడు ప్రచారానికి దిగుతోందని, పూర్తి స్థాయిలో దాన్ని తిప్పికొట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. ముస్లింలకు జగన్ ఏమీ చేయలేక మళ్లీ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లు కాపాడింది టీడీపీనే అని, పార్టీ తరపున నాడు న్యాయస్థానంలో వాదించేందుకు న్యాయవాదులను నియమించామని గుర్తు చేశారు. పార్టీ నేతలతో శుక్రవారం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… ‘మతసామరస్యాన్ని కాపాడామన్నారు. ఉర్దూ యూనివ్సిరిటీ, హజ్ హౌస్ లనిర్మాణంతో పాటు ఉర్దూ బాషను రెండో అధికారిక బాషగా చేశాం. పండుగ సమయంలో రంజాన్ తోఫాతో పాటు, దుల్హన్ పథకంతో ముస్లింలను ఆదుకున్నాం. టీడీపీ ముస్లింల కోసం తీసుకొచ్చిన 10 పథకాలను జగన్ రద్దు చేశారు. వాలంటర్లను ఇంటింటింటికి పంపి తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు…దాన్ని పూర్తి స్థాయిలో ఎండకట్టాలి. రాష్ట్రంలో అన్ని వర్గాలు జగన్ వంచనకు గురయ్యాయి.

సామాజిక న్యాయం చేసిన ఏకైక పార్టీ టీడీపీనే. కావాలనే కొన్ని కులాలను జగన్ ఎదగనీయకుండా అనగదొక్కారు. చిలకలూరిపేట సభను చారిత్రాత్మకంగా నిర్వహించబోతున్నాం. పొత్తు ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయాలి. ప్రజల గెలవాలి…రాష్ట్రం నిలవాలి అన్న సంకల్పంతోనే ముందుకు వెళ్తున్నాం. ఎవరికి ఎన్ని సీట్లు అనేది ముఖ్యం కాదని రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడం అందరి బాధ్యత. పొత్తులో భాగంగా ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ఉండాలి. ఎవరూ తక్కువ కాదు…ఎక్కువ కాదు.

సమిష్టి నాయకత్వం, పద్ధతి ప్రకారం నడుస్తున్నాం. పొత్తులో భాగంగా టీడీపీపై పవిత్రమైన బాధ్యత ఉంది. మూడు పార్టీల నేతలు ఏకతాటిపైకి రావాలి. జగన్ అరాచకాలతో రాష్ట్రం విధ్వంసం అయింది. కేంద్రసాయం ఉంటే రాష్ట్రాభివృద్ధికి నిధులు వస్తాయి. కేంద్రంలో అనుకూల ప్రభుత్వాలు ఉంటే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రచారంలో ఎవరు ముందుంటారో వారిదే యుద్ధంలో పైచేయి అవుతుంది.

జాతీయ మీడియా సర్వేలతో మనమే గెలుస్తామని తేలిపోయింది. 20 పార్లమెంట్ లు గెలుస్తామని చెప్తున్నారు..మరింత కృషి చేస్తే 25కు 25 గెలుస్తాం. దొంగ ఓట్లు పడటానికి అవకాశమే ఉండకూడదు. జనసేన, బీజేపీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ప్రతి ఒక్కరూ ఐదేళ్లుగా ప్రాణాలకు తెగించి పోరాడారు. సీట్లు త్యాగం చేసిన వారికి ఎమ్మెల్సీలు, చైర్మన్లుగా అవకాశం కల్పిస్తాం. ఎవరి త్యాగాలూ వృథాకావు.’ అని చంద్రబాబు అన్నారు

LEAVE A RESPONSE