రోడ్ల విస్తరణపై కేంద్ర ప్రభుత్వంలో స్పందన లేదు

– విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుంది
TRS పార్టీ MP లు, MLA, MLC లు, కార్పొరేటర్ ల సమావేశంలో తలసాని
దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ మహానగరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్ళాల్సిన గురుతర బాధ్యత GHMC కార్పొరేటర్ ల పైనే ఉన్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
బుధవారం తెలంగాణ భవన్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన నగరానికి చెందిన TRS పార్టీ MP లు, MLA, MLC లు, కార్పొరేటర్ ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు
ghmc-trs1మహమూద్ అలీ, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, MP రంజిత్ రెడ్డి, MLC లు సురభి వాణిదేవి, ఎగ్గే మల్లేశం, MS.ప్రభాకర్, MLA లు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, సుభాష్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, అరికేపూడి గాంధీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేటర్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో GHMC పరిధిలో కోట్లాది రూపాయల ఖర్చుతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేయడం జరిగిందని, మరికొన్ని పనులు జరుగుతున్నాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాలలో అభివృద్దిని సాధిస్తూ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు.
నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీని, ట్రాఫిక్ ను తట్టుకునేందుకు గాను నూతనంగా ఫ్లై ఓవర్ బ్రిడ్జి లు, అండర్ పాస్ ల నిర్మాణం, అనేక చోట్ల రహదారుల విస్తరణ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వర్షాకాలం లో వచ్చే వరద ముంపును నివారించేలా పక్కా ప్రణాళికలతో అభివృద్ధి పనులను చేపట్టి ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. మురికినీటి శుద్ధి కోసం సీవరేజీ ప్లాంట్ లను ఏర్పాటు చేసేందుకు ఒకేసారి 3 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని అన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా GHMC పరిధిలో తెలంగాణ ప్రభుత్వ హయాంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈ నెల 18 వ తేదీన జరిగే GHMC జనరల్ బాడీ మీటింగ్ సమావేశం వేదికగా చేసుకొని ప్రజలకు వివరించాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటర్స్ కు పిలుపునిచ్చారు. స్వచ్చ్ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా 4500 ఆటోల ద్వారా ఇంటింటికి వెళ్ళి చెత్తను సేకరించడం జరుగుతుందని, దీనిని సమర్ధవంతంగా నిర్వహించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం రెండు అవార్డులను అందజేసిందని చెప్పారు.
కార్పొరేటర్ లు తమ డివిజన్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకే పరిమితం కాకుండా GHMC ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలపై పూర్తి అవగాహనను కలిగి ఉండాలని సూచించారు. GHMC సమావేశంలో ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ సమర్ధవంతంగా తిప్పికొట్టాలని చెప్పారు. GHMC పరిధిలోని కంటోన్మెంట్ లలో రహదారుల విస్తరణ చేయకపోవడం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, రోడ్ల విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ఎలాంటి స్పందనలేదని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఈ నెల 18 వ తేదీన జరిగే సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాల పై 10 మంది కార్పొరేటర్ లతో ఒక సమన్వయ కమిటీ ని ఏర్పాటు చేశారు. భవిష్యత్ లో ప్రతి రెండు నెలలకు ఒకసారి MLA లు, కార్పొరేటర్ లు, అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్పొరేటర్ గా ఎన్నుకున్న ప్రజలకు, అవకాశం కల్పించిన పార్టీకి అనుసందానకర్తగా ఉండేలా నడుచుకోవాలని, నిబద్ధతతో పనిచేసి పార్టీ ప్రతిష్టను ఇనుమడింప చేయాలని చెప్పారు.
కరోనా లాక్ డౌన్ సమయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పిలుపుకు స్పందించి TRS పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు ఎంతోమంది పేదలకు ఆహారం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగిందని గుర్తుచేశారు. సమావేశంలో ఎలా మాట్లాడాలి….ఏం మాట్లాడాలి అనే బెణుకు ను మనసులోంచి తీసివేయాలని నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ లకు మంత్రి మల్లారెడ్డి, MP రంజిత్ రెడ్డి లు పిలుపునిచ్చారు. తాము పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన కొత్తలో ఇదే రకమైన పరిస్థితులను ఎదుర్కొన్నామని, పరిస్థితులను అవగాహన చేసుకుంటూ ముందుకు సాగండి. కార్పొరేటర్స్ గా ఎన్నికై సంవత్సరం పూర్తయిన సందర్భంగా కార్పొరేటర్ లకు సమావేశంలో పాల్గొన్న పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply