Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదు

– రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి
– వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజల బ్రతుకులు అంధకారమయ్యాయి
– ప్రజా ప్రభుత్వ స్థాపనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి లక్ష్యం
– నారా భువనేశ్వరి

2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కోరారు. నిజం గెలవాలి తెనాలి నియోజకవర్గం,కొలకలూరు గ్రామంలో పర్యటన సందర్భంగా తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, గ్రామస్తులతో భువనేశ్వరి కాసేపు ముచ్చటించారు.

ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ….వైసీపీ 5ఏళ్ల పాలనలో రాష్ట్ర పరువు గంగపాలైంది. దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ పరువును వైసీపీ నేతలు తీసేశారు. రాష్ట్ర సచివాలయాన్ని సైతం తాకట్టు పెట్టి వైసీపీ నేతలు తమ జేబులను నింపుకున్నారు. మరోసారి వారికి అధికారం వస్తే ఇంక ఏమేమి తాకట్టు పెడతారో చెప్పలేని పరిస్థితి.

వైసీపీ పాలనలో రాష్ట్ర యువత భవిష్యత్తు సర్వనాశనమైంది. రాష్ట్రానికి ఒక్క కంపెనీని తీసుకురాలేదు…ఒక్క పెట్టుబడి కూడా రాలేదు. రాష్ట్ర యువతకు వైసీపీ నాయకులు గంజాయి, డ్రగ్స్ అలవాటు చేసి వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం, మహిళలపై అకృత్యాల్లో వైసీపీ ప్రభుత్వం ఏపీని నంబర్ వన్ స్థానంలో నిలిపింది. మత్తు పదార్థాలకు బానిసలైన యువత, వైసీపీ నాయకులు మహిళలపై దాడులు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు.

వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండాపోయింది. చంద్రబాబు 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి ముఖ్యమంత్రిగా సేవలందించిన కాలంలో అవిశ్రాంతంగా పనిచేశారు. రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. వివిధ సామాజికవర్గాలకు అవసరమైన సంక్షేమ పథకాలను అమలు చేసి అందరికీ న్యాయం చేశారు.

ఏపీకి కంపెనీలు, పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపించారు. పోలవరం ప్రాజెక్టును 72శాతం చంద్రబాబు పూర్తిచేస్తే…వైసీపీ నాయకులు పోలవరాన్ని గోదావరిలో ముంచి నాశనం చేస్తున్నారు. ఒక్క పని కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తిచేయలేదు. చంద్రబాబు తెచ్చిన కంపెనీలను రాష్ట్రం నుండి తరిమేయడం, ప్రాజెక్టులను ధ్వంసం చేయడమే వైసీపీ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది.

పోలవరాన్ని పూర్తిచేయకుండా రైతాంగాన్ని, రాష్ట్ర ప్రజలను వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వేధిస్తోంది. ఇలాంటి ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఓడించాలి. రాష్ట్ర ప్రజలు తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి…వైసీపీ ప్రభుత్వాన్ని అంతం చేయాలి.

టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల జెండాలు వేరైనా…ఈ మూడు పార్టీల అజెండా ఒక్కటే….అది ప్రజా ప్రభుత్వ స్థాపన. ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించే ఆయుధం రాష్ట్ర ప్రజల చేతుల్లోనే ఉంది…ఆ ఆయుధమే ఓటు…అందుకే రాష్ట్ర ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరుతున్నాను…అని భువనేశ్వరి అన్నారు.

LEAVE A RESPONSE