Suryaa.co.in

Andhra Pradesh

సిద్ధం అంటున్న జగన్ కు యుద్ధం ఇవ్వబోతున్నాం

-బీసీల తలరాతలు మార్చేందుకే డిక్లరేషన్ తెచ్చాం
-త్వరలోనే ఎస్సీ, ఎస్టీ, ముస్లిం డిక్లరేషన్
-ప్రజలు కొట్టే దెబ్బతో తాడేపల్లి కోట బద్ధలవ్వాలి
-అధికారంలోకి వచ్చాక పోలీసుల సమస్యలు పరిష్కరిస్తాం
-అంబాజీపేట ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

అంబాజీపేట/పి.గన్నవరం : బీసీల తలరాతలు మార్చేందుకే బీసీ డిక్లరేషన్ తెచ్చామని, 50 ఏళ్లకే బీసీలకు పెన్షన్ ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సబ్ ప్లాన్ కింద ఏడాదికి రూ. 30 వేలు చొప్పున ఐదేళ్లలో రూ. లక్షా 50 వేలు ఖర్చు పెట్టి బీసీలను ఆర్థికంగా ఆదుకుంటాం. తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ…. స్థానిక సంస్థల్లో 34 రిజర్వేషన్లు కల్పిస్తాం. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల కోసం పోరాడతాం. చట్టబద్ధంగా కులగణన చేస్తాం. బీసీల కోసం ప్రత్యేక చట్టం తెస్తాం. ఆదరణ కింద రూ. 5వేల కోట్లు ఖర్చు పెడతాం. చంద్రన్న బీమా రూ. 10 లక్షలకు పెంచుతాం. బీసీలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం.

సిద్ధం అంటున్న జగన్ కు యుద్ధం ఇవ్వబోతున్నాం
ప్రజల ఉత్సాహం, కసి చూస్తుంటే ఎన్డీఏ కూటమి గెలుపు లాంఛనమే అని తేలిపోయింది. ప్రజా స్పందన ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పడుతోంది. మన ఆడబిడ్డలు, వీరవనితలు పోలింగ్ ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఒక్క చాన్స్ ఇచ్చినందుకు జగన్ రెడ్డి ఏం చేశాడో చూశారుగా. ఐదేళ్ల జగన్ రెడ్డి అరాచక పాలనతో ఇబ్బందులు పడ్డ మీలో భరోసా నింపేందుకే నేనూ ,పవన్ వచ్చాము. సిద్ధం అంటున్న జగన్ రెడ్డికి మర్చిపోలేని యుద్ధం ఇవ్వబోతున్నాం. దానికి మీరు సిద్ధమా ?

పోలీసుల సమస్యలు పరిష్కరిస్తాం
ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత లేకుండా పోయింది. పోలీసులకు బకాయిపడ్డ నిధులను ప్రభుత్వం ఇవ్వలేదు. విశాఖలో ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు ఆర్థిక ఇబ్బందులతో చనిపోయాడు. కానిస్టేబుల్ శంకర్రావు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. రాష్ట్రంలో పోలీసు సిబ్బందిపై ఒత్తిళ్లు ఉన్నమాట వాస్తవమే. పగలు, రాత్రి తేడా లేకుండా శాంతిభద్రతులు కాపడే పోలీసులు ఆర్థిక పరిస్థితులను, ఆరోగ్యాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలి. కానిస్టేబుళ్ల విషయంలో లీవ్ బకాయిలు ఎన్నో నెలలుగా ప్రభుత్వం బకాయిపడింది. పోలీసులకు టీఏ, డీఏలు కూడా చెల్లించడం లేదు. టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీసుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాం.

సామాజిక న్యాయమే మా అజెండా
కోనసీమకు వన్నె తెచ్చిన వ్యక్తి బాలయోగి. సాధారణ కుటుంబంలో పుట్టి లోక్ సభ స్పీకర్ గా ఎన్నికై పదవికి వన్నె తెచ్చారు. ప్రజల గుండెల్లో బాలయోగి శాశ్వతంగా ఉంటారు. నేడు జ్యోతీరావు పూలె జయంతి. మొన్ననే జగ్గీవన్ రామ్ జయంతి జరుపుకున్నాం. అంబేద్కర్ జయంతి జరుపుకోబోతున్నాం. ముగ్గురి నాయకులు సాక్షిగా బడుగులను ఆదుకుంటామని హామీ ఇస్తున్నాం. భవిష్యత్ లో ఒక మాదిగలకు ఎమ్మెల్సీ ఇస్తాం. సామాజిక న్యాయం చేస్తాం. జగన్ రెడ్డి అరాచక పాలనతో జరిగిన సంక్షోభానికి చెక్ పెట్టే సమయం ఆసన్నమైంది.
ప్రజల మధ్య విధ్వేషాలు సృష్టించారు.

జగన్ రెడ్డి విధ్వంస పాలనలో ప్రజలు ఎంతో నష్టపోయారు. నాతో సహా అందరూ బాధితులే. మేము 2014-19 మధ్య కరెంటు చార్జీలు పెంచలేదు. జగన్ రెడ్డి ఈ ఐదేళ్లలో కరెంటు చార్జీల మోతతో ప్రజల నడ్డివిరిచాడు. పెట్రో ల్, డీజిల్, నిత్యావసర ధరలు పెంచి పేదల పొట్ట కొట్టాడు. ఆర్టీసీ చార్జీలు పెంచాడు. చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. మంచినీళ్లు అడిగితే కొబ్బరి నీళ్లు ఇచ్చే గొప్పతనం, మంచితనం కోనసీమ వాసులది. కోనసీమలో ఇంటర్ నెట్ బంద్ చేశాడా లేదా? మీరేమైనా దుర్మార్గులా..ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టిన వ్యక్తి జగన్ రెడ్డి. నాశిరకం మద్యంతో మహిళల మాంగల్యాలు తెంచుతున్న దుర్మార్గుడు జగన్ రెడ్డి. మద్యంతో కోట్ల రూపాయిలు తాడేపల్లి ప్యాలెస్ కు చేర్చాడు.

రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం
2014లో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించిన వ్యక్తి పవన్ కల్యాణ్. సమాజం బాగుండాలనే కోరుకునే వ్యక్తి పవన్ కల్యాణ్. 2024లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిశాం. మా ముందు నిలబడే దమ్ము జగన్ రెడ్డికి ఉందా? జగన్ రెడ్డి దెబ్బకు అన్ని రంగాలు భ్రష్టుపట్టాయి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే మేము జతకట్టాం. దుర్మార్గుడి నుంచి ప్రజలను కాపాడుకునేందుకే కలిశాం. మూడు జెండాలు వేరు ..కానీ మా అజెండా ఒకటే. సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే మా ధ్యేయం.

కాపులకు న్యాయం చేస్తాం
కాపుల్లో కూడా పేదలున్నారు. వారి కోసం ఏడాదికి రూ. 1000 కోట్లు ఖర్చు పెట్టాం. కాపుల కోసం ఐదేళ్లలో రూ. 10 వేల కోట్లు ఖర్చు పెడతానని ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి కనీసం 10 కోట్లైనా ఖర్చు పెట్టాడా ? ఈ ముఖ్యమంత్రి తమాషా ఆడుతున్నాడు. తనను విమర్శించే వారిపై ఆయా కులాల వారి చేత బూతులు తిట్టించడం దుర్మార్గం కాదా? మీరు కొట్టే దెబ్బ జగన్ రెడ్డికి అదిరిపోవాలి. భవిష్యత్ లో ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేయాలి.

రాష్ట్రానికి మంచిరోజులు రాబోతున్నాయ్
గోదావరి జిల్లాల్లో స్థానిక సమస్యలు పరిష్కరిస్తాం. దెబ్బతిన్న కొబ్బరి పంటకు పూర్వ వైభవం తెస్తాం. వరికి గిట్టుబాటు ధర కల్పిస్తాం. ఏ రైతుకూ అన్యాయం జరక్కుండా చర్యలు తీసుకుంటాం. సూపర్ సిక్స్ తో మీ ముందుకు తెచ్చాం. పవన్ క్యలాణ్ మరో 4 పాయింట్లు చెప్పారు. మొత్తం 10 పాయింట్లతో మీకు ఆర్థిక భరోసా కల్పిస్తాం.

యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తాం. పేదలకు పింఛను రూ. 4 వేలు ఇంటికే పంపుతాం. వికలాంగులకు రూ. 6 వేలు ఇస్తాం. వాలంటీర్లకు జీతం రూ. 10 వేలు అందిస్తాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు త్వరలో డిక్లరేషన్ తెస్తాం. జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం చేస్తాం. ఈసారి వన్ వే ఎన్నికలే. హలో ఏపీ..బై బై జగన్

LEAVE A RESPONSE