– ప్రజల ఆస్తుల విలువ కూడా భారీగా పడిపోయింది
– కొత్తగా కట్టాల్సింది పోయి హైడ్రా, మూసి ప్రాజెక్టుల పేరుతో కూలగొడుతున్నారు
– తెలంగాణ భవన్ లో జరిగిన మున్సిపల్ చైర్పర్సన్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: సమైక్య రాష్ట్రంలో మున్సిపాలిటీలు అంటే మురికి కూపాలుగా ఉండేవి. బల్దియాలు అంటే ఖాయా పియా చల్దియా అనే సామెత ఉండేది. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కెసిఅర్ పట్టణాల అభివృద్ది కోసం ప్రత్యేక విజన్ తో పనిచేయాలని దిశానిర్ధేశం చేశారు. అందుకే అర్ధిక ఇంజన్లుగా ఉన్న పట్టణాలను, వాటి సమగ్రంగా డెవలప్ చేయాలని అనేక కార్యక్రమాలు చేపట్టాం.
పట్టణీకరణ అపాలని కొన్ని దేశాలు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.. పట్టాణాల విస్తరణ అపడం వీలు కాదు కానీ, ప్రభుత్వాలకు వాటిని సమగ్రంగా అభివృద్ది చేయడానికి మాత్రం అవకాశం ఉంటుంది. అందుకే ఆ దిశగా పదేళ్లు పనిచేశాం. చేసిన పనిని అభివృద్ది నివేదికల రూపంలో ప్రజల ముందుంచాం. 10 సంవత్సరాలు పాటు జరిగిన పట్టణాలు అభివృద్ధి కేవలం డైలాగులు కొడితే కాలేదు.
పక్కా ప్రణాళికతో పాటు అవసరమైన సంస్కరణలు నిరంతర పర్యవేక్షణ అవసరమైన నిధులు అందించడం వంటి నిరంతర ఫోకస్ తోనే తెలంగాణలోని పట్టణాలు ఈరోజు మోడల్ పట్టణాలుగా తయారయ్యాయి. తెలంగాణ పట్టణాలకు పది సంవత్సరాల్లో అనేక జాతీయ అవార్డులు దక్కాయి. గత పది సంవత్సరాలుగా మున్సిపల్ చైర్పర్సన్లు కౌన్సిలర్లు పట్టణాల అభివృద్ధి కోసం అద్భుతంగా పనిచేశారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి పూర్తి చేశారు
పదవీకాలం ముగిసిన చైర్మన్లు, కౌన్సిలర్లు ప్రజల్లోనే ఉండాలి. మళ్లీ ఎన్నికలు వస్తే ప్రజలు గెలిపించుకుంటారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పరిపాలన వికేంద్రీకరణ కార్యక్రమాలు చేపట్టాం. కొత్త జిల్లాలు, మున్సిపాలిటీలు కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు పరిపాలన మరింత దగ్గర అయింది. మన ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పట్టణాలతో పాటు ప్రజల ఆస్తుల విలువ కూడా పెరిగింది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పట్టణాలు అభివృద్ధి కుంటు పడటంతో పాటు, ప్రజల ఆస్తుల విలువ కూడా భారీగా పడిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా కట్టాల్సింది పోయి హైడ్రా, మూసి ప్రాజెక్టుల పేరుతో కూలగొడుతున్నారు. ప్రభుత్వాన్ని నడిపే వారి ఆలోచనలు సానుకూలంగా ఉంటే రాష్ట్రం, పట్టణాలు అభివృద్ధి చెందుతాయి. గతంలో నల్లగొండ పట్టణాన్ని సమూలంగా అభివృద్ధి చేసిన మనల్ని కాంగ్రెస్ మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.
కానీ అదే నల్లగొండ పట్టణంలో నాలుగు నెలలుగా సిబ్బందికి జీతాలు లేకున్నా పట్టించుకోవడం లేదు. నా నల్లగొండ పర్యటన తర్వాత నన్ను బచ్చగాడు అంటున్న మంత్రి.. సీనియర్ అయ్యుండి పట్టణ అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. మోసపూరిత 420 హమీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు పాలన చేయడం రావడం లేదు. టకీ టకీ మని పైసలు పడుతాయన్నారు కానీ టకీ టకీమని ఢిల్లీలో పైసలు పడుతున్నాయి
ఆరున్నర లక్షల కొత్త రేషన్ కార్డులను గతంలో బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు ఇవ్వనేలేదు అంటూ అబద్ధాలు చెబుతుంది. ఈ విషయం అప్పటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ నాయకుల ను అడిగితే తెలుస్తుంది. డూప్లికేట్ గాందీలకు తెలంగాణ ఇచ్చిన హమీలను అమలు చేసేలా బుద్ది ఇవ్వాలని మహాత్ముడి విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చాము