Suryaa.co.in

Andhra Pradesh

ఈనెల 25లోగా ఎన్నికలతో సంబంధం ఉన్నఅధికారులను బదిలీ చేయండి

– సిఎస్ డా.కెఎస్. జవహర్ రెడ్డి

అమరావతి,22 జనవరి:త్వరలో జరగనున్నసాధారణ ఎన్నికల నేపధ్యంలో ఒకే ప్రాంతంలో మూడేళ్ళు సర్వీసు పూర్తి చేసుకునే ఎన్నికల విధులతో సంబంధం ఉండే అధికారులు, సిబ్బందిని ఈనెల 25వ తేదీ లోగా బదిలీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.పొలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, సిబ్బంది ఖాళీల భర్తీ,బదిలీలు తదితర అంశాలపై సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా సహా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల కమీషన్ ఆదేశాలకు అనుగుణంగా రానున్న ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా జిల్లాల్లో వచ్చే జూన్ నాటికి ఒకే ప్రాంతంలో మూడేళ్ళ సర్వీసు పూర్తి చేసుకునే ఎన్నికల విధులతో సంబంధం ఉండే అధికారులు సిబ్బంది అందరినీ ఈనెల 25లోగా తప్పని సరిగా బదిలీ చేయాలని ఆయా శాఖల అధికారులకు సిఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.

పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన కనీస సౌకర్యాలు ముఖ్యంగా విభిన్న ప్రతిభావంతులైన ఓటర్లకు సౌకర్యవంతంగా ఉండేందుకు వీలుగా ఏర్పాటు చేయాల్సిన ర్యాంపులు వంటి సౌకర్యాలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి,విద్యా తదితర శాఖల అధికారులను ఆదేశించారు.

ఎన్నికల్లో డబ్బు,మద్యం,ఇతర వస్తువుల అక్రమ రవాణా నియంత్రణతో పాటు పటిష్ట నిఘాకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ చెక్కు పోస్టుల ఏర్పాటును తక్షణం పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి పోలీస్,స్పెషల్ ఎన్పోర్సుమెంట్ బ్యూరో, ఎక్సైజ్ తదితర శాఖల అధికారులను ఆదేశించారు.ఇంకా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి,జిల్లా ఎన్నికల అధికారులు(కలక్టర్) కార్యాలయాల్లో ఖాళీల భర్తీకి త్వరిత గతిన చర్యలు తీసుకోవాలని సిఇఓ,సిసిఎల్ఏ ను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.

ఈసమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ ఎన్నికల విధులతో సంబంధం ఉండి ఒకే ప్రాంతంలో మూడేళ్ళ సర్వీసు పూర్తి చేసుకునే శాఖల అధికారులు, సిబ్బందిని బదిలీ చేయాల్సిన వారిని గుర్తించగా ఇప్పటికే కొన్ని శాఖల్లో బదిలీలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా రెవెన్యూ,మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధిశాఖ, పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి,ఎక్సైజ్,స్పెషల్ ఎన్పోర్సుమెంట్ బ్యూరో(SEB),పోలీస్ శాఖల్లో బదిలీ చేయాల్సిన వారిని గుర్తించగా మూడు రోజుల్లో వారిని బదిలీ చేయాల్సిందిగా ఆయా శాఖల అధికారులకు సిఇఓ మీనా సూచించారు.

ఇంకా ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ స్పెషల్ సిఎస్ రజత్ భార్గవ,అదనపు డిజిపి శాంతి భద్రతలు ఎస్.బాగ్చి,సిడిఎంఏ వివేక్ యాదవ్,సెబ్ డైరెక్టర్ ఎం.రవిప్రకాశ్,ఐజి రవీంద్ర బాబు, అదనపు సిఇఓ కోటేశ్వరరావు,సంయుక్త కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి,నిషాంతి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE