– గిరిజన కానోయ్ స్ప్రింట్ ఛాంపియన్ షిప్ లో తెలంగాణ చరిత్ర సృష్టించింది
– సమగ్ర క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
– మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి
హైదరాబాద్: దేశంలోని తొలి జాతీయ గిరిజన కానోయ్ స్ప్రింట్ ఛాంపియన్ షిప్ 2025లో తెలంగాణకు విజేతగా గౌరవం దక్కింది. దేశంలో తొలిసారిగా నిర్వహించిన జాతీయ గిరిజన కానోయ్ స్ప్రింట్ ఛాంపియన్ షిప్ 2025లో తెలంగాణ చరిత్ర సృష్టించింది. 30 బంగారు, 40 వెండి, 18 కాంస్య పతకాలు సాధించి విజేతగా నిలిచింది. అస్సాం రాష్ట్రం రన్నరప్గా నిలిచింది.
అక్టోబర్ 28 నుండి 30 వరకు హైదరాబాద్లోని హుస్సేన్ లో జరిగిన మూడు రోజుల పోటీలు గిరిజన క్రీడా రంగంలో కొత్త మైలురాయిగా నిలిచాయి. గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఈ జాతీయ స్థాయి పోటీని గిరిజన సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణ సంస్థ (TCR&TI), గిరిజన సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించాయి.
దేశంలోని 10 రాష్ట్రాల క్రీడాకారులు 200 మీటర్లు మరియు 500 మీటర్ల దూరంలో పురుషులు, మహిళలు, 16 ఏళ్లలోపు, 16 ఏళ్ళు పైబడిన వయసు విభాగాల్లో కానోయ్ కయాక్ విభాగాలలో పోటీ పడ్డారు.
ఈ ఛాంపియన్ షిప్ ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై విజేతలను అభినందించారు. క్రీడాకారుల క్రమశిక్షణ, కృషి, పట్టుదల ప్రశంసనీయమని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి వాకి టి శ్రీహరి మాట్లాడుతూ దేశంలో తొలి జాతీయ గిరిజన కానోయ్ స్ప్రింట్ ఛాంపియన్షిప్ కి ఆతిథ్యం ఇవ్వడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అన్నారు. ఇది సమగ్ర క్రీడాభివృద్ధికి రాష్ట్రం కట్టుబడి ఉన్నదనడానికి నిదర్శనం అని కొనియాడారు.
గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. గిరిజన యువతను క్రీడల ద్వారా శక్తివంతం చేయడంలో గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ చేసిన కృషిని ప్రశంసించారు. విజేతలు, పాల్గొన్న క్రీడాకారులు, కోచ్లు, నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకి బహుమతులను, ప్రశంసా పత్రాలు అందించారు.
ఈ కార్యక్రమంలో డా. వి. సముజ్వాలా డైరెక్టర్, సర్వేష్ రెడ్డి, గిరిజన సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణ సంస్థ, కోటాజీ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి, రామకృష్ణ, కోచ్, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.