Suryaa.co.in

Telangana

ఖైరతాబాద్‌లో పద్మారావు పర్యటనకు అనూహ్య స్పందన

బీ.ఆర్.ఎస్. పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ సాయంత్రం ఖైరతాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గం పరిధిలోని బంజారాహిల్స్, సాయినగర్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పద్మారావు గౌడ్ ఎన్నికల ప్రచారానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. వివిధ బస్తీల్లో పద్మారావు గౌడ్ కు స్థానికులు బ్రహ్మరధం పట్టి తమ మద్దతును ప్రకటించారు.

ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ జంట నగరాలలోని అన్ని ప్రాంతాలతో తనకు సంబంధాలు ఉన్నాయని, ఆయా ప్రాంతాల సమస్యల పట్ల అవగాహన ఉందని తెలిపారు. సీతాఫల్మండి లోని తన కార్యాలయం ద్వారా గతంలో మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా వివిధ నియోజకవర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశానని తెలిపారు.

విలువల ఆధారిత రాజకీయాలకు, సిద్దాంతాలకు కట్టుబడి పని చేస్తూ పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నానని తెలిపారు. నిరంతరం ప్రజలతో అనుబంధం కలిగి ఉంటానని, ఎంపీ గా తనకు అవకాశం కల్పించాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీ.ఆర్.ఎస్. నేతలు ఎం.ఎం. శ్రీనివాస్, మన్నే గోవర్ధన తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE