కేంద్రాన్ని కోరిన ఎంపీ విజయసాయిరెడ్డి
ఏప్రిల్ 10: విశాఖ-బెంగళూరు: విశాఖ-చెన్నై పట్టణాల మధ్య విజయవాడ స్టాప్ తో వందేభారత్ ట్రైన్లు మంజూరు చేయాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ని రాజ్యసభ సభ్యులు,వైఎస్ఆర్సీపీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి కోరారు. పలు అంశాలపై ఆయన సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ మొదటి రోజు 120% ఆక్యుపెన్సీ ఉండటం మూలంగా ఆంధ్రప్రదేశ్ కు మరింత కనెక్టివిటీ ఆవశ్యకతను తెలియజేస్తుందని చెప్పారు.
పొదుపు మహిళల అర్బన్ మార్కెట్లు
స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేలా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ద్వారా ‘అర్బన్ మార్కెట్ల’ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం,విశాఖలో నెలకొల్పిన అర్బన్ మార్కెట్లు విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలోనే ఏర్పాటు చేయాలని మెప్మా నిర్ణయిందని చెప్పారు.అలాగే
రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం పండుగ వాతావరణంలో కోనసాగుతోందని,అడుగడుగునా ప్రజలు వైఎస్ఆర్సీపీ ప్రతినిధులకు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు.
టైగర్ ప్రాజెక్టు విజయవంతం ప్రశంసనీయం
మన జాతీయ జంతువు పులులను రక్షించడానికి తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని, ఈ మేరకు”ప్రాజెక్ట్ టైగర్” విజయవంతం కావడం ప్రశంసనీయమని అన్నారు.
2006లో పులుల సంఖ్య కేవలం 1411 ఉండగా ఇప్పుడు 6.7% వార్షిక వృద్ధితో 3167కి చేరుకుందని, కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అటవీశాఖ అధికారుల కృషికి ఈ విజయం మంచి గుర్తింపు అని చెప్పారు.
అణుశక్తి రంగంలో పరిశోధనలు జరగాలి
అణుశక్తి వల్ల పర్యావరణానికి నష్టం జరిగే రిస్క్ చాలా తక్కువని చెప్పారు. అణుశక్తి రంగంలో పరిశోధన, పరిశోధన-అభివృద్ధిని పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎకనామికల్ ఎనర్జీ కోసం దేశంలో పూర్తిగా సురక్షితమైన, కొత్త అణు విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశాలను అన్వేషించాలని ఆయన కేంద్రాన్ని కోరారు.