– కేంద్రం నిర్దేశించిన లక్ష్యం కన్నా అధికంగా ధాన్యం సేకరణ
– ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశంలో మూడో స్థానంలో తెలంగాణ
– రైతుబంధు, బీమా, 24గంటల ఉచిత కరెంటు, కాళేశ్వరం వంటి పథకాలతోనే ఇది సాద్యం
– 6872 కొనుగోళు కేంద్రాలతో 13,690 కోట్ల విలువగల ధాన్యాన్ని 12.78 లక్షల మంది రైతుల వద్దనుండి సేకరించాం
– ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల కమలాకర్ ప్రకటన
రైతు అనుకూల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్ర బీజేపీ సర్కార్ నిర్దేశించిన టార్గెట్ కన్నా అధికంగా ధాన్యం సేకరణ తెలంగాణ రాష్ట్రంలో జరిగిందన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, దేశ వ్యాప్తంగా సేకరించిన 593 లక్షల మెట్రిక్ టన్నులలో 70 లక్షల మెట్రిక్ టన్నులతో తెలంగాణ మూడో స్థానంలో ఉందన్నారు.
శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటన ద్వారా ఆ వివరాల్ని వెల్లడించారు. ప్రతీ గింజా కొనాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గత సంవత్సరం కన్నా దాదాపు 44 శాతం అధికంగా 21.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అదనంగా సేకరించామని, దాదాపు 70 లక్షల మెట్రిక్ టన్నుల్ని సేకరించి కేంద్రం నిర్దేశించిన దానికన్నా 1.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎక్కువగా సేకరించామన్నారు. ఇందుకోసం కరోనా క్లిష్ట కాలంలో అత్యధికంగా 6872 కొనుగోళు కేంద్రాల ద్వారా 13,690 కోట్ల విలువగల ధాన్యాన్ని 12.78 లక్షల మంది రైతుల నుండి సేకరించామన్నారు. రెండు రోజుల నుండి అత్యధికంగా వారంలోపే రైతుల ఖాతాల్లోకి నగదును బదిలీ చేస్తున్నామన్నారు.
గతం కన్నా 5 కోట్ల అధిక గన్నీ సంచుల్ని సకాలంలో అందుబాటులో ఉంచామని, అకాల వర్షాలతో అక్కడక్కడా తేమకు సంబందించిన ఇబ్బందులు మినహా దాన్యం సేకరణ సజావుగా నిర్వహించామన్నారు. అక్కడక్కడా కొనుగోలు కేంద్రాలకు వస్తున్న ధాన్యాన్ని సైతం తీసుకుంటున్నామన్నారు మంత్రి. రైతుబందు, రైతుబీమా, 24గంటల ఉచితకరెంటు, కాళేశ్వర జలాలు ఇలా ఎన్నో సంక్షేమ పథకాల్ని సీఎం కేసీఆర్ అమలు చేయడం వల్లే ఇదంతా సాధ్యమయిందన్నారు మంత్రి గంగుల కమలాకర్.