Suryaa.co.in

Andhra Pradesh

సంక్షేమంపై చర్చకు మేం రెడీ… జగన్ సిద్ధమా? !

-అడ్డగోలుగా అబద్ధాలు చెప్పడంలో జగన్ పిహెచ్ డి
-చంద్రబాబు వస్తే పెట్టుబడులు…జగన్ వస్తే దాడులు!
-మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్

మంగళగిరి: సంక్షేమం పేరుతో పేదల ఎకౌంట్లలో రూ.10 వేసి వంద లాగేయడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య, 5ఏళ్లలో 9సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనే సాకుతో సంక్షేమ పథకాలను కట్ చేస్తున్నారు… ఎవరి హయాంలో ఎక్కువ సంక్షేమం జరిగిందో చర్చించడానికి మేం రెడీ…మీరు సిద్ధమా అని యువనేత నారా లోకేష్ సిఎంకు సవాల్ విసిరారు. మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా చినకాకాని జూపిటర్ అపార్ట్ మెంట్ వాసులతో యువనేత సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… చరిత్రలో 100 సంక్షేమ పథకాలను రద్దుచేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమే. కన్నార్పకుండా అబద్దాలు చెప్పడంలో జగన్ పిహెచ్ డి చేశారు, ఎన్నికల సమయంలో ఎడపెడా హామీలిచ్చి ప్రజలు నిలదీస్తారని పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు. పేదవిద్యార్థుల ఉన్నత విద్య కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విదేశీవిద్య పథకాన్ని నిర్వీర్యం చేశాడు. జగన్ ఇద్దరు కుమార్తెలు విదేశాల్లో చదువుతున్నారు, పేదపిల్లలు విదేశాలకు వెళ్లి మంచి చదువులు చదవకూడదా? విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో ఫీజు రీఎంబర్స్ మెంట్ ఎగనామం పెట్టాడు. మేం అధికారంలోకి వచ్చాక పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానం తెస్తాం. ఫీజుబకాయిల కారణంగా యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో చిక్కుకుపోయిన 6లక్షలమంది సర్టిఫికెట్లను వన్ టైమ్ సెటిల్ మెంట్ చేసి విద్యార్థులకు అందజేస్తాం. జగన్ ఇచ్చిన హామీలపై ఎవరైనా నేరుగా లేదా సోషల్ మీడియాలో నిలదీస్తే తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారు. గత అయిదేళ్లుగా ఎపి సమాజం భయంతో బతుకుతోంది.

గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదు. జగన్ ను అరెస్టు చేస్తే వేలకోట్లు అవినీతి బయటకు వచ్చింది, చంద్రబాబు గారిని అరెస్టు చేస్తే ఆయన చేసిన అభివృద్ధి గుర్తుకు వచ్చింది. తప్పుడు కేసులతో చంద్రబాబును 53రోజులు జైలులో పెడితే ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో తెలుగుప్రజలు రోడ్లపైకి వచ్చిన ఆందోళనలు చేశారు. 5కోట్లమంది ప్రజల ఆశీస్సులతో ఆయన సింహంలా బయటకు వచ్చారు. చంద్రబాబు వస్తే రాష్ట్రానికి రోజుకో పెట్టుబడి వస్తుంది, జగన్ మళ్లీ వస్తే ప్రతిరోజూ ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీలపై దాడుల వార్తలే కన్పిస్తాయి. అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానికి మద్దతు తెలిపిన జగన్… అధికారంలోకి వచ్చాక మాటతప్పి మడమతిప్పారు. జగన్ ఒక విధ్వంస పాలకుడు… ప్రజావేదిక విధ్వంసంతో పాలన ప్రారంభించాడు. పోలవరం, అమరావతిని నాశనంచేసి మూడుముక్కలాట ఆడారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి మా నినాదం, అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో అమరావతి పనులు ప్రారంభిస్తాం. భూములిచ్చిన రైతులకు చెల్లించాల్సిన బకాయిలన్నీ వడ్డీతో సహా చెల్లిస్తామని యువనేత లోకేష్ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE