రండి… కాంగ్రెస్ పార్టీలో చేరండి!
– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి పిలుపు
విజయవాడ: ఏపీసీసీ చీఫ్గా బహిరంగ అప్పీల్ చేస్తున్న… కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద గౌరవం ఉన్న వాళ్ళు ముందుకు రావాలి… నాయకత్వం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ముందుకు రావాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఇక్కడి విలేఖర్లతో సోమవారం మాట్లాడారు. రాజకీయ ఆకాంక్ష ఉన్న వాళ్ళు, భవిష్యత్ లో ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటున్న వాళ్లు ముందుకు రావాలి.. అన్ని రిసోర్స్ కలిగిన వాళ్ళు ముందుకు రావాలని ఆమె కోరారు. ఇంకా, ఆమె ఏమన్నారంటే… అటువంటి వాళ్ళకు ప్లాట్ఫామ్ కల్పించేందుకు రెడీగా ఉన్నాం. కాంగ్రెస్ లో కార్యకర్తలు కమిట్ మెంట్ తో కూడిన వాళ్ళు.. కాంగ్రెస్ కార్యకర్తలు నిబద్ధతతో కూడిన వాళ్ళు.
పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు జెండాను నెత్తిన మీద పెట్టుకొని మోసిన వాళ్ళు. ప్రతి జిల్లాల్లో వాళ్ల తపన చూస్తే ఎంతో అభిమానం కలిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ మీద ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది. గ్రౌండ్ లెవల్ లో మంచి నాయకత్వం ఉంటే ఆదరించే ప్రజలు కోట్లలో ఉన్నారు. కోట్ల మంది ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ అని..అధికారంలో ఉంటే మంచి చేస్తుంది అని నమ్మకంగా ఉన్నారు. ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. ఎంతో మంది త్యాగాల పునాది కాంగ్రెస్. సోనియా గాంధీ తన పదవిని త్యాగం చేసి పార్టీని నడిపించింది.
రాహుల్ నేటికి ప్రజల కోసం కోట్లాడుతున్నారు. ఇవన్నీ ప్రజలకు నమ్మకం కలిగించే అంశాలు. ఇవన్నీ ఉన్నా పార్టీ దగ్గర రిసోర్సెస్ లేవు. కాంగ్రెస్ పార్టీ దగ్గర రిసోర్సెస్ ఉంటే రాష్ట్రంలో పెద్ద ఫోర్స్ గా ఎదగ గలదు.
కాంగ్రెస్ సిద్ధాంతాలను గౌరవించే వాళ్ళు, ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను కలుపుకొని వెళ్ళే వాళ్ళు, వైఎస్ఆర్ ఆశయాలను నిలబెట్టే వాళ్లను కాంగ్రెస్ ఆహ్వానిస్తుంది. చేరికలకు నేను పూచి. నాకు కాంగ్రెస్ అభివృద్ధి ఒక్కటే అజెండా. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రావాలి.. దేశంలో రాహుల్ ప్రధాని అవ్వాలి. ఆంధ్రాలో కాంగ్రెస్ అధికారంలో వస్తే విభజన హామీలు అమలు అవుతాయి. నాయకులకు సూచిస్తున్నాం.. ప్రజాసేవ చేయాలని అనుకున్న వాళ్ళు ముందుకు రండి.
చివరి నిమిషంలో వచ్చి టికెట్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ముందు నుంచే ప్రజా సేవ చేయాల్సిన అవసరం ఉంది. నాలుగేళ్లలో ప్రజా నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంది. ఇప్పటి నుంచి పోరాటాలు చేస్తేనే ఎన్నికల నాటికి నాయకుడుగా ఎదుగుతారు. మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం.
ఉదయించే సూర్యుడిని ఎవరు ఆపలేరు. రండి..జాయిన్ విత్ మీ.. ఇది రాజశేఖర్ రెడ్డి ఆశయం. దేవుడు నిర్ణయించింది. అందరం కలిసి చరిత్ర సృష్టిద్దాం. కాంగ్రెస్ పార్టీలోనే స్వేచ్ఛ ఉంది. భాష, ప్రాంతం అని విభేదాలు ఉండవు. ఏ సమస్య వచ్చినా ఢిల్లీ దాకా చెప్పుకొనే స్వేచ్ఛ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఫ్రెష్ కాంగ్రెస్.
పార్టీ నడపాలి అంటే రిసోర్సెస్ కావాలి. ఏ పార్టీ అయినా నడవాలి అంటే అన్ని రకాల రిసోర్సెస్ కావాలి. కాంగ్రెస్ దగ్గర రిసోర్సెస్ మినహా అన్ని ఉన్నాయి. అందరం కలిసి బెటర్ ఇండియా చేద్దాం. ఆంధ్రా రాష్ట్ర విభజన కాంగ్రెస్ ది తప్పు కాదు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్ర విభజన చేయలేదు. అందరు ఒప్పుకుంటేనే రాష్ట్రం విభజన జరిగింది.
చిన్నమ్మ అని చెప్పి బీజేపీ రాష్ట్ర విభజన కు మద్దతు ఇచ్చింది. విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రాలేదు. ఇది చాలా సాడ్ పార్ట్. అప్పుడే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో వచ్చి ఉంటే విభజన హామీలు నెరవేరి ఉండేవి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉండేది. రాజధాని నిర్మాణం అయ్యేది.