ఆచరణ సాధ్యమయ్యే హామీలనే మేనిఫెస్టోలో పొందుపరుస్తాం

-డిక్లరేషన్ పేరుతో మోసం చేసే నైజం బీజేపీది కాదు…
-అణగారినవర్గాల అభ్యున్నతి కోసమే ఉచిత విద్య, వైద్యం, ఇండ్ల నిర్మాణం హామీలు
-హామీ ఇవ్వకపోయినా 27 మంది ఓబీసీలను మంత్రులుగా చేసిన ఘనత మోడీదే
-ఎస్సీ, ఎస్టీ, బీసీల పక్షపాతి బీజేపీ
-అంత్యోదయ సిద్దాంతం బీజేపీ లక్ష్యం
-అణగదొక్కితే ఆగిపోయే వ్యక్తిని కాను
-మేధావులారా…. బీసీల అభ్యున్నతి కోసం ఆచరణ సాధ్యమయ్యే హామీలివ్వండి
-బీసీ మేధావుల సమావేశంలో బండి సంజయ్ వ్యాఖ్యలు

‘‘‘ ఎన్నికలొస్తుంటే డిక్లరేషన్ పేరుతో ఓట్లు దండుకుని మోసం చేసే పార్టీ బీజేపీ కాదు. ఆచరణ సాధ్యమయ్యే హామీలను మాత్రమే మేనిఫెస్టోలో పొందుపరుస్తాం. అందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వండి. అట్టడుగునున్న చివరి వ్యక్తికి కూడా అంత్యోదయ ఫలాలు అందాలన్నదే బీజేపీ లక్ష్యం’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.

బీసీ మేధావుల సమావేశంలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ సీహెచ్.విఠల్, సభ్యులు బూర నర్సయ్యగౌడ్, చంద్రవదన్, ఎస్.కుమార్, వొడ్నాల శ్రీరాములు, ఆలె భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మేధావుల ఫోరం నాయకులు పార్దసారధి, వెంకటేశ్వర్లు, దివాకర్, సూరెపల్లి శ్రీనివాస్, విద్యాసాగర్, డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని, సదానందంతోపాటు సీనియర్ జర్నలిస్టులు పాశం యాదగిరి, విఠల్ సహా సంచార జాతుల సంఘం నాయకులు, వివిధ కుల వ్రుత్తుల నాయకులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీసీ సబ్ ప్లాన్, డిక్లరేషన్ పేరుతో ఓట్లు దండుకునే పార్టీలను, నాయకులను గుర్తించకపోతే బీసీలకు మరింత అణగారినవర్గాల వారుగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. బీజేపీ ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 27 మంది ఓబీసీలకు కేబినెట్ లో చోటు కల్పించిన చరిత్ర ఉందన్నారు.

పార్టీ సంస్థాగత కమిటీల్లో బీసీలకు 30 శాతం పదవులు కేటాయించకపోతే… వాటిని ఆమోదించే ప్రసక్తే ఉండదని గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎప్పటికప్పుడు బీసీ మంత్రులు, ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమై బీసీల అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తారని చెప్పారు. బీసీల శక్తితోనే యూపీలో అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

అణగారినవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలే అత్యధికంగా ఉన్నారని చెప్పారు. వారిని ద్రుష్టిలో ఉంచుకునే ప్రజా సంగ్రామ యాత్రలో ఉచిత విద్య, వైద్యం అమలు చేస్తామని, నిలువనీడ లేని వారికి ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తాను కార్యకర్త స్థాయి నుండి వచ్చానని, అణగదొక్కితే ఆగిపోయే వ్యక్తిని తాను కాదన్నారు.

సీహెచ్.విఠల్ మాట్లాడుతూ… సమావేశంలో వ్యక్తమైన సలహాలు, సూచనలను బీసీ డిక్లరేషన్ లో పొందుపరుస్తామని చెప్పారు. బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ… ఆత్మస్తుతి పరనింద విధానాన్ని మానుకుని బీసీల అభ్యున్నతికి సలహాలివ్వాలని కోరారు.

ఎస్.కుమార్ మాట్లాడుతూ… బూర్జువా పార్టీకి చెందిన కేసీఆర్ ను తెలంగాణ ఉద్యమ నాయకత్వం అప్పగించడంవల్లే అణగారిన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు బండి సంజయ్ నిరంతరం తపన పడుతున్నారని చెప్పారు. అందులో భాగంగానే ఏ పార్టీ చేయని విధంగా మేనిఫెస్టో ప్రిపరేషన్ స్టార్ట్ చేశారని చెప్పారు. బీసీ సబ్ ప్లాన్, డిక్లరేషన్ రూపకల్పన కోసం క్షేత్రస్థాయిలోకి వెళ్లి సలహాలు స్వీకరిస్తామన్నారు.

ఈ సందర్భంగా బీసీ కుల గణన చేపట్టాలని కోరుతూ కేంద్రానికి విజ్ఝప్తి చేయాలని, బీసీ బడ్జెట్ కేటాయింపులను పెంచడమే కాకుండా పూర్తిగా ఖర్చు చేయాలని, బీసీల్లో అణగారిన కులాల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, బీసీ వ్యక్తిని సీఎం అభ్యర్ధిగా ప్రతిపాదించాలని, ముస్లిం రిజర్వేషన్లతో బీసీలు నష్టపోకుండా చూడాలని పలు సలహాలు వచ్చాయి.

Leave a Reply