– మీ అంతు చూస్తాం.. హిందువుల రక్తం పారిస్తాం
– లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ సంచలన వ్యాఖ్యలు
– ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు
– సయీద్ హెచ్చరికలపై ఉడికిపోతున్న భారతీయులు
– పట్టుకుని ఉరితీయాలంటూ డిమాండ్
ఇస్లామాబాద్: భారత ప్రధాని మోదీపై లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ రెచ్చిపోయాడు. పాకిస్తాన్కు నీళ్లు నిలిపివేసిన వైనంపై సయీద్, భారత్పై కారాలు మిరియాలూ నూరాడు. భారత్లో రక్తం ప్రవహిస్తుందని హెచ్చరించాడు. యుద్ధం మొదలుపెడతామని ప్రకటించాడు. సయీద్ వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్ అయిన ఫలితంగా, సగటు భారతీయుడి రక్తం మరిగిపోతోంది. దానితో సయీద్ను పట్టుకుని ఉరి తీయాలని భారతీయులు గళమెత్తుతున్నారు.
“నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం. కశ్మీర్ నదుల్లో హిందువుల రక్తం పారిస్తాం. యుద్ధం మొదలు పెడతాం. మీ అంతు చూస్తాం. పాకిస్థాన్కు నీళ్లు ఆపుతారా? మీ ఊపిరి ఆపేస్తాం జాగ్రత్త. సింధూ నదిలో నీళ్లకు బదులు మీ రక్తం పారి స్తాం. మేం బంగ్లాదేశ్ను విడదీశామని ఢాకాలో నిలబడి చెబుతున్నారా? ఇందుకోసం నువ్వూ రక్తం ఇచ్చావని చెబుతున్నావ్ కదా ? మేం మౌనంగా ఉండేది లేదు నువ్వు అంటే మేమూ అంటాం. కశ్మీర్లో డ్యాం కట్టి పాకిస్థాన్కు నీళ్లు ఆపుతారా? మేం ఊరుకుంటామని అనుకుంటున్నారా?” అని మోదీపై హఫీజ్ సయీద్ ధ్వజమెత్తాడు.