Suryaa.co.in

Andhra Pradesh

లింగమయ్య కుటుంబానికి అండగా ఉంటాం

– శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణహత్యకు గురైన వైయస్సార్‌సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య
లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లిలో టీడీపీ నేతల చేతిలో దారుణహత్యకు గురైన వైయస్సార్‌సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు.

లింగమయ్య భార్యతో పాటు, ఆయన ఇద్దరు కుమారులు శ్రీనివాసులు, మురళితో వైయస్‌ జగన్‌ ఫోన్‌లో మాట్లాడారు. లింగమయ్య హత్యకు సంబంధించిన వివరాలు ఆరా తీశారు. ఉగాది పండగ రోజు గుడికి వెళ్లి వస్తుండగా, దారి కాచిన టీడీపీ గుండాలు దాదాపు 20 మంది తమ తండ్రిని దారుణంగా హతమార్చారని వారు తెలిపారు.

పార్టీ తప్పకుండా అండగా ఉంటుందని, ఆదుకుంటుందని ఫోన్‌లో పరామర్శ సందర్భంగా వైయస్‌ జగన్, లింగమయ్య కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఏ మాత్రం అధైర్యపడొద్దని, వచ్చే వారం స్వయంగా తాను వస్తానని వైయస్‌ జగన్‌ చెప్పారు
. కాగా, గ్రామంలో తమకు రక్షణ లేదని, స్థానిక ఎస్‌ఐ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ, తమను భయాందోళనకు గురి చేస్తున్నారని లింగమయ్య కొడుకు ప్రస్తావించారు. స్పందించిన వైయస్‌ జగన్, పార్టీ జిల్లా నేతలు, లీగల్‌సెల్‌ను అప్రమత్తం చేస్తామని, వారు తగిన రక్షణ కల్పిస్తారని ధైర్యం చెప్పారు.
‘మీ కుటుంబానికి ఏం జరిగినా చూస్తూ ఊరుకోం. పూర్తి అండగా నిలుస్తాం. అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఏ మాత్రం భయపడొద్దు. ధైర్యంగా ఉండండి’ అని వైయస్‌ జగన్, లింగమయ్య కుటుంబానికి భరోసా ఇచ్చారు.

LEAVE A RESPONSE