Suryaa.co.in

Telangana

ఆదివాసులు, అట్టడుగు వర్గాల కోసం నిలబడతాం….

– మంత్రి సీత‌క్క‌

ములుగు: మావోయిస్టుల లేఖ‌పై మంత్రి సీత‌క్క‌ స్పందించారు. ఈ మేరకు ఆమె ఏటూరు నాగారంలో మీడియాతో మాట్లాడారు. ఆ లేఖ మావోయిస్టు పార్టీ ఇచ్చిందా? లేదా? అన్న దానిపై స్పష్టత లేదు. అయితే లేఖ‌లో లేని అంశాల‌పై ఒక రాజ‌కీయ‌ పార్టీ ప‌త్రిక‌లు, మీడియా సంస్థ‌లు సొంత వ్యాఖ్యానాలు చేస్తున్నాయని విమర్శించారు. ఇంకా, ఆమె ఏమన్నారంటే.. మ‌హిళ అని చూడ‌కుండా అస‌భ్య ప‌ద‌జాలాన్ని వాడుతూ త‌మ రాజ‌కీయ క‌క్ష‌ను తీర్చుకుంటున్నాయి. మ‌హిళ‌పై అస‌భ్య ప‌ద‌జాలాన్ని వినియోగించ‌డం ఆవేద‌న క‌లిగిస్తోంది. ఒక మ‌హిళ‌ను ప‌ట్టుకుని సిగ్గులేదా అని రాయ‌డం ఏం జ‌ర్న‌లిజం?

నేను ఎన్నడూ ప్రజలకు దూరంగా లేను.. వారంలో రెండు, మూడు రోజులు ములుగు, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. నన్ను ఎన్నికల్లో ఓడించాలని ఎన్నో శక్తులు పని చేశాయి.

అవే శ‌క్తులు ఇప్పుడు న‌న్ను టార్గెట్ చేస్తున్నాయి. ఒక కోయ మ‌హిళ‌ల‌కు జ‌న‌ర‌ల్ పోర్ట్ ఫోలియో ద‌క్క‌డాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేక‌పోతోంది. 75 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా ఒక కోయ మహిళకు జనరల్ పదవి వస్తే స‌హించ‌లేక‌పోతున్నారు. నా వ్యక్తి గ‌త ప్ర‌తిష్ఠను దెబ్బతీసేలా తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నారు.

జీవో 49 తో అట‌వి బిడ్డ‌లు న‌ష్ట‌పోతార‌ని ఆ జీవోను వ్య‌తిరేకించాను. మా జీవితాలకు గొడ్డలి పెట్టు లాంటి జీవోను ర‌ద్దు చేయాల‌ని కోరాను. గిరిజ‌న సంక్షేమ మంత్రి కాకున్నా.. పార్టీల‌కు అతీతంగా ఎస్టీ ఎమ్మెల్యేలంద‌రితో స‌మావేశ‌మై జీవో 49 ను ర‌ద్దు చేయాల‌ని తీర్మాణించాం. ఏ హోదాలో, ఏ స్థాయిలో ఉన్నా నేను ఆదివాసి అడ‌వి బిడ్డ‌నే… వారి సంక్షేమం, అభివృద్ది కోస‌మే నా జీవితం అంకితం. ఆదివాసీలు, అణ‌గారిన వ‌ర్గాల కోసం విపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేశాను.

అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసులకు మేలు చేసేలా అధికారాన్ని వినియోగిస్తున్నాను. అడ‌వి బిడ్డ‌ల ప‌ట్ల‌ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్న అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. ములుగు, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం ఘ‌ట‌న‌లు మా దృష్టి రాగానే అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తో, ప్రిన్స్ ప‌ల్ చీఫ్ కన్సర్వేట‌ర్ ఆఫ్ ఫారెస్ట్ – పీసీసీఎఫ్ సువ‌ర్ణ గారితో స్వ‌యంగా మాట్లాడాను. భవిష్యత్తులో ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు చేప‌డుతామ‌ని వారు హ‌మీ ఇచ్చారు. ప్రతిపక్షంలోనైన అధికార పక్షంలోనైనా నాదొకటే నినాదం. కొత్త అడవి కొట్టొద్దు.. పాత అడవిని వదిలిపెట్టదు అన్న‌దే నా విధానం. అప్పుడైనా ఇప్పుడైనా అదే నా పోరాటం.. నా నియోజ‌క‌ర్గంలో కొంతమంది అడ‌వి అధికారులు ఆదివాసి గుడిసెల మీద దాడి చేశారు.

సొంత నిర్ణ‌యాల‌తో అధికారులు త‌ప్పు చేస్తే చ‌ర్య‌లు తీసుకుంటాం. ప్రజలకు న్యాయం చేస్తున్నాం… ఎక్కడ కూడా మా బాధ్యతలను విస్మరించలేదు. ఆదివాసులు, అట్టడుగు వర్గాలు, కష్టాల్లో ఉన్న ప్రజల కోసం నిలబడతాం.

LEAVE A RESPONSE