Suryaa.co.in

Andhra Pradesh

రెడ్ క్రాస్ అవార్డుకు ఎంపికైన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి

– మానవీయ సేవలలో అగ్రగామిగా అత్యున్నత పనితీరును చూపిన చదలవాడ

విజయవాడ: మానవీయ సేవల్లో మెరుగైన పనితీరుకు గుర్తింపుగా పశ్చిమ గోదావరి కలెక్టర్, జిల్లా మేజిస్టేట్ చదలవాడ నాగరాణి ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక అయ్యారు. ఇటీవల ముంచెత్తిన వరదలలో స్థానిక ప్రజానీకాన్ని ఆదుకునే ప్రయత్నంలో నాగరాణి చేసిన కృషి గుర్తింపుగా 2023–24, 2024–25 సంవత్సరాలకు గాను రెడ్ క్రాస్ ఈ అవార్డును ప్రకటించింది.

కనీస రవాణా సదుపాయాలు సైతం అందుబాటులోకి రాని విపత్కర తుఫాను పరిస్థితుల్లో ప్రోటోకాల్ ను పక్కన పెట్టి ద్విచక్ర వాహనంపై లోతట్టు ప్రాంతాలను సందర్శించి బాధితులకు బాసటగా నిలిచారు. బుడమేరు వరద ముంపు బాధితులకు అండగా దాదాపు వారం రోజుల పాటు విజయవాడకు పెద్దయెత్తున ఆహార పదార్థాలను సరఫరా చేయించారు.

పశ్చిమ గోదావరి జిల్లా నుండి వరద భాదితుల సహాయార్థం పెద్దయెత్తున నిధులు సమకూర్చి స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకుకి అందించి మరికొందరికి ప్రేరణగా నిలిచారు. నాగరాణి అందించిన సేవలకు గాను ముఖ్యమంత్రి అభినందనలు అందుకున్నారు. రాష్ట్ర గవర్నర్, రెడ్ క్రాస్ అధ్యక్షుడు మాననీయ ఎస్. అబ్దుల్ నజీర్ మార్గదర్శకత్వంలో రాష్ట్ర రెడ్ క్రాస్ సహజ విపత్తుల సమయంలో సహాయక చర్యలు, రక్తదాన శిబిరాలు, ఫస్ట్‌ఏయిడ్ శిక్షణా కార్యక్రమాలు, వృక్షారోపణ కార్యక్రమాలు వంటి అనేక మానవతా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందంజలో ఉంది.

ప్రపంచ రెడ్ క్రాస్, తలసీమియా దినోత్సవాల సందర్భంగా మే 8న విజయవాడ రాజ్ భవన్‌ దర్బార్ హాల్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా కలెక్టర్ నాగరాణికి ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు. 1920లో పార్లమెంట్‌లో ఆమోదించబడిన చట్టం ద్వారా స్థాపించబడిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, 1954లో సవరణ అనంతరం జాతీయ స్థాయిలో భారత రాష్ట్రపతి, రాష్ట్ర స్థాయిలో గవర్నర్ ఈ సంస్థకు అధ్యక్షత వహిస్తున్నారు. చదలవాడ నాగరాణి అందుకోనున్న ఈ అవార్డు, రాష్ట్రవ్యాప్తంగా మానవతా కార్యక్రమాల బలోపేతానికి కృషిచేస్తున్న సేవాభిమానుల త్యాగానికి ప్రతీకగా నిలుస్తుంది.

LEAVE A RESPONSE