Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయమంటే … మరి జగన్ బాబు బెయిల్ సంగతేంటి ?!

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెయిల్ షరతులను ఉల్లంఘించారని ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతున్న కొంత మంది చెట్టు కింది న్యాయవాదులు, ముందు షరతులను ఉల్లంఘించిన జగన్ బాబు బెయిల్ ను ఏమి చేయాలో చెప్పాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ షరతులను ఉల్లంఘించడమే కాకుండా, ఎంతోమందిని ప్రభావితం చేసే విధంగా వ్యవహరించారు.

బెయిల్ రద్దు చేయమని కేసు వేసిన నాలాంటి వారిని చంపాలని చూశారన్నది నిజం. కోర్టుకు విచారణకు హాజరు కావడం లేదనేది నిజం. కోర్టుకు హాజరు కాకపోతే బెయిల్ రద్దు చేయాలని కోర్టు షరతు విధించిన మాట నిజం. ఏ నిజాన్ని కూడా ఆ కోర్టు పరిగణలోకి తీసుకోలేదన్నది నిజం… ఈ నిజాలన్నింటినీ ప్రజా కోర్టు ముందు ఉంచుతున్నాను. ప్రజలే న్యాయ నిర్ణేతలు. న్యాయస్థానాలలో ఏమి జరుగుతుందో ననేది తెలియదన్నారు. సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమం లో భాగంగా రఘురామకృష్ణంరాజు గారు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… సాక్షి దినపత్రికలో వైకాపా పార్టీకి చెందినవారు , చెట్టు కింద ప్లీడర్ల అభిప్రాయాలను, ప్రముఖ న్యాయవాదుల అభిప్రాయాలన్నట్టుగా ప్రచురించడం హాస్యాస్పదంగా ఉంది.

చంద్రబాబు నాయుడు కి బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఆయన బెయిల్ షరతులను ఉల్లంగించారని సాక్షి బఫూన్స్ అంతా కలిసి న్యాయవ్యవస్థను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నాన్ని చేస్తున్నారు.. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ షరతులను ఉల్లంఘించినట్లుగా పెన్ డ్రైవ్ ద్వారా సమర్పించిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం, ఆయన ఎటువంటి షరతులను ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. రోడ్డుమీద ఎవరైనా మహానుభావులు వస్తే, ప్రజలు రోడ్డు మీదకు వారిని చూసేందుకు రావడం ఖాయం. మనమైతే డబ్బులు ఇచ్చి జనాలను తోలుకు రావాలి. జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారిని తిలకించడానికి జనం విచ్చేస్తే, న్యాయ మూర్తులు ఏమి చేస్తారని ప్రశ్నించారు. రోగం కారణంగా బెయిల్ వచ్చిందని కొందరు మాజీ మంత్రులు వ్యాఖ్యానించారు. మరి మీకు ఏ రోగం వచ్చిందని సాక్షి దినపత్రికలో ఇటువంటి చెత్త రాతలను రాస్తున్నారు.

కండిషన్లను ఉల్లంఘించిన కారణంగా చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు చేయాలని ఎవరైతే చెట్టు కింద ప్లీడర్లు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారో, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ కండిషన్లలో ఒకటైన కంపల్సరిగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. కానీ జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు మూడు వేల పదిహేడు సార్లు కోర్టుకు హాజరు కాకుండా వాయిదా కోరారు. నేను ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ, సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాను. అత్యవసరమైతేనే కోర్టు విచారణ జగన్మోహన్ రెడ్డి ని పిలవాలని ఆరు నెలల క్రితం హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అంతకుముందు ఆయన ఎన్నిసార్లు పిలిచినా కోర్టు విచారణకు హాజరు కాలేదు. అప్పుడే అతని బెయిల్ రద్దు చేయాల్సిందని రఘురామకృష్ణం రాజు గారు అన్నారు.

బెయిల్ రద్దు చేయలేదంటే సిఐడి కోర్టును మేనేజ్ చేశారా? అని మేము మనవచ్చా? అంటూ నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి కోర్టు విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించాలంటూ చెట్టు కింది ప్లిడర్లకు ఆయన సూచించారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు విచారణకు పిలిచినా, ఏసీబీ కోర్టుకు హాజరయ్యారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి తరహాలో వాయిదా కోరలేదన్నారు. కోర్టు విచారణకు హాజరుకాకుండా ఎన్నోసార్లు గైరాజరైనా జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ ఎందుకు రద్దు చేయలేదు. ఇదే విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నన్ను పోలీసుల చేత కొట్టించి, వీడియో చూసి జగన్మోహన్ రెడ్డి ఆనందించారని రఘురామ కృష్ణంరాజు గారు అన్నారు.

సాక్షులను ప్రభావితం చేయవద్దని బెయిల్ కండిషన్లలో పేర్కొన్నప్పటికీ, అన్ని కేసులలో A2 నిందితుడైన విజయసాయి రెడ్డి గారి కి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఇంకొక కేసులో అప్పటి మంత్రి సహా నిందితునిగా ఉండగా ఆయనకు కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టారు. ఇంకొక కేసులో నిందితురాలిగా ఉన్న ఐఏఎస్ అధికారిని ఆంధ్రకు తీసుకొచ్చి పక్కనే పెట్టుకున్నారు. ఎంతోమంది నిందితులకు బ్రహ్మాండమైన లబ్ధి జగన్మోహన్ రెడ్డి గారు చేకూర్చారని అన్నారు.

సిమెంటు పోర్టల్ లో లయన్ షేర్ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ దైతే, సహా నిందితుల కంపెనీల వే ఇతర షేర్లు . సహా నిందితులు కాని వారు సిమెంటు కంపెనీ ఎక్కడ సిమెంటు పోర్టల్ లో ఉందని ప్రశ్నించారు. ఎక్కడికక్కడ సాక్షులను ప్రభావితం చేస్తూ, కేసు వేసిన వారిపై దేశద్రోహం కేసు నమోదు చేసి, లాకప్ లో చిత్రహింసలు పెట్టారు. అయినా ఇవేమి న్యాయస్థానానికి కనపడలేదన్నారు.

జగన్మోహన్ రెడ్డి పై సిబిఐ అభియోగాలను మోపి చార్జిషీట్లను దాఖలు చేసింది. డిశ్చార్జ్ పిటిషన్లతో కోర్టు సమయాన్ని మింగేస్తూ, ఎంతమందికి ఏమి మింగిస్తున్నారు తెలియదు. పదేళ్లుగా 11 చార్జి సీట్లలో ఉన్న 100 మంది వ్యక్తులు, డిశ్చార్జ్ పిటిషన్లను వేస్తుండడం వల్ల ఇప్పటివరకు ట్రయల్ కూడా మొదలు కాలేదు. డిశ్చార్జి పిటిషన్ పూర్తి అయ్యే వరకు కేస్ పెండింగ్ అని అంటారు. చట్టంలోని లోసుగులను వాడుకొని పదేళ్లుగా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ, కాలయాపన చేస్తున్నారు. దీనితో ట్రయల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఆ దేవుడికే తెలియాలి.

11 చార్జిషీట్ కేసులలో A1 నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నేరం ఒప్పుకుంటారా? లేదా?? అన్నది తేలిన తర్వాతే నేను నేరం ఒప్పుకోనని చెబితే ట్రయల్ ప్రారంభమవుతుందన్నారు.. సిబిఐ తరఫున ప్రాసిక్యూషన్ న్యాయవాది, డిఫెన్స్ న్యాయవాదిగా జగన్మోహన్ రెడ్డి గారి తరపున, నిరంజన్ రెడ్డి గారో , మరొకరో కేసును వాదిస్తూ ఉండవచ్చు. వాదనలు జరగాలంటే ఇంకో పదేళ్ల సమయం పట్టవచ్చు. దీనికి అంతం ఏప్పుడో ?

సిబిఐ కోర్టులో దారుణం జరుగుతోందని నేను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వెళ్లాను. హైకోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి ని అత్యవసరమైతేనే విచారణకు పిలవాలని వెలువరించిన నేపథ్యంలో, కోర్టు మారుస్తారా?, త్వరగా విచారణ పూర్తి చేయమని ఆదేశిస్తారా? లేకపోతే బెయిల్ క్యాన్సల్ చేస్తారా? అన్నది చూడాలన్నారు. బెయిల్ షరతులను ఉల్లంఘించిన జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారు. జైలు నుంచి బెయిల్ పై విడుదలైన చంద్రబాబు నాయుడు గారిని తిలకించడానికి జనం వస్తే,, న్యాయమూర్తులు ఏమి చేస్తారన్న వారు ప్రశ్నిస్తున్నారన్నారు .

ప్రజా కంఠకుడిని తిట్టకుండా నన్ను తిడతారేంటి అని బాధపడిన ప్రశాంత్ కిషోర్
ప్రజా కంఠకుడైన పరిపాలకుడిని తిట్టకుండా, తనని తిట్టడం ఏంటని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బాధపడ్డారని రఘురామ కృష్ణంరాజు గారు తెలిపారు. ఫ్రీగా ఇస్తే ఒక రాష్ట్రం ఏమైపోతుందో ఆంధ్ర ప్రదేశ్ ను చూడండి అని గతంలో పేర్కొన్న ప్రశాంత్ కిషోర్ గారు, తనపై నీలాపనిందలు వేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి మంచివాడని తనలాగే, ప్రజల లాగే ప్రశాంత్ కిషోర్ నమ్మారన్నారు. అతని ఎవరైనా నమ్ముతారని, అంతటి మహానటుడు జగన్మోహన్ రెడ్డి . రాష్ట్రంలో పని చేస్తున్న ఐపాక్ టీంకు ప్రశాంత్ కిషోర్ కి సంబంధం లేదు. ఈ సంస్థ కు రిషి రాజ్ సింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

ఐప్యాక్ ను వదిలేసి ప్రశాంత్ కిషోర్ , బీహార్ లో పార్టీని స్థాపించి ప్రచారం నిర్వహించుకుంటున్నారు. మధ్య నిషేధం అమలు చేస్తే ఎన్నికల్లో ఓట్లు వస్తాయని ప్రశాంత్ కిషోర్ గారు చెబితే, కొన్ని వేల కోట్లను తినడానికి ముఖ్యమంత్రి మద్యం విక్రయాలను వేదికగా మలుచుకున్నారు. నిషేధానికే నిషేధాన్ని విధించిన జగన్మోహన్ రెడ్డి పాతిక నుంచి 30 వేల కోట్ల రూపాయలను దోచేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ గారి లాంటి వ్యూహ కర్త కేవలం మేనిఫెస్టోని రూపొందిస్తారు. ఆయన ఏమి బెస్ట్ అవైలబుల్ స్కూల్ లను ఎత్తివేయమని చెప్పలేదు.

షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి పథకాలను తీసివేయమని చెప్పలేదు. కానీ ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను ఎత్తివేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేసి, సర్వనాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని అన్నారు. ఒక్క అవకాశం అంటే అధికారాన్ని కట్టబెట్టారని, ప్రజలు మళ్ళీ అటువంటి తప్పు చేయవద్దని రఘు రామకృష్ణం రాజు గారు కోరారు.

ఈ ప్రభుత్వం పడిపోయే వరకు రిజిస్ట్రేషన్లు చేయించుకోవద్దు
ఈ ప్రభుత్వం అధికారంలో నుంచి దిగి పోయేవరకు ప్రజలేవరు ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయించుకోవద్దని రఘురామకృష్ణం రాజు గారు కోరారు. డాక్యుమెంట్ ఉన్న, డాక్యుమెంట్ ఇవ్వని వ్యవస్థను తీసుకువచ్చి దాన్ని మోడ్రన్ వ్యవస్థగా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. ఆస్తి నీది పేపర్ నాది అనే కాన్సెప్ట్ తో జీవో ఇచ్చారు.. రిజిస్ట్రేషన్ స్టాంపులు కొనుగోలు చేయడానికి ఇబ్బంది అవుతుందని, ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చలాన్ కట్టేస్తే, రిజిస్ట్రేషన్ అయిపోయిందని స్లిప్పు ఇస్తారట. ప్రాపర్టీ అంటే షానిటీటి ఉండాలి.

దేశం అంతా నడిచే సిస్టం కాదని, ఇటువంటి తింగరి పనులు చేస్తే సామాన్యులు ఇబ్బందులు పడతారన్నారు. గవర్నమెంట్ సిస్టం లో ఎవరైనా హ్యాక్ చేసి ఆస్తి పత్రాలను డౌన్లోడ్ చేసుకొని అమ్మితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ విధానం వల్ల బ్యాంకర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పారు. కలెక్టర్ ఆఫీస్, తాలూకా ఆఫీసును తాకట్టు పెట్టి, అప్పు తెచ్చి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వారు, రేపు ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టారన్న గ్యారంటీ ఏమిటి?. సివిల్ సప్లై కార్పొరేషన్ పేరిట 40 నుంచి 45 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ విషయం తప్పయితే.. సివిల్ సప్లై శాఖ పేరిట ఎటువంటి అప్పులు లేవని సంబంధిత శాఖ మంత్రి, లేదంటే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాలంటూ బహిరంగ సవాల్ చేస్తున్నానని రఘు రామ కృష్ణంరాజు అన్నారు.

ఎఫ్సీఐ తరఫున రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంద ని, రెండు నుంచి ఐదు వేల కోట్ల వరకు నిధులు ఉంటే సరిపోతుందన్నారు. మరి మిగిలిన డబ్బు ఏమైందని అప్పిచ్చిన బ్యాంకర్లు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. రేపు కార్పొరేషన్ ఎత్తేస్తే ఏం చేస్తారంటూ నిలదీశారు. అప్పుడు ప్రజల ఆస్తి పత్రాలను ఇచ్చేస్తారేమో తెలియదని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ విధానాన్ని అమలు చేయడం వెనుక ఏదో కుట్ర దాగి ఉండి ఉంటుందని రఘురామకృష్ణం రాజు గారు అన్నారు.

ఓడోర్ నెంబర్ పై కుటుంబ సభ్యుల ఓట్లతోపాటు అదనంగా ముక్కు మొహం తెలియని మరో నలుగురి ఓట్లను చేర్చారనే తనకు ఫిర్యాదులు అందినట్లు రఘురామకృష్ణంరాజు గారు తెలిపారు. ఆ కొత్త పేర్లు ఎవరివో తెలియదన్నారు. జీరో ఇంటి నెంబర్ పై, ఓకే డోర్ నెంబర్పై 100 ఓట్లు నమోదు చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనవద్దని ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పినప్పటికీ, రోజా అనే వాలంటీర్ బీ ఎల్ ఓ తో కలిసి అధికారి మాదిరిగా కూర్చొని ఓట్ల నమోదు ప్రక్రియ చేపట్టడం విడ్డూరంగా ఉంది. జయలక్ష్మి అనే మరో వాలంటీర్ కూడా అదేవిధంగా వ్యవహరించింది. మా ఓట్లు వేరే ఉన్నాయని సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొనడం వెనుక ఆంతర్యం ఇదేనేమోనని అన్నారు.

చనిపోయిన వారి పేర్లను కూడా ఓటర్ల జాబితా లో చేర్చడం, మా ప్రభుత్వం పింఛన్లు నొక్కేయడానికి, దొంగ ఓట్లను ఉపయోగించుకోవడానికై ఉంటుందని రఘురామకృష్ణం రాజు గారు పేర్కొన్నారు. ఒక్కొక్క గ్రామంలో 10 నుంచి 15 మంది చనిపోయిన వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చడం విడ్డూరంగా ఉంది. ఎన్నికల కమిషన్ కు ఎన్నో ఫిర్యాదులు అందిన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అర్థం కావడం లేదు. ఒక్కొక్క నియోజకవర్గంలో 15 నుంచి 20వేల దొంగ ఓట్లను నమోదు చేసినట్లు, చనిపోయిన వారిని బ్రతికి ఉన్నట్లుగా క్రియేట్ చేసి ఓట్లను నమోదు చేస్తున్నారన్నారు.

దొంగ ఓట్లని ఏరి వేయడానికి విద్యావంతులైన యువకులు ముందుకు రావాలన్నారు. అవసరమైతే న్యాయస్థానాలలో పోరాటం చేస్తూ, ప్రజా ఉద్యమం చేపడుదామని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఎన్నికల ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ లిస్ట్ విడుదలైన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉందో లేదో సరి చూసుకోవాలని, అలాగే దొంగ ఓట్లను తొలగించేందుకు కృషి చేయాలన్నారు.

LEAVE A RESPONSE