Suryaa.co.in

Andhra Pradesh

రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆర్కే చేసిందేమిటి?

*వైసిపి నుంచి బయటకెళ్లి జగన్ మోసం చేశాడన్నాడు
*ప్యాకేజి అందగానే జగనంత గొప్పోడు లేడంటున్నాడు
*రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్ ధ్వజం

మంగళగిరి: రెండుసార్లు ఆర్కేని మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన నియోజకవర్గానికి ఏం చేశారని యువనేత నారా లోకేష్ నిలదీశారు. మంగళగిరి నియోజకవర్గం చింతలపూడి, మంచికలపూడి, కాటంరాజు కొండూరు రచ్చబండ సభలకు హాజరైన యువనేత ఆయా గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆర్కే నియోజకవర్గంలో కనీసం రోడ్లువేయలేకపోయారు. ఇటీవల పార్టీనుంచి బయటకు వెళ్లేటపుడు జగన్ మంగళగిరికి మోసం చేశాడు, నిధులు ఇవ్వలేదన్నాడు. ప్యాకేజి అందగానే మళ్లీ వైసిపిలోకి వచ్చి జగనంత గొప్పోడు లేడంటున్నాడు. రెండునెలల్లో ఏమి మారిపోయింది? టిడిపి అధికారంలో ఉన్నపుడు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఆర్కే కేసులు వేసి అడ్డుకున్నారు.

గత ఎన్నికల్లో నేను ఓడిపోయినా ఇక్కడే ఉండి ప్రజలకు సేవచేశా, సొంతనిధులతో 29 సంక్షేమ కార్యక్రమాలు అమలుచేశా. గత ప్రభుత్వంలో మంగళగిరికి ఐటి కంపెనీలను రప్పించా. రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్కే స్థానిక యువతకు ఉద్యోగ,ఉపాథి అవకాశాలు కల్పించడంలో ఘోరంగా ఫెయిలయ్యాడని లోకేష్ దుయ్యబట్టారు.

దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్. జగన్ పాలనలో బాధితులుగా మారిన ప్రజలకు స్వాంతన చేకూర్చేందుకు బాబు సూపర్ -6 పథకాలను ప్రకటించాం. అధికారంలోకి వచ్చాక పథకాలను అమలుచేసి పేదలకు అండగా నిలుస్తాం. గత ఎన్నికల్లో ఓడిపోయినా ఎన్టీఆర్,చంద్రబాబు స్పూర్తితో ప్రజల్లోనే ఉంటూ సేవలందిస్తున్నా, నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా, గత అయిదేళ్లుగా నేను చేసిన మంచి పనులు చూసి నన్ను ఆశీర్వదించండి.

అండర్ గ్రౌండ్ డ్రైనేజి, రోడ్ల నిర్మాణం చేపడతాం
చింతలపూడి గ్రామస్తులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత దృష్టికి తెస్తూ… గ్రామంలో డ్రైనేజి సమస్య తీవ్రంగా ఉంది, పెండింగ్ లో ఉన్న సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాలి, శ్మశానాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. నారా లోకేష్ స్పందిస్తూ… ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంగళగిరి నియోజకవర్గ పరిధిలో భూగర్భ డ్రైనేజి ఏర్పాటుచేస్తాం, ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా సురక్షితమైన తాగునీరు అందిస్తాం.

జగన్ పాలనలో 30లక్షల ఇళ్లు కట్టిస్తామని చెప్పి 3వేల ఇళ్లు కూడా కట్టలేదు. మేం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గ పరిధిలో ఇల్లు లేని పేదలకు అధునాతన టెక్నాలజీతో 20వేల పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం. పెండింగ్ లో ఉన్న సిసి రోడ్లు, బిటి రోడ్లతోపాటు గ్రామంలో శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. నియోడజకవర్గ పరిధిలోని అటవీ, కొండవాలు ప్రాంతాలు, పోరంబోకు, రైల్వేస్థలాల్లో దశాబ్ధాలుగా నివసిస్తున్న వారికి పట్టాలు అందజేస్తాం. పొలాలకు వెళ్లే పుంతరోడ్లు, చెరువులు అభివృద్ధి చేస్తామని చెప్పారు.

లోకేష్ ను లక్ష మెజారిటీతో గెలిపించాలి: చిల్లపల్లి
మంచికలపూడిలో జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ… రచ్చబండ ద్వారా లోకేష్ గ్రామాలకు వచ్చి సమస్యలు తెలుసుకోవడం అభినందనీయమన్నారు. యువనేత లోకేష్ ను లక్ష మెజారిటీతో గెలిపించి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా అభివృద్ధి చేసుకోవాలని కోరారు.

మంచికలపూడి గ్రామస్తులు లోకేష్ ఎదుట సమస్యలు చెబుతూ… గ్రామంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి, తరచూ రైల్వే గేటు పడుతుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, దుగ్గిరాల వెళ్లేందుకు బస్ సౌకర్యం లేదు. గ్రామంలో సచివాలయం లేకపోవడంతో మోరంపూడి వెళ్లాల్సి వస్తోంది, ఇళ్లులేని వారికి పక్కా ఇళ్లు నిర్మించాలని కోరారు.

యువనేత లోకేష్ స్పందిస్తూ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే అన్ని గ్రామాల్లో భూగర్భ డ్రైనేజి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. 4నెలల్లో చింతలపూడి,మంచికలపూడి, కొండూరు కలిపే రహదారిని నిర్మాణం చేపడతామని చెప్పారు. మంచికలపూడి సచివాలయ నిర్మాణానికిచర్యలు తీసుకుంటాం. మాదిగ కమ్యూనిటీ హాలు, బిసిలకు కళ్యాణ మండపం నిర్మాణాలను కూడా చేపడతామని లోకేష్ హామీఇచ్చారు.

LEAVE A RESPONSE