Suryaa.co.in

Telangana

మేడిగడ్డకు బీఆర్‌ఎస్-బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు?

– కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎంగా మారిందని మోదీ అన్నారు కదా?
– మరి బీజేపీ ఎమ్మెల్యేలు మాతో మేడిగడ్డకు ఎందుకు రాలేదు?
– కేసీఆర్ పాలనలో ధ్వంసమైన జలదృశ్యం
– మేడిగడ్డకు వెళ్లే ముందు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణను పదేళ్లు పాలించిన కేసీఆర్ సారథ్యంలో జరిగిన జలదోపిడీ నిరూపించేందుకు, ఎమ్మెల్యేలతో కలసి మేడిగడ్డకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి… తమతో పర్యటనకు రాని బీజేపీ-బీఆర్‌ఎస్‌ను తూర్పారపట్టారు. స్వయంగా మోదీనే కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎంగా మారిందని ఆరోపిస్తే.. బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం పర్యటనకు దూరంగా ఉండటంలో, ఆంతర్యమేటని నిలదీశారు. బీజేపీ-బీఆర్‌ఎస్ చీకటిమిత్రులంటూ దునుమాడారు. ఆమేరకు ఎమ్మెల్యేలతో మేడిగడ్డకు వెళ్లేముందు, రేవంత్ చేసిన ట్వీట్ బీఆర్‌ఎస్-బీజేపీని ఆత్మరక్షణలో నెట్టాయి.

రేవంత్ ట్వీట్ సారాంశం ఇదీ..
తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైంది.రూ. 97 వేల కోట్లు వ్యయం చేసి కనీసం.. 97 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.ప్రాజెక్టు డిజైన్ నుంచి నిర్మాణం వరకు అన్నీతానై కట్టానని చెప్పిన కేసీఆర్.. మేడిగడ్డ కూలి నెలలు గడుస్తున్నా నోరు విప్పడం లేదు. మేడిగడ్డ మరమ్మతులకు పనికి రాదు.. పూర్తిగా పునర్ నిర్మాణం చేయాల్సిందేనని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడింది.ఈ నేపథ్యంలో వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలిపే ప్రయత్నమే ప్రజా ప్రతినిధుల నేటి మేడిగడ్డ పర్యటన.కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించాం.బీఆర్ఎస్ తో పాటు వారి చీకటి మిత్రులు బీజేపీ శాసన సభ్యులు మేడిగడ్డకు రావడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు చంద్రశేఖర్ రావుకు ఎటీఎంలా మారిందని..ప్రధాని మొదలు గల్లీ లీడర్ వరకు లొల్లి చేసే బీజేపీ నాయకులు.. వాస్తవాలు చూడటానికి క్షేత్రస్థాయికి ఎందుకు రావడం లేదు?అన్ని పార్టీల శాసన సభ్యులు ఒకవైపు ఉంటే, బీజేపీ- బీఆర్ఎస్ మాత్రం ఒకటిగా ఒకవైపు ఉన్నాయి. మేడిగడ్డ పర్యటనతో తెలంగాణ సమాజం తొమ్మిదిన్నరేళ్లు కేసీఆర్ పాలనలో విధ్వసమైన జలదృశ్యాన్ని కళ్లారా చూడబోతోంది

LEAVE A RESPONSE