గుంటూరు: రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న రైల్వే, రహదారులు, పర్యావరణ అనుమతుల కోసం కృషి చేస్తున్నట్లు భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. జిల్లాకు సంబంధించిన వివిధ అంశాలపై గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్తో జీవీఎల్ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పల్నాడులో కృషి విజ్ఞాన కేంద్రం, రొంపిచర్లలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. జిల్లాలో వరికపూడిశల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. పల్నాడులో బుగ్గవాగు ప్రాజెక్టును సాగు, తాగు నీటి అవసరాలు తీర్చేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. విభజన తర్వాత ఏపీకి రావాల్సిన జాతీయ సంస్థలను తీసుకొస్తున్నామని చెప్పారు. మిగతా పార్టీలు రాజకీయాల గురించి మాట్లాడుతాయని.. భాజపా దృష్టంతా దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమంపైనే ఉంటుందని జీవీఎల్ నరసింహరావు వెల్లడించారు.